Sunday, March 3, 2024

బతకడమో గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది - కొండవీటి సత్యవతి

 బతకడమో-గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది.

-----కొండవీటి సత్యవతి
....................

"అడుగడుగున తిరుగుబాటు" గీతా రామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవడం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనసులో కదిలాయి.
పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె ఇబ్రహీంపట్నం మాదిగ వాడల్లో మాదిగ కుటుంబాలతో కలిసి బతికిన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. తిరుగుబాటు ఆమె రక్తంలోనే ఉన్నట్లుగా ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తల్లిదండ్రులతో పోరాటం చివరికి తనకి మానసిక సమస్య ఉన్నట్లుగా భ్రమించి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేంత భయంకరమైన అనుభవం నుంచి తన కోలుకున్న విధానం ఒళ్ళు జరదరించేలా తను వివరించింది.
సాధారణంగా ఆత్మకథల్లో కొన్ని అర్థసత్యాలు, మరికొన్ని అబద్ధాలు ఉండడం సాధారణంగా చూస్తాం. కానీ గీత తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని విశ్లేషించుకుంటూ ఎక్కడా వాటిపైన తెరలు వేయకుండా కుండబద్దలు కొట్టినట్లు వివరించింది. అది తల్లిదండ్రుల గురించి అయినా తన సొంత అక్క భర్త గురించైనా ఏమీ దాపరికం లేకుండా వివరించడం, ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి తీసుకురావడం చాలా ఆశ్చర్యకరం.
చదువుకునే రోజుల్లోనే ఎంతో ధైర్యంతో ఆలోచించిన గీత తన తల్లి గురించి ఒకచోట చెప్తుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని స్త్రీగా బతకడం అంటే కష్టాల కొలుముల్లో ఉండటమేనని ఆ కష్టాలను కొంతైనా తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని మా మనసుల్లో బాగా నాటుకుపోయేలా చేసిందామె. ఒక విధంగా అమ్మ నాకు మొట్టమొదటి ఫెమినిస్ట్ అని గీత ఒక సందర్భంలో అంటారు.
యుక్త వయసులో ఉన్నప్పుడే బహిష్టు గురించి సైన్స్ చెప్పే అంశాలను అర్థం చేసుకుంటూ 'బహిష్టు అనేది బిడ్డ పుట్టుకతో ముడిపడిన ప్రకృతి సిద్ధమైన, సహజమైన జీవ ప్రక్రియ అని నేను పాఠ్యపుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. ఆహార పదార్థాలు కుళ్ళి పాడైపోతున్నాయి అంటే అది వాటిలో ఉండే సూక్ష్మ క్రిముల వల్ల తప్ప బహిష్టైన స్త్రీ ముట్టుకున్నందువల్ల కాదని అర్థం చేసుకున్నాను.' అంటూ బహిష్టు గురించి చాలా సైంటిఫిక్ గా
వివరించింది.
1971 లో పాఠశాల చదువు ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు "ఇక నేను సాంప్రదాయక బ్రాహ్మణ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్లడం తప్పదని, ఆ భారం మోయడం స్త్రీలకి మరీ కష్టమని అర్థమయిపోయింది. దాన్నుంచి బయటపడాలంటే స్వతంత్రంగా నేనొక వృత్తిని ఎంచుకోవటమే మార్గమని నిర్ణయానికి వచ్చేసాను. ఇలాంటి ఆలోచనలతో హై స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు నేను రెండు వాగ్దానాలు చేసుకున్నాను. ఒకటి జీవితంలో ఏ పురుషుడి ముందుసాగిల పడకూడదు. రెండు నాలోని సామర్ధ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు సకల శక్తులు ఒడ్డాలి. నాకు ఇక ఆకాశమే హద్దు." ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆమె విశాల ప్రపంచంలోకి యూనివర్సిటీ, చదువులోకి అడుగు పెట్టింది.
యూనివర్సిటి లో చదుకున్నప్పటి అనుభవాలను, జార్జి రెడ్డి హత్య,1974 లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పాటు,వివిధ అంశాలపై చేసిన ఉద్యమాల గురించి ఎన్నో వివరులున్నాయి.
పీడీ ఎస్ యూ లో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాస్తూ" మేం ప్రజా ఉద్యమాలలో భాగమయ్యాం.జనంతో మమేకమై,విస్త్రుత ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎవరికైనా అది గొప్ప విముక్తి భావననిస్తుంది.మన వైఖరులు మారతాయి,అభిప్రాయాల్లో
స్పస్టత వస్తుంది.కొత్త సంబంధాలు ఏర్పడతాయి.ఐక్యత చిగురిస్తుంది.ఇక ధైర్యం,స్థైర్యం అనూహ్యంగా పెరుగుతాయి.ఒక్కసారిగా మన సత్తా ఎంతటిదో,మన శక్తి సామర్థ్యాలు లేమిటో మనకు తెలిసి వస్తాయి"అంటారు.
ఆ తర్వాత పార్టీలో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాసారు.
ఒకచోట పార్టీ ధోరణి గురించి రాస్తూ "పార్టీ ధోరణి చూస్తే-మనం కులాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు,కుల సమస్య పోయినట్టే అన్నట్టుగా ఉండేది.నాకూ నాలాంటి మరెంతో మందికీ 1985 లో కారంచేడు ఊచకోత సంఘటన జరిగే వరకూ కూడా కులం అనేది పెద్ద సమస్యగా కనిపించలేదు.మా మనసుల నిండా వర్గం గురించిన ఆలోచనలే ఉండేవి....కారంచేడు ఘటన ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది."
తను పనిచేసిన పార్టీ మీద అనేక విమర్శలు చేయడం కనిపిస్తుంది."పార్టీలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల గురించి ఆలోచన ఉండదు, వారి జీవితాల్లో విషాదాల గురించి పట్టించుకోరు."
1975 ఎమర్జెన్సీ అనుభవాలు,పార్టీని విడిచి పెట్టడం గురించిన వివరాలు రాస్తారు.అదే సంవత్సరం సిరిల్ తానూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం,తల్లితండ్రులు ఆమెని బలవంతంగా మద్రాస్ తీసుకెళ్ళిపోవడం,ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి దారుణంగా తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించడం గురించి రాసిన అనుభవం హృదయవిదారకంగా ఉంది.ఆ తర్వాత మోటార్ బైక్ మీద మద్రాస్ నుండి బెంగుళూరుకి,అక్కడి నుండి హైదరాబాద్ కు తప్పించుకుని పారిపోయిన వైనం హమ్మో! గీతా అనిపించక మానదు.
ఎలక్ట్రిక్ షాక్ సంఘటన చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గీత ఎంత బాధ పడి ఉంటుందో నేను ఊహించలేకపోయాను.
ఈ పుస్తకంలో ఈ సంఘటన చదివే వాళ్ళందరూ తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారని నేను అనుకున్నాను.
ఆ తర్వాత గీత పార్టీలో పనిచేసిన అనుభవాల గురించి చాలా క్రిటికల్ గా రాయడం కనిపించింది అడవుల్లో అజ్ఞాతంలో ఉండే మహిళల పట్ల మహిళా కామ్రేడ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారో రాస్తూ "నిస్సందేహంగా విప్లవం అంటే విందు పార్టీ కాదు" అని తేల్చేసింది. క్రమంగా తాను పార్టీకి ఎలా దూరమైందో రాస్తూ నాయకులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రవర్తన పట్ల తనకు చాలా ఏవగింపు కలిగింది. ఒకచోట పార్టీ గురించి రాస్తూ మార్కిస్ట్, లెనినిస్ట్ ఎం ఎల్ వర్గాల అవగాహన అంతా కూడా ప్రధానంగా మూడు సైద్ధంతిక భావనల చుట్టూనే తిరుగుతుంటుందని అర్థ భూస్వామ్యం (సెమీ ఫ్యూడలిసం) అర్ధ వలసవాదం(సెమీ కలోనియలిసం) దళారీ బూర్జువా వర్గం... దేశంలో నెలకొన్న అణిచివేత పరిస్థితులను వివరించేందుకు తరచూ మహా పర్వతాలు లాంటి ఈ మూడు భావనలనే ముందు పెడుతుంటారు. దశాబ్దాలుగా వల్లె వేస్తున్న ఈ మూడు పడికట్టు పదాలను వినీ వినీ నాకు మహా చికాకు వచ్చేసింది."
ఆ తర్వాత 1976లో హైదరాబాద్ వదిలిపెట్టి చండీగర్ వెళ్లిపోయిన అనుభవాల గురించి చాలా వివరంగా పుస్తకంలో రాసింది.
ఘజియాబాద్ లో బాల్మీకి అనే కమ్యూనిటీతో పనిచేసిన అనుభవాలను వారి ప్రేమాభిమానాల గురించి రాస్తూ "ఆ రోజుల్లో ఒకటి రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లో ఉన్న రైలు పట్టాల వరకు వెళ్లాను కూడా. 'ఆత్మహత్య చేసుకుంటావా అయితే చేసుకో' అన్న సిరిల్ మాటలే నన్ను వెనక్కి లాగాయి. ఆ మాటలు వింటుంటే ఉక్రోషం పొంగుకొచ్చేది. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించనందుకు తనమీద విపరీతమైన కోపం వచ్చేది. కనీసం సానుభూతిగా ఒక మాట అయినా అనొచ్చుగా అని ఉడికిపోతూ వెంటనే తిరిగి వచ్చేసేదాన్ని. "నచ్చినా నచ్చకున్నా ఇది జీవితం ఎదుర్కో.." అన్నట్టు ఉండేవి తన మాటలు.తాను పనిచేసిన బాల్మీకీలే తనను కాపాడారని,తాను పూర్తిగా కుప్పకూలిపోకుండా వారే కాపాడారని ఎంతో ఆర్తితో చెపుతుంది ఒకచోట.
ఎప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అని తనకు అనిపిస్తూ ఉండేదని ఎట్టకేలకు 1980లో హైదరాబాద్ కు తిరిగి రాగలిగామని అలా రావడం వెనక తనని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్ సిన్హా అని ఆయన సిరిల్ కి, జాజిరెడ్డికి సన్నిహిత మిత్రుడు అని ఒక చోట రాస్తుంది.
1980 లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం తనలో పేరుకుంటున్న డిప్రెషన్ కు మంచి ఔషధంగా పనిచేసిందని ఎంతో ఉత్సాహంతో ఆ పనుల్లో మునిగిపోయాయని చెబుతుంది. మెల్లగా హెచ్ బి టి పనుల్లో మునిగిపోయి తను రాష్ట్రమంతా తిరిగిన అనుభవాల గురించి కూడా రాస్తుంది. క్రమంగా హెచ్ బి టి ప్రాచుర్యం పొంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రచురించందని 1982 తనకి గొప్ప అనుభూతులను ఇచ్చిన సంవత్సరం అని అంటుంది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో పనిచేయడం మొదలుపెట్టిన నాలుగు సంవత్సరాలు తర్వాత తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్న తన చిరకాల వాంఛ తిరిగి తలెత్తింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పనుల మీద ఆంధ్ర రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు కత్తి పద్మారావు గారి లాంటి వ్యక్తులను కలుసుకున్నానని అలాగే బొజ్జా తారకం గారిని కలుసుకున్నానని రాస్తూ హక్కుల యోధుడు, అంబేద్కరిస్ట్, ప్రముఖ కవి, రచయిత, సీనియర్ న్యాయవాది తారకం రచనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి గ్రామానికి చేరాయి రెండు రాష్ట్రాల్లో దళిత కుటుంబాలను ఆయన మాటలు తాకాయని, చిక్కడపల్లి లో ఉండే తన ఇంటికి బొజ్జాతారకం ఇల్లు చాలా దగ్గరని తరచూ వారి ఇంటికి వెళ్లే దానిని చెబుతూ ఆ సమయంలో విజయభారతి తనను అక్కున చేర్చుకున్నారని తనకు మరొక కుటుంబంలా మారిపోయారని చాలా ఆత్మీయంగా వారిరువురి గురించి రాస్తుంది.
ఆ తర్వాత సవాలక్ష సందేహాలు పుస్తకం పనిమీద ఇబ్రహీంపట్నం వెళ్లడంతో తన జీవితంలో అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకుందని రాస్తూ ఇక అక్కడ నుండి పుస్తకం మొత్తం ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించిన పోరాటాల చరిత్రను చాలా వివరంగా సుదీర్ఘంగా రికార్డు చేసింది. మొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు తన వయస్సు 30 సంవత్సరాలు.
ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా జబ్బార్గూడెం, పులిమామిడి లాంటి గ్రామాల్లో జరిగిన భూ పోరాటాలు గురించి
ఇబ్రహీంపట్నం భూ పోరాటాలు ఉద్యమాలు రెడ్డి భూస్వాముల ఆగడాలు వారి క్రూరత్వం గ్రామీణ ప్రజల పట్ల వారి దౌర్జన్యాలు చదువుతున్నప్పుడు గుండె మండిపోతుంది.
ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమాలు అందులో గీతా రామస్వామి పోషించిన ముఖ్యమైన పాత్ర నిజానికి అందరూ చదవాల్సి ఉంది. సైకిల్ మీద తిరుగుతూ ఎంతో ధైర్యంగా గ్రామాల్లోకి వెళుతూ గ్రామస్తులకు, వారు చేస్తున్న భూ పోరాటాలకు అండగా నిలిచిన గీత అనుభవాలను చదివి తీరాల్సిందే. ఈ పోరాటాల సమయంలో తన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు, దాని నుండి తాను ఎట్లా బయటపడింది ఇవన్నీ కూడా ఎవరికి వారు చదివి అర్థం చేసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీత ఇబ్రహీంపట్నంలో అత్యంత వెనుకబడిన గ్రామాల్లో మాదిగ వాడల్లో వారితో పాటే బతుకుతూ ఆ తిండే తింటూ సాగించిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈనాటి తరానికి దారి దీపాలుగా అనిపించక మానవు.
కోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటాలు ఆయా సందర్భాల్లో తన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, భౌతిక దాడులు వీటన్నింటిని చదువుతున్నప్పుడు గుండెలవిసిపోయాయి.
గీత ఒకచోట ఇలా రాస్తుంది "అట్టడుగు కులాల వారు మన మీద ఎందుకంత ఆగ్రహంతో ఉంటారని మనలోని ఆధిపత్య కులాల వాళ్ళు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాల వారి పట్ల ఎలా ప్రవర్తించేవారో అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారి చేత ఎంత దారుణంగా పనిచేయించుకునేవారో, ఎలా వెట్టిచాకిరి చేయించుకునేవారో, వాళ్ల పొలాలను ఎలా ఆక్రమించుకునేవారో, వారి పంటలను ఎలా దోచుకునేవారో వారి స్త్రీలపై ఎలా అత్యాచారాలకు పాల్పడేవారో, వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేసేవారో, వారి పిల్లల్ని పశువుల కాపరులుగా ఎలా మార్చేసేవాళ్ళో, ఐక్యం కాకుండా ఎలాంటి రాజకీయాలు ప్రయోగించేవారో అట్టడుగు కులాల వారు ఎలా మర్చిపోగలుగుతారు" అంటుంది.
ఇంకొక చోట "ఈనాటి తెలంగాణ ప్రాంత రెడ్ల, వెలమల సిరిసంపదలకు ఆనాటి వారి పూర్వీకులు చేసిన దోపిడీకి మధ్య చాలావరకు అవినాభావ సంబంధం ఉంది. అయితే తాత ముత్తాతలు ఎప్పుడో చేసిన పాపాలకు ఈనాడు వారి పిల్లలను నిందించడం సబబేనా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు"
ఇక్కడ నేనొక అంశం చెప్పాలనుకుంటున్నాను. ఈమధ్య దళిత స్త్రీ శక్తి అనే సంస్థ ఒక పబ్లిక్ హీరింగ్ ని ఆర్గనైజ్ చేసింది. అందులో బాధితులంతా రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోని దళిత స్త్రీలు, పురుషులు. ఆయా గ్రామాల్లోని రెడ్లు వారిపట్ల చేసిన దారుణాల గురించి, అత్యాచారాల గురించి, వారి భూములను ఆక్రమించుకోవడం గురించి ఆ నాటి పబ్లిక్ హియరింగ్ లో చాలా వివరంగా చెప్పారు.
తెలంగాణ ప్రాంత భూస్వాముల రక్త చరిత్ర ఇంకా కొనసాగుతూ ఉండడం ఈ పబ్లిక్ హియరింగ్ లో స్పష్టంగా కనబడింది. దోపిడీ రూపం మారి ఉండొచ్చు కానీ ఇప్పటికీ గ్రామాల్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాల గ్రామాల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండడం వాస్తవం.
"అడుగడుగున తిరుగుబాటు" పుస్తకంలో గీత దాదాపు 200 పైన పేజీలు ఇబ్రహీంపట్నం భూ పోరాటాల గురించి, ఒక్కొక్క పోరాటం గురించి ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల గురించి ముఖ్యంగా మహిళల గురించి రాసిన విషయాలన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మాదిగ మహిళల జీవన విధానాలు, వారి పోరాటాలు కచ్చితంగా అందరం చదవాల్సిందే.
ఇబ్రహీంపట్నం భూపోరాటాల సమయంలో గీత మీద జరిగిన రెండు హత్యా ప్రయత్నాలు చదువుతున్నప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించడంతోపాటు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏమీ ఆ పోరాట స్ఫూర్తి ఏమి ఆ ధైర్యం అనిపించక మానదు.
పుస్తకంలో మనసు చివుక్కమనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పులు దండ వేయడం, గాజులు తొడగడం ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు కొంచం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే కొంతమంది తెలిసిన మితృలు గీత ఇంటి మీద దాడి చేసిన సంఘటన కూడా చదవడానికి చాలా కష్టంగా అనిపించింది.
చాలా ధైర్యంగా ఎలాంటి దాపరికం లేకుండా తన కుటుంబ విషయాలతో పాటు తన మిత్రులు చేసిన అవమానకర చర్యలను రాయగలగడం నిజానికి చాలా కష్టమైన పని. అయినప్పటికీ గీత దేనిని దాచుకోకుండా అన్నింటిని రాయగలిగింది.
ఈ పుస్తకంలో ఎంతోమంది పరిచయం ఉన్న వ్యక్తులు తారసపడతారు. కొన్నిచోట్ల వాళ్ళ వ్యక్తిత్వాలు గురించి చదివి చాలా ఆశ్చర్యపడ్డాను.
పుస్తకం చదివి చివరి పేజీల్లోకి వచ్చినప్పుడు పోరాటాల్లోనూ, ఉద్యమాల్లోనూ జీవితాన్ని గడిపిన గీత తనకంటూ ఓ పాప కావాలి అనుకోవడం ఆ సంఘటన గురించి రాయడం చాలా హృద్యంగా అనిపించింది. తనకంటూ ఓ బిడ్డ కావాలనుకుని
కన్నది. బిడ్డను పెంచుకోవడంలో మునిగిపోయి ఇబ్రహీంపట్నం పోరాటాలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేస్తారనే భయం వల్ల కూడా ఆ తర్వాత తను ఇబ్రహీంపట్నం వెళ్లలేకపోయింది.
ఈ పుస్తకం చదివి దీని మీద చాలా వివరమైన సమీక్ష రాయాలనుకున్నాను. నా సన్నిహితమితృరాలు చేసిన గొప్ప పోరాటాలు, ఒక్కొక్క పోరాటం గురించి చదువుతున్నప్పుడు గొప్ప విభ్రమకు గురయ్యాను. మనతోనే ఉన్న గీతా రామస్వామి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న విషయం ఈ పుస్తకం చదవకపోతే సూచనప్రాయంగా కూడా తెలిసేది కాదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. తన జీవితంలోని ఒక్కొక్క దశ, ఆ దశలో ఎదుర్కొన్న ఘర్షణలు, పోరాటాలు అన్ని చదువుతున్నప్పుడు ఎంతోమందికి ఆమె జీవితం ఆదర్శప్రాయం అవుతుందని, స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను.
నాకు గీతంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు తప్ప వేరే భాషలు ఏమీ తెలియకుండా నగరాలకు వచ్చిన నాలాంటి వాళ్లకు గొప్ప గొప్ప పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేయించి అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్, దానిని నిర్వహిస్తున్న గీత రామస్వామి అంటే నాకు చాలా ఇష్టం.
ఇంగ్లీషులో ఉన్న అలాంటి గొప్ప పుస్తకాలను చదవలేని నాలాంటి వాళ్ళం ఈ బుక్స్ చదువుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. జీవితాన్ని ఎంతో విస్తరించుకున్నాం.అందుకే గీత మీద నాకు ప్రత్యేకమైన ఆత్మీయత. ఈ పుస్తకం పూర్తి చేసిన వెంటనే ఇబ్రహీంపట్నం వెళ్లాలని తను పేర్కొన్న ఆయా గ్రామాలకు కొన్నింటికైనా వెళ్లి చూసి రావాలని చాలా బలంగా అనిపించింది. నేనెప్పుడూ రాచకొండ గుట్టలకు ఇబ్రహీంపట్నం మీదుగానే వెళుతూ ఉంటాను గీత పేర్కొన్న గ్రామాల్లో చాలా గ్రామాలు ఆ దారిలో ఉన్నాయి. తన పోరాటాలు చేసిన ఆ గ్రామాలను ఒకసారి చూడాలని, ఆ పోరాటాల్లో మిగిలిన, జీవించి ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని అనిపించింది. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా తరచుగా నేను రాచకొండ గుట్టలవేపు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎన్నో సంవత్సరాల పాటు ఆయా గ్రామాల్లో గీత నిర్వహించిన భూ పోరాటాలు, వాటికి వేదికలైన ఆ గ్రామాలు చూడడం ఒక గొప్ప అనుభవమౌతుందని నాకనిపిస్తోంది.
ఇంకా ఎంతో రాయాలని చెప్పాలని అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే వ్యాసం చాలా చాలా పెరిగిపోయింది.
అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను రికమెండ్ చేస్తున్నా. ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసిన ప్రభాకర్ మందార గారి అనువాదం చాలా తేటగా, ఒరిజినల్ లాగా ఉంది. అభినందనలు ప్రభాకర్ గారూ. గీత లవ్ యు... ఇంత మంచి పుస్తకాన్ని మనసు విప్పి రాసిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు నా స్నేహితురాలు అయినందుకు గర్వంగా కూడా ఉంది. థాంక్యూ సో మచ్.

Wednesday, January 10, 2024

 

 

 (గీతా రామస్వామి 'అడుగడుగున తిరుగుబాటు- ప్రజా జీవితంలో పోరాటాలు' పుస్తకంపై కె. రామచంద్ర మూర్తి గారి సమీక్ష ... సకలం.ఇన్ సౌజన్యంతో)

తిరుగుబాటే ఊపిరిగా

సాహసోపేతమైన జీవితం!

 

దేజావూ (déjà vu) అనే ఇంగ్లీషు మాటకు అర్థం మనసు పొరలలో ఏదో అనుభూతి నిక్షిప్తమై ఉన్నట్టు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను తాను ఎప్పుడో చూసినట్టూ, అనుభవించినట్టూ అనిపించడం. గీతా రామస్వామి రచించిన అడుగడుగున తిరుగుబాటు’ (ప్రజా జీవితంలో పోరాటాలు) చదువుతున్నప్పుడు నాలో కలిగిన అనుభూతి అదే. ఈ మహత్తరమైన రచనలో తారసపడే వ్యక్తులలో చాలామంది నాకూ తెలిసినవారు కావడం, నక్సైలైట్ ఉద్యమంతో పరిచయడం ఉండటం, దళిత ఉద్యమంతో అనుబంధం ఉండటం కూడా కారణం కావచ్చు.

బొజ్జా తారకం, కె. బాలగోపాల్, కన్నబీరాన్, గద్దర్, శాంతాసిన్హా, ఓల్గా, హరగోపాల్, బిఎస్ఎన్ స్వామి, రమామెల్కోటే, సురవరం సుధాకరరెడ్డి, ఎస్ ఆర్ శంకరన్, అఖిలేశ్వరి, విశ్వేశ్వరరావు, కత్తిపద్మారావు, విజయభారతి, పాల్ దివాకర్, లలిత, విఠల్ రాజన్, శశి, గొర్రెపాటి రవీంద్రనాథ్, చేకూరి రామారావు, గవర్నర్ కృష్ణకాంత్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి అనేకమందితో నాకు పరిచయాలు ఉన్నాయి. మా న్యూసైన్స్ కాలేజి ప్రిన్సిపల్ సుదర్శన్ ఇంట్లో జార్జి రెడ్డిని కలుసుకునేవాడిని. నక్సలైట్ ఉద్యమం తెలుసు. పోలీసుల జులుం చూశాను. హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థిగా, అయిదు దశాబ్దాలు జర్నలిస్టుగా పని చేసిన వ్యక్తిగా వీరందరితో పరిచయాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదువుతుంటే అంతా ఏదో తెలిసినట్టు, చూసినట్టు అనిపించింది. విజయవాడలో నివసించిన పదేళ్ళలో చేసిన, చూసిన ఆదర్శ వివాహాలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులతో సంభాషణలు, ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనుభవాలు, కార్మికుల కలహాల పరిష్కారాలు కూడా గుర్తుకొచ్చాయి. కారంచేడులో దళితుల హత్యాకాండ జరిగిన వెంటనే విజయవాడలో ఉన్న నాకు కత్తి పద్మారావు ఫోన్ చేసి ఘోరం జరిగిందని ఆవేశంగా చెప్పడం, ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు అనే సీనియర్ రిపోర్టర్ నీ, మారుతి అనే ఫొటోగ్రాఫర్ నీ కారు ఇచ్చి ప్రత్యేకంగా కారంచేడుకు పంపించడం, వారు జరిగిన వివరాలన్నీ తెలుసుకొని సవివరమైన వార్తలు అందించడం, నాతోపాటు ఉన్న యువజర్నలిస్టుల బృందం విజృంభించడం, ‘పులిచంపిన లేడినెత్తురుఅనే ప్రధాన శీర్షిక పెట్టడం, ఆ రోజు అక్కడే ఉన్న సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కి విషయం చెప్పడం, ఆయన కండకావరంఅంటూ సంపాదకీయం రాయడం, ‘ఉదయంపత్రికలో మొదటి పేజీతో సహా నాలుగు పేజీలు ఆ దుర్ఘటనకు సంబంధించిన వార్తలు సవివరంగా ఇవ్వడం వంటి అనేక జ్ఞాపకాలు తరుముకుంటూ వచ్చాయి. కారంచేడు కవరేజీలో ఉదయంవిజయవాడ ఎడిషన్ అద్భుతాలు చేసింది. మరే ఇతర పత్రికా అంత బాగా వార్తలూ, విశ్లేషణలూ, ఫొటోలూ ప్రచురించలేదు.

అడుగడుగున తిరుగుబాటువంటి పుస్తకం నేను ఇంతకు ముందు చదవలేదు. ఇంత నిజాయితీగా, నిర్భీతిగా, నీతిమంతంగా రాసిన పుస్తకం వేరొకటి నాకు తారసపడలేదు. పుట్టుక నుంచీ తిరుగుబాటే. తల్లితండ్రులను ఎదిరించి, ఉద్యమంవైపు అడుగులువేయడం, విద్యార్థిగా తిరుగుబాటు చేయడం, నక్సలైటు ఉద్యమంలో పని చేయడం, నక్సలైట్ నాయకత్వంతో విభేదించడం, ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలోని ఘజియాబాద్ లో బాల్మీకి సంతతితో కలిసి జీవించడం, వారికి చదవడం, రాయడం నేర్పించడం, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సమీపంలోని ఇబ్రహీంపట్నంలో సమాజంలో అత్యంత వెనకబడిన, వేల ఏళ్ళుగా అణచివేతకు గురవుతూన్న మాదిగలను ఉద్ధరించడానికి నడుంబిగించడం, వారితో కలిసి నిరాడంబరంగా జీవించడం, వారిని ప్రేమించడం, వారి విశ్వాసం పొందడం, గొడ్డుమాంసం తినడం, మైళ్ళకొద్దీ నడవడం, గంటలకొద్దీ మాట్లాడటం, రకరకాల వ్యక్తులతో, అధికారులతో సమాలోచనలు జరపడం, భూపోరాటాలకు నాయకత్వం  వహించడం, రాక్షస ప్రవృత్తి కలిగిన భూస్వాములనూ, పోలీసు అధికారులనూ ధైర్యంగా ఎదిరించడం, వారి మెడలు వంచడం, హత్యాప్రయత్నం నుంచి తలవెంట్రుకవాసిలో తప్పించుకోవడం, పంటలు నాశనం చేయడం, కొత్త పంటలు వేయించడం, చెట్లు పీకించడం, మోటార్లూ, పంపుసెట్లూ బావులలో వేయించడం, వేటగాళ్ళను వేటాడటం, ధర్నాలు చేయడం, కోర్టుల చుట్టూ తిరగడంఒకటేమిటి? ఇన్ని పనులు  ఒక మహిళ (భర్త సిరిల్ రెడ్డి సంపూర్ణ సహకారంతో) చేయడం, కొన్ని వందలమందికి వెట్టిచాకిరీ నుండి విముక్తి కలిగించడం, భూస్వాముల కొమ్ములు విరిచి వారి అధీనంలో ఉన్న భూములను పేద మాదిగలకు ఇప్పించడం, వారి పేరుమీద రిజిస్టర్ చేయించడం, వారు సేద్యం చేసి, ఫలసాయం అనుభవిస్తుంటే చూసి ఆనందించడం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 28 వేలమంది ఓటర్లు తాను ఎవరికి ఓటు వేయమంటే వారికి వేసే విధంగా ప్రభావం వేయడం వంటి అనేక ఘనకార్యాలు గీత చేశారు. కేరళ మూలాలున్న తమిళ బ్రాహ్మణ కుటుంబంల పుట్టిన గీత తెలంగాణను కార్యక్షేత్రంగా ఎంచుకొని ఇబ్రహీంపట్నం ప్రయోగశాలలో చేసిన అనేక ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. తిరుగుబాటు మనస్తత్వం ఆమెను ఒక చోట కూర్చోనివ్వలేదు. ఏ నియంత్రణ, ఆంక్షలు, అదుపాజ్ఞలు ఆమెపైన పని చేయలేదు. తన మనసు చెప్పినట్టు నడుచుకున్నది. కుటుంబంతో, సహచరులతో, సమాజంతో, రాజకీయ వ్యవస్థతో, పోలీసులతో, రెవెన్యూ సిబ్బందితో, న్యాయవ్యవస్థతో, భూస్వాములతో నిత్యం ఘర్షణ పడుతూ, తిరుగుబాటు చేస్తూ, ఉద్యమాలు నిర్వహిస్తూ, ఎత్తుగడలు వేస్తూ, వాటిని సమర్థంగా అమలు చేస్తూ, ప్రత్యర్థులతో తలబడుతూ, సంఘర్షణ చేస్తూ సత్ఫలితాలు సాధించడం విశేషం. ఇబ్రహీంపట్నం పేదల పక్షాన నిలిచి పదేళ్ళు సాగించిన పోరాటం ఒక ఎత్తు, తక్కిన జీవితం ఒక ఎత్తు. ఇన్ని పనులు చేస్తూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నిలబెట్టడం, అరుదైన పుస్తకాలు ప్రచురించడం, తక్కువ ధరకు పాఠకులకు మేలిరకం పుస్తకాలను అందించాలన్న లక్ష్యంతో పని చేయడం చెప్పుకోదగిన ఘనకార్యం.

ఈ పుస్తకం చదువుతుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. చాలా సందర్భాలలో గుండె గొంతుకలోకి వచ్చింది. క్షేత్రంలో చేసిన సాహసోపేతమైన అరుదైన పనిని పుస్తకంలో కళ్ళకు కట్టడం అన్నది గీత అద్భుతమైన సారస్వత ప్రతిభకు నిదర్శనం. ప్రభాకర్ మందార అనువాదం చాలాబాగుంది. నిజానికి ఇది అనువాదంలాగా లేదు. తెలుగులోనే చేయితిరిగిన రచయిత రాసినట్టు ఉంది.

నక్సలైటు లేదా మావోయిస్టు భావజాలానికి విజయం అసాధ్యమని తెలుస్తూనే ఉంది. ఇంత పెద్ద, బలిష్టమైన రాజ్యాన్ని ఎదిరించి,  ఓడించడం అసాధ్యం. తుపాకి ద్వారా విప్లవం అన్నది దుర్లభం. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న విప్లవ వీరులంటే గౌరవం ఉన్నమాట నిజమే కానీ వారి త్యాగాలు వృధా అవుతున్నాయనే మాట ఎవ్వరూ కాదనలేనిది. 1946-51 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సాధించిన విజయాలు పోరాట విరమణ అనంతరం గల్లంతైనాయి. అదే  భూస్వాములు కాంగ్రెస్ పార్టీ నాయకుల రూపంలో పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి తమ భూములు తాము స్వాధీనం చేసుకున్నారు. 1980, 1990లలో సాగిన నక్సలైట్ ఉద్యమ ఫలితాలు సైతం సంఘటితం కాలేదు. 1955లో ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తుందనుకున్న కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయినప్పటికీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనూ కమ్యూనిస్టు పార్టీ బలంగానే ఉండేది. 1964లొ చీలిపోయిన తర్వాత బలహీనపడిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక్క సీటు సాధించిన సీపీఐకీ, స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిన సీపీఎంకి స్వయంగా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నా చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన సామాజిక కార్యక్రమాలను కూడా ఇప్పటి కమ్యూనిస్టులు చేయడం లేదు. అడవులలో పోరాడుతున్న ఎంఎల్ గ్రూపులకూ, చట్టబద్ధమైన రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకూ గీతారామస్వామి పదేళ్ళలో చేసి చూపించిన విప్లవ రాజకీయం ప్రేరణ కావాలి. దళితులను అవసరమైనంతగా పట్టించుకోకపోవడం కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం. ఈ చారిత్రక తప్పిదాన్ని దిద్దుకోవడానికి గట్టిగా ప్రయత్నించలేదు. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం లాల్-నీల్ ప్రయోగం చేశారు కానీ అది కొనసాగలేదు. నిర్దిష్టమైన రూపం తీసుకోలేదు.

రాజ్యాంగబద్ధంగానే, చట్టాలను అమలు చేస్తూనే పేదవారికి ప్రయోజనం సమకూర్చే విధంగా పోరాటం చేయడం సాధ్యమేనని గీతారామస్వామి కార్యక్షేత్రంలో స్వయంగా సాధించి నిరూపించారు. ‘‘రాజ్యం ఏ చట్టాలనైతే చేసిందో ఆ చట్టాలే ఉల్లంఘనకు గురవుతున్నాయని ప్రత్యక్షంగా చూపిస్తూ యాక్టివిస్టులు ఉద్యమిస్తే విజయం సాధించడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. అలాంటి పోరాటాలకు భిన్న సామాజికవర్గాల నుంచి మద్దతు, సానుభూతి కూడా లభిస్తుంది. రాజ్యం కూడా తనను తాను చట్టబద్ధమైన, పాలనార్హత గల వ్యవస్థనని చెప్పుకొనేందుకైనా సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు చట్టవిరుద్ధమైన చర్యల మీద, అక్రమాల మీద మరింతగా దృష్టి పెట్టడం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించడం కూడా కొంతలో కొంత సులువు అవుతంది. అలా కాకుండా ఒక వైపు చట్టబద్ధమైన ప్రభుత్వ వ్యవస్థల పరిధిలో పని చేస్తూనే మరోవైపు రాజ్యం యొక్క చట్ట స్వభావాన్ని ప్రశ్నిస్తుండటం చాలా సంక్లిష్టమైన ప్రయాసగా తయారవుతుంది’’ అంటూ ఈ పుస్తకం 332వ పేజీలో రచయిత వెలిబుచ్చిన అభిప్రాయం సమర్థనీయమైనది. ‘‘అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ దేశంలో వామపక్షాలే గనక అంబేడ్కర్ ని అధ్యయనం చేసివుంటే, దళిత వర్గాలతో కలసి పని చేసి వుంటే రాజ్యాంగపరమైన అంశాలలో వారికి ఉన్న చాలా సందిగ్థతలు తొలగిపోయి, మరింత స్పష్టతతో పని చేయడం సాధ్యమయ్యేదని.’’ ఈ అభిప్రాయం నాకు చాలాకాలంగా ఉంది. ఈ పుస్తకం చదివిన తర్వాత, గీత సాధించిన విజయాలు గమనించిన అనంతరం అది మరింత దృఢపడింది.

‘‘ఉన్న వ్యవస్థలోనే కొద్దికొద్దిగా చోటు కల్పించుకోవడం, మెల్లగాదాన్ని విస్తరించుకోవడం, క్రమేపీ వాటినే ప్రజాస్వామీకరణకు బలమైన కార్యక్షేత్రాలుగా మలచుకోవడం చాలా ముఖ్యం. కొత్త వ్యవస్థలను ఆవిష్కరించే క్రమంలో   ఉన్న వ్యవస్థలో మనకున్న అవకాశాలను ఎంత వరకూ సాధ్యమో అంత వరకూ విస్తరించడం, ఆ వ్యవస్థను గరిష్ఠస్థాయిలో అంచులవరకూ నెట్టటమన్నది చాలా ముఖ్యమైన ప్రక్రియ’’ అని రచయిత స్వానుభవంతో చెప్పిన హితవు. రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్న మావోయిస్టులను పక్కన పెట్టినా, రాజ్యాంగ పరిధిలో పని చేస్తున్న కమ్యూనిస్టులు ఎన్నికల ప్రక్రియకే పరిమితం కాకుండా ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటీవీసీఎస్) చూపిన బాటను అనుసరించడం ఉత్తమమేమో ఆలోచించాలి. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టు నాయకులూ, కార్యకర్తలూ ఏమి చేస్తున్నారో, ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఇందుకు కరదీపికగా అడుగడుగున తిరుగుబాటుఉపయోగపడుతుంది.

https://www.sakalam.in/the-life-and-times-of-a-rebel/