Sunday, February 28, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డు రూపంలో నాకు అపూర్వ గుర్తింపు !


నేను అనువాదం చేసిన డా.యాగాటి చిన్నారావు పరిశోధన గ్రంథం ''ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' (దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ) కి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు(2009) ప్రకటించారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారికీ, గ్రంథ పరిశోధకులు డాక్టర్‌ చిన్నారావు గారికీ, ఈ అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు లోకి అనువదించే అవకాశం కల్పించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారికీ ప్రత్యేకించి ట్రస్ట్‌ నిర్వాహకులు శ్రీమతి గీతా రామస్వామి గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నాకు గతం లో ఆకాశ వాణి వారు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన రేడియో నాటక రచనల పోటిలో ( 1988 ) "అపరాజిత" నాటకానికి తృతీయ బహుమతి లభించింది. ఆ తరువాత కారణాంతరాల వల్ల అనువాదాల్లో కూరుకు పోయిన నాకు ఇప్పుడు ఈ విధంగా మరో జాతీయ పురస్కారం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఒక పక్క అవధుల్లేని ఆనందం - మరో పక్క స్వోత్కర్ష అవుతుందేమో అన్న జంకు వల్ల ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ రాయలేక పోతున్నాను.

అందరికీ అభివందనములు.
- ప్రభాకర్ మందార



ది హిందూ లో (27 ఫిబ్రవరి 2010) ప్రచురించిన న్యూస్ ఐటం

http://www.hindu.com/2010/02/27/stories/2010022754300400.htm

Andhra Jyothy

http://www.andhrajyothy.com/unicodevividhashow.asp?qry=2010/mar/1/vividha/1vividha5&more=2010/mar/1/vividha/vividhamain

.....

ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ (గోవా) లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.
సందర్భంగా తీసిన కొన్ని చాయా చిత్రాలు దిగువన పొందుపరుస్తున్నాను.



Thursday, February 4, 2010

ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో మరణించిన వేణుగోపాల్‌ది ఆత్మహత్యే అని నిర్ధారించిన ఫోరెన్సిక్‌ నివేదిక

.


.

జనవరి 19 రాత్రి ఎంసిఎ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో ఆత్మాహుతి చేసుకున్న సంఘటన తెలంగాణా ఉద్యమాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఆ మరునాడు వేణు భౌతిక కాయాన్ని ఉస్మానియా యునివర్సిటీ నుంచి నాంపల్లిలోని తెలంగాణా మృతవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు అనుమతించక నానా భీభత్సం సృష్టించిన సంఘటన మన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోయింది.

దీనికి తోడు అసలు వేణుగోపాల్‌ది ఆత్మహత్య కాదు ఎవరో కావాలని ఆయనను హత్యచేసి ఆత్మహత్యగా సృష్టించారు అన్న దుష్ప్రచారం తెలంగాణా గుండెను మరింత గాయపరిచింది.

సిద్దాంతాలనూ నీతి నిజాయితీలనూ గాలికి వదిలేసి పరమ రోతగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల, నేతల తీరును, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఇప్పటికే తెలంగాణాలో దాదాపు 250 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అయినా మన వ్యవస్థకు చీమకుట్టినట్టయినా లేకపోవడం, ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, నేతలు నిర్థిష్టమైన చర్యలేమీ తీసుకోకపోవడం దారుణం.
పైగా పుండు మీద కారం చల్లినట్టు వేణుది ఆత్మహత్య కాదు హత్య అనే దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టడం నిజంగా రాక్షసత్వమే.

కాగా, ఇవాళ వేణుగోపాల్‌రెడ్డిది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్‌ వర్గాలు నిర్ధారించాయి. మృతదేహంతో పాటు లభించిన సూసైడ్‌ నోట్‌లోని చేతిరాత వేణుగోపాల్‌దేనని కాలిగ్రఫీ నిపుణులు నిర్థారించారు.
ఈమేరకు ఈ రోజు దినపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.

వేణూ నీ విషయంలో నిజం నిప్పులాంటిది, సత్యమేవ జయతే అని మరోసారి నిరూపితమయింది.
వృధా కాదు నీ మరణం !
తెలంగాణా రాష్ట్ర సాధనే నీకు నిజమైన నివాళి !









.