Tuesday, December 22, 2009

తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !



తెలంగాణా : గాంధీ, నెహూృల ఆత్మఘోష !


(... మహాత్మా గాంధీ హఠాత్తుగా నిరాహార దీక్షకు దిగారన్న వార్తతో అంతవరకూ ప్రశాంతంగా వున్న స్వర్గలోకంలో ఒక్కసారిగా అ లజడి చెలరేగింది.
జవహర్‌లాల్‌ నెహూృ హడావిడిగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని ఇక్కడ కూడా ఇదేం రామాయణమని గాంధీజీని మందలించబోయారు.
'నిరాహార దీక్షే' కాదు ''మౌనవ్రతం'' కూడా చేస్తున్నానని గాంధీజీ సైగ చేయడంతో చేసేదేంలేక ఆయన పక్కనే చేతులు కట్టుకుని కూర్చున్నారు.
ఇరవైనాలుగు గంటల అనంతరం ఆవేశం చల్లారి, మనసు కుదుటపడ్డ తరువాత తనంతటతానుగా దీక్ష విరమించారు గాంధీజీ.
''జవహర్‌'' అని ఆప్యాయంగా పిలుస్తూ నెహూృ భుజం మీద చేయివేశారు. ఆ చల్లని స్పర్శకు పరవశించిపోయారు నెహూృజీ. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది:)

గాంధీ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గొడవను చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది జవహర్‌.

నెహూృ: రాష్ట్ర విభజన తప్పంటారా బాపూ?

గాంధీ:
లేదు జవహర్‌. రాష్ట్ర విభజన అనే అతి చిన్న సమస్యకు - దేశ విభజన స్థాయిలో రెచ్చిపోయి ఇలా దెబ్బలాడుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే కదా!

నెహూృ:
నిజమే బాపూ.

గాంధీ:
కూర్చుని చర్చించుకుంటే - ఒక్క పూటలో తేలిపోయే చిన్న సమస్యకు ఇంత గొడవ దేనికి జవహర్‌? మూర్ఖుల్లా, మొండిగా ప్రవర్తిస్తున్నారేమిటి తెలుగువాళ్లు? ఈ నిరాహార దీక్షల తంతేమిటి? ఈ బందులూ, ఆస్తుల విధ్వంసాలూ, దహనకాండలూ దేనికోసం? ఒకరు విడిపోతామంటుంటే మరొకరు టాఠ్‌ వీల్లేదు సమైక్యంగా మా కింద పడివుండాల్సిందే అనడమేమిటి?

నెహూృ:
అవును బాపూ.

గాంధీ:
మన దేశం పరిథిలో ఎన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడితే మాత్రం ఎవరికేం నష్టం జవహర్‌? ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని సంతోషించాల్సింది పోయి ఇట్లా తన్నుకు చస్తున్నారెందుకు?

నెహూృ: నాకు కూడా అదే అర్థం కావడంలేదు బాపూ. అయితే ఇందులో నా తప్పు కూడా వుంది.

గాంధీ:
నీ తప్పా?!

నెహూృ:
అవును బాపూ! ప్రజల ఆకాంక్షలు విస్మరించి ''తెలంగాణా'' విషయంలోనూ, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోబోయి ''కశ్మీర్‌'' విషయంలోనూ నేను రెండు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. వాటి ఫలితమే ఈ రావణ కాష్టాలు!

గాంధీ: బాధపడకు జవహర్‌. ఆ మాట కొస్తే తెలంగాణా విషయంలో నీతో పాటు నేనూ తప్పు చేశాను.

నెహూృ:
?!

గాంధీ: నిజాం సంస్థానాన్ని భారత జాతీయోద్యమం నుంచి మినహాయించి మనం తెలంగాణా ప్రజలకు దూరంగా వుండటం ఘోరమైన చారిత్రక తప్పిదం కదా.

నెహూృ: నిజమే బాపూ.

గాంధీ: పాపం తెలంగాణా ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో, దొరల రజాకార్ల దుర్మార్గాలకు విలవిల లాడుతున్నా కూడా మనం ఎన్నడూ పట్టించుకోలేదు. వారికోసం ఏ పోరాటమూ చేయలేదు. కనీసం తెలంగాణాలో నేరుగా ఒక్క స్వాతంత్య్రోద్యమ సభ అయినా నిర్వహించలేదు. 1947లో మనం ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నప్పుడు కూడా పాపం తెలంగాణా ప్రజలు తమ విముక్తి కోసం తామే ఒంటరిగా జీవన్మరణ సాయుధపోరాటం చేస్తుండిపోయారు.

నెహూృ:
అవును బాపూ. తెలంగాణా ప్రజలకు మనం మొదటినుంచీ ద్రోహం చేస్తూనే వచ్చాం. వాళ్లు జాగిర్దార్లను, భూస్వాముల్ని ఊళ్లల్లోంచి తరిమేసి లక్షలాది ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుని బడుగు వర్గాలకు చక్కగా పంచిపెడితే మనం సైనిక చర్య పేరిట నిజాంను లొంగదీసుకుని ఆ భూములన్నీ తిరిగి భూస్వాములకే అప్పగించాం. తెలంగాణా ప్రజలను శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేశాం.

గాంధీ: తెలంగాణా ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాం నవాబుకు మాత్రం భారత ప్రభుత్వం తరపున ''రాజ్‌ప్రముఖ్‌'' అన్న బిరుదునూ, అతని ఆస్తులకు రక్షణనూ, ఏడాదికి కోట్లాది రూపాయల రాజభరణాన్నీ ఇచ్చి సత్కరించాం. వాడు చచ్చేవరకూ ఊడిగం చేశాం.

నెహూృ: దాస్య విముక్తి అనంతరం కనీసం స్వతంత్ర భారతంలో వాళ్ల హైదరాబాద్‌ రాష్ట్రాన్ని అట్లాగే కొనసాగనివ్వకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో వాళ్లని దెబ్బతీశాం.

గాంధీ: ఇది మాత్రం నువ్వు పూర్తిగా తెలిసి చేసిన తప్పు జవహర్‌.

నెహూృ: ఒప్పుకుంటున్నాను బాపూ. అందుకు నేను కుమిలిపోని రోజంటూ లేదు. ఆంధ్ర నాయకులు చాలా చాల్‌బాజ్‌గాళ్లని నాకు మద్రాస్‌ రాష్ట్ర విభజనప్పుడే తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మాకు మద్రాస్‌లో కూడా భాగం కావాలంటూ పట్టుబట్టి పొట్టి శ్రీరాములును వాళ్లే బలితీసుకుని నన్ను బదనాం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని కర్నూలును రాజధాని చేయడం, దానిని అభివృద్ధిపరచడం కోస్తా నేతలకు ఇష్టంలేకుండేది. వాళ్ల కన్ను అప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం మీద పడింది. దాంతో నానా హంగామా చేసి, మాయమాటలు చెప్పి తెలంగాణా నేతల్నే కాదు నన్ను కూడా బుట్టలో పడేసుకున్నారు.

గాంధీ: వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు కావాలి కదా జవహర్‌. తెలంగాణా నిజాం పాలనలో భూస్వాములు, పటేల్‌ పట్వారీలు, అగ్రకులాల దాష్టీకంలో నలిగి పోయివుంది. సామాన్య జనం సర్వభ్రష్టులై పోయి వున్నారు. చదువు సంధ్యలు లేక, ఆర్థికంగా కుంగిపోయి తెలంగాణా ప్రజలు అ ల్లాడుతున్నారు. అట్లాంటి వాళ్లకు ఎదిగేందుకు చేయూత నివ్వాల్సిందిపోయి ...

నెహూృ:
తప్పు చేశాను బాపూ, తప్పు చేశాను. ఫజల్‌ అ లీ కమిషన్‌ మొత్తుకుంటూనే వుంది. అయినా పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ రూల్స్‌, ముఖ్యమంత్రి - ఉపముఖ్యమంత్రి పదవులు అంటూ నానా నక్కవినయాలూ ప్రదర్శించి నన్నే మోసం చేశారు. ఆనాడే అన్నాను బాపూ ... ''ఒక కొంటె కుర్రాడి చేతిలో అమాయకురాలైన అమ్మాయిని పెడుతున్నాం. వాళ్ల సంసారం ఎలా సాగుతుందా అని భయంగా వుంది. ఒకవేళ పొరపొచ్చాలొస్తే సామరస్యంగా విడిపోవాలి.'' అని కానీ వింటేనా. 1969లో పెద్ద ఎత్తున గొడవ చేసినా 370 మందిని చంపి మరీ తెలంగాణా ప్రజల ఆకాంక్షని, అస్తిత్వ ఆరాటాన్ని అణిచివేశారు. తిరిగి ఇవాళా అదే పని చేస్తున్నారు.

గాంధీ:
కాంగ్రెస్‌ పార్టీ 2004 నుంచీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి మరీ తెలంగాణాకు అనుకూలంగా వాగ్దానాలు చేస్తూనే వుంది. తెలుగుదేశం కూడా తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా సామాజిక తెలంగాణా అంది. మీరు తీర్మానం పెట్టండి మేం బలపరుస్తాం అంది. అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలూ బాహాటంగా హామీలు గుప్పించాయి. సోనియా గాంధీకి నిర్ణయాధికారాన్ని అప్పగించాయి. తీరా నిర్ణయం ప్రకటించగానే అన్ని పార్టీలూ రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించి సమైక్య రాగాలాపన చేయడం నయవంచన కదా జవహర్‌. నేను ఆనాడు సత్యం కోసం ఎంత తపించాను.

నెహూృ: ఇప్పుడు సత్యం ఎక్కడ వుంది బాపూ. దేశం అంతా స్వార్థంతో, లంచగొండి తనంతో అన్యాయాలతో లుకలుక లాడుతోంది. రాజకీయాలు లత్తకోరు వ్యాపారంగా మారాయి. ఎవ్వడూ మాట మీద కట్టుబడి వుండడం లేదు. జెండాలు వేరైనా అందరి ఎజెండాలు ఒక్కటే అదే స్వార్థం.

గాంధీ: మరి ప్రజలు ఈ అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని ఎందుకు ఎదిరించడంలేదు? నిన్నటి వరకు తెలంగాణాకు అనుకూలంగా తీర్మానాలు చేసి ఇప్పుడు సమైక్యత గురించి చిలుకు పలుకులు పలుకుతుంటే ఎందుకు నిలదీయడం లేదు?

నెహూృ: ఈ విష సంస్కృతికి చాలామంది బానిసలై పొయారు బాపూ. అందుకే చెడు అని తెలిసినా తమ స్వార్థానికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు సిగ్గుఎగ్గులేకుండా సమర్థిస్తున్నారు. మొండి వాదనలు చేస్తున్నారు. గుండాయిజమే నేటి నిజంగా మారిపోతోంది. మీరు చూపిన నిరాహార దీక్షలు దుర్మార్గుల, మూర్ఖుల, అవినీతిపరుల, అక్రమార్కుల చేతుల్లో శకుని పాచికల్లా మారి అపహాస్యం పాలవుతున్నాయి.

గాంధీ:
అవును జవహర్‌. నిన్న ఖద్దరు ధరించి జాతీయ జండా పట్టుకుని విజయవాడలో హైక్లాస్‌ నిరాహారదీక్షా ప్రహసనాన్ని కొనసాగించి... ఇవాళ హఠాత్తుగా జండా లేకుండా జర్కిన్‌ ధరించి దొంగలా నిమ్స్‌లో దూరిన లావుపాటి నా అనుచరుణ్ని చూసిన తరువాత నా మనసు వికలమయ్యే నేను ఇందాక దీక్ష చేశాను. అట్లాంటి వ్యక్తులకు కూడా జనం జై కొట్టడం, అతని తరపున సిగ్గులేకుండా నిలబడటం, వాదించడం చాలా మనస్తాపం కలిగిస్తోంది.

నెహూృ: ఆనాడు మీరు హింసా మార్గం అవలంభించాడని భగత్‌ సింగ్‌ అంతటి వాణ్నే ఖండించారు. కానీ ఇప్పుడు ఎవ్వరిలోనూ అట్లాంటి నిజాయితీ, ధైర్యం లేవు బాపూ.

గాంధీ: ఇలా అయితే నా దేశం ఏమైపోతుంది జవహర్‌.

నెహూృ:
ఇంక మీరు అటు వైపు తొంగి చూడకండి బాపూ. నేను కూడా చూడను. చూస్తే అక్కడి అమాయక జనంలా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే గుండె ఆగి అర్థంతరంగా చావాల్సి వస్తుంది!

గాంధీ:
అంతేనంటావా జవహర్‌.

నెహూృ: అంతే బాపూ.

...........

ఈశ్వర్ అల్లా తేరే నామ్
సబ్ కో సన్మతి దే భగవాన్
సారా జగ తేరీ సంతాన్
ఇస్ ధర్తీ పర బస్ నే వాలే
సబ్ హై తేరీ గోద్ కే పాలే
కో ఈ నీచ కో ఈ మహాన్
సబ్ కో సన్మతి దే భగవాన్ ...



......................

2 comments:

  1. Everything is god except

    ఒకరు విడిపోతామంటుంటే మరొకరు టాఠ్‌ వీల్లేదు సమైక్యంగా మా కింద పడివుండాల్సిందే అనడమేమిటి?
    In the real time telangana movement means forcing Andhra people to leave Hyderabad. In the last 60 years Andhra Pradesh didn’t improved much including Andhra and Rayalaseema

    Its because of our politicians irrespective of party and our constitution also failed in creating creative politics

    ReplyDelete
  2. కోస్తా ఆంధ్రలోని వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశంలని కూడా పాలకులు అభివృద్ధి చెయ్యడం లేదు http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_22.html

    ReplyDelete