Friday, July 5, 2013

నూటా ఇరవై ఏళ్ళుగా పిల్లల్నీ పెద్దల్నీ అలరిస్తున్న ఎవర్ గ్రీన్ కథలు

మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు
రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌

Curtesy : Hyderabad Book Trust


http://hyderabadbooktrust.blogspot.in/2013/06/blog-post_19.html

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ 'జంగిల్‌ బుక్‌' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్‌ చిత్రాలుగా, నాటకాలుగా వెలువడ్డాయి. బాయ్‌ స్కౌట్‌ వంటి ఎన్నో సంస్థలు వాటిని వినియోగించుకున్నాయి. ప్రధానంగా మొగ్లీ చుట్టూ తిరిగే తొమ్మిది కథలను ఈ తెలుగు అనువాదంలో పొందుపరచడం జరిగింది.

    కిప్లింగ్‌ కథనంలో పందొమ్మిదవ శతాబ్దపు ప్రకృతి చిత్రణ విధానం వ్యక్తమవుతుంది. మానవుల నియమాలకంటే ప్రకృతి నియమాలే ఎంతో ఉన్నతమైనవి అని చాటడం కనిపిస్తుంది. అడవిలో అజ్ఞానం, హింస కొంత ఎక్కువగా వున్నప్పటికీ మంచీ చెడు తెలిసిన, దేనినైనా ఎన్నుకునే స్వేచ్ఛ వున్న మానవ సమాజంలో వాటి పరిస్థితి మరీ దారుణం అంటారు. ఈ కథలు అడవిలో కాటగలసిపోయిన ఒక పసివాడికీ, మాట్లాడే జంతువులతో అతనికి ఏర్పడ్డ స్నేహానికీ సంబంధించిన కథలుగా పైకి అనిపిస్తాయి. కానీ ఎంతటి సమస్యలనైనా ఎలా ఎదుర్కోవాలో, స్నేహం ఎంత విలువైనదో చాటి చెప్పడమే వీటి ప్రధాన లక్ష్యం.

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రచనల మీద అనేక అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. ఆయన రచనల్లో అనేక వివాదాస్పద అంశాలు కూడా వున్నాయి. మొగ్లీ అడవి మీద సాధించిన పట్టు పరోక్షంగా భారతదేశం మీద తెల్లవారి పాలనను సూచిస్తుంది అంటారు విమర్శకులు. భారతదేశంలో పుట్టి పెరిగిన ఒక వలసవాద తెల్ల అబ్బాయి దృక్పథమే ఈ కథల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమయిందనీ, ఈ కథలను ఆ కోణంలోనే చూడాల్సి వుంటుందని కొందరు  భావిస్తారు. ఇందులో కనిపించే వివిధ జంతువులు భారతదేశంలోని విభిన్న తరహా వ్యక్తులను, వారి మధ్యనున్న హెచ్చుతగ్గుల దొంతరలను సూచిస్తున్నాయంటారు. బ్రిటిష్‌ పాలకులు విభిన్న వర్గాలకు చెందిన భారతీయులతో ఎలా వ్యవహరించారో మొగ్లీ కూడా ఆయా జంతువులతో అ లాగే వ్యవహరించడం కనిపిస్తుందంటారు. జంతువులకూ మనుషులకూ మధ్య వున్న తేడా, మొగ్లీ వాడిచూపుల వర్ణనల్లో ఇది స్పష్టమవుతుందనీ, మొగ్లీ తన కంటి చూపుతోనే జంతువులను హడలగొట్టడం, అదుపులో పెట్టుకోవడం దానినే సూచిస్తుందనీ అంటారు.

    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ రాసిన 'కిమ్‌' తన అభిమాన నవల అని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. కిప్లింగ్‌ 'బ్రిటిష్‌ సామ్రాజ్యవాద ప్రవక్త' అని జార్జి ఆర్వెల్‌ అభివర్ణించారు. అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యం అస్తమించిన తరువాత అందరూ ఆయనను ఒక అసాధారణ రచయితగా, వివాదాస్పదకోణంలో సైతం ఆ సామ్రాజ్య అనుభవాలకు భాష్యం చెప్పినవ్యక్తిగా గుర్తిస్తున్నారు. అనితరసాధ్యమైన రచనా శైలి ఆయన పేరుప్రఖ్యాతులను ఇంకా విస్తరింపజేస్తోంది.

    జంగిల్‌ బుక్‌ కేవలం పిల్లల పుస్తకమా?

    కొన్ని పరిమితులతో ఆలోచించినప్పుడు మాత్రమే ఇది పిల్లల పుస్తకం అన్న భావన కలుగుతుంది. కానీ ఇది పిల్లలూ పెద్దలూ అందరికీ వర్తించే పుస్తకమని కిప్లింగ్‌ని అభిమానించే విజ్ఞులైన అనేక మందిపాఠకులు విశ్వసిస్తారు. బాల్యంలో ఈ కథలను చదివినవాళ్లు లేదా విన్నవాళ్లు పెద్దయిన తరువాత ఈ పుస్తకాన్ని మళ్లీ ఎంతో ఆసక్తిగా తిరగేస్తూ ఆనందించడం సర్వసాధారణం.

    ఈ అద్భుతమైన కథలు పిల్లల్నీ పెద్దల్నీ ఆకట్టుకుంటాయి, అబ్బురపరుస్తాయి, ఆనందింపచేస్తాయి, ఆలోచింపజేస్తాయి. మళ్లీ మళ్లీ చదవాల్సిన కథలివి.
...
    రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌ (1865-1936) ఇంగ్లీష్‌ భాషనుంచి సాహిత్యంలో తొలి నోబుల్‌ బహుమతిని (1907) అందుకున్న రచయిత. అతి చిన్న వయసులో నోబుల్‌ పురస్కారాన్ని పొందినవాడిగా ఆయన రికార్డు ఇప్పటికీ అలాగే వుంది. కిప్లింగ్‌ ముంబయిలో జన్మించారు. ఆయన తండ్రి ముంబయి జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆర్కిటెక్చరల్‌ ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఐదేళ్ల వయసులో కిప్లింగ్‌ని తల్లిదండ్రులు ఇంగ్లండ్‌ పంపించారు. అయితే పదహారేళ్ల వయసులో ఆయన తిరిగి భారత దేశానికి వచ్చారు. ఏడేళ్ల పాటు ఇక్కడే పత్రికా రచయితగా పనిచేశారు. ఆ కాలంలోనే కిప్లింగ్‌ అనేక కథలు, కవితలు రాశారు. తదనంతరం కొంతకాలం అమెరికాలో వుండి బ్రిటన్‌ చేరుకుని శేష జీవితం అక్కడే గడిపారు.

    అనువాదకుడు ప్రభాకర్‌ మందార హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పాఠకులకు సుపరిచితులే. అనువాదాలతో పాటు పలు కథలు, రేడియో నాటికలు రాశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ప్రొ.యాగాటి చిన్నారావు పరిశోధనా గ్రంథం 'ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర' అనువాదానికి గాను 2009లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని (2009) అందుకున్నారు. అపరాజిత అనే నాటక రచనకు ఆకాశవాణి జాతీయ బహుమతిని(1987) గెలుచుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగవిరమణ చేశారు.



మొగ్లీ - జంగిల్‌ బుక్‌ కథలు
రడ్‌యర్డ్‌ కిప్లింగ్‌


స్వేచ్ఛానువాదం : ప్రభాకర్‌ మందార

166 పేజీలు, వెల : రూ. 100/-



ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849

Email: hyderabadbooktrust@gmail.com

.



Wednesday, July 3, 2013

కొత్తపుస్తకాలు

నమస్తే తెలంగాణా (3-7-2013) చెలిమె పేజీలో కొత్తపుస్తకాలు శీర్షిక కింద భారత రాజ్యాంగం పరిచయం:


http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=7/3/2013%2012:00:00%20AM&querypage=4

.