Thursday, August 8, 2019

''నాకు కశ్మీర్‌ కావాలి'' - జవహర్‌లాల్‌ నెహూృ

''నాకు కశ్మీర్‌ కావాలి'' - జవహర్‌లాల్‌ నెహూృ

'... నెహూృ ఆలోచనలు కశ్మీర్‌ పైనే వున్నాయన్నది వాస్తవం. ఆయన ఉత్తర ప్రదేశ్‌లో పుట్టి పెరిగినప్పటికీ తన పూర్వీకులంతా కశ్మీర్‌లోని హిందూ సంపన్న వర్గానికి చెందిన వాళ్లు కావడం వల్ల కశ్మీర్‌తో నెహూృకు కొంత భావోద్వేగపరమైన అనుబంధం వుంది. ...

మొట్టమొదటిసారిగా నెహూృ పైలా పచ్చీసు వయసులో ఎలుగుబంటి వేటకోసం కశ్మీర్‌ వెళ్లారు. ఆ తర్వాత 1940 వరకూ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ కశ్మీర్‌ గురించి పర్యాటక ప్రచార కరపత్రాలలో వుండే అసహజమైన అభివర్ణనల మాదిరిగా ఆయన తన స్మృతులను రాసుకున్నారు.

''నేను ఆ అద్భుత సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ కశ్మీర్‌లో సంచరించాను. ఆ మైకం నా మనసంతా ఆవహించింది. కశ్మీర్‌ ఒక అతిలోక సుందరిలా వుంది. మానవాతీతంగా, మనిషి ఊహలకు అందని అందాలను కలిగివుంది. ఆ నదులూ, ఆ కొండలూ, కోనలూ, సరస్సూ ముగ్ధమనోహరమైన వృక్షాలూ అన్నింటిలోనూ స్త్రీ సౌందర్యం దోబూచులాడుతోంది. ఆ ప్రేమపూర్వకమైన సౌందర్యం నన్ను వివశుణ్ని చేసింది. నేను దాదాపు మూర్ఛిల్లిపోయాను'' అంటూ అభివర్ణించారు. ''కశ్మీర్‌ మళ్లీ పిలుస్తోంది. మునుపటి కంటే బలంగా నన్ను తనవైపు లాగుతోంది. వీనుల విందు చేసే ఆ చిరునవ్వుల చిరుసవ్వడి, ఆ జ్ఞాపకాలు నా మనసును వివశం చేస్తున్నాయి. ఒక్కసారి తన వశీకరణకు గురైతే ఎవరైనా ఆ మోహం నుంచి ఎలా బయటపడగలరు?''

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ వ్యూహకర్తలలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా కశ్మీర్‌ను మధ్య ఆసియా మార్గాలను నియంత్రించగల వ్యూహాత్మక రక్షణ ప్రదేశంగా భావించింది. అన్నింటికి మించి సైద్ధాంతికంగా దేశ ప్రతిష్టను పెంచే ప్రాంతమది. భారతదేశానికి కశ్మీర్‌ దక్కితే మొదటినుంచీ చెప్పుకుంటున్నట్టు తమది లౌకిక (సెక్యులర్‌) రాజ్యమనీ, హిందూ రాష్ట్రాలతో పాటు ముస్లిం రాష్ట్రం కూడా తమతో సహజీవనం చేయగలదనీ, భారత ఉపఖండాన్నినిట్టనిలువునా చీల్చిన పాకిస్థాన్‌ మాదిరిగా భారతదేశం ఏకపక్ష రాజ్యం కాదనీ చాటుకునేందుకు వీలవుతుంది.

నెహూృ కైతే కశ్మీర్‌ 'మరీ వ్యక్తిగత ప్రాధాన్యత' వున్న వ్యవహారంగా మారిపోయింది. ఆయన తన మనసులోని భావాలను ఏమాత్రం దాచుకోకుండా లార్డ్‌ మౌంట్‌బాటెన్‌కు చెప్పుకున్నారు. కశ్మీర్‌ తనకు అన్నింటికంటే ముఖ్యమైనదని వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు మౌంట్‌ బాటెన్‌ సతీమణి ఎడ్వినాతో ''నా మీద కశ్మీర్‌ విపరీతమైన ప్రభావం చూపుతోందనీ, ఒకోసారి అది సంగీతంలా, ప్రియురాలి సాంగత్యంలా అనుభూతిని కలిగిస్తోందనీ' చెప్పుకున్నారు. చిన్నపిల్లాడిలా ''నాకు కశ్మీర్‌ కావాలి'' అంటూ మారాం చేశారు.

ఆయన జూన్‌లో లార్డ్‌ మౌంట్‌బాటెన్‌కు సమర్పించిన ఒక మెమొరాండమ్‌లో 'దేశ విభజన సమయంలోనే కశ్మీర్‌ భారతదేశానికి చెందడం అత్యంత సహజమైన రీతిలో కచ్చితంగా జరిగిపోవాలనీ, పాకిస్తాన్‌ గొడవపడుతుందేమో నని భావించడం అర్థరహితమనీ వివరించారు'.

కశ్మీర్‌ గొడవ దానికదేగా రూపుదిద్దుకుంది. పంజాబ్‌ విభజనపై పెల్లుబికిన మతహింస జమ్మూకు వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దోగ్రాలు జమ్మూ నుంచి ముస్లింలను తరిమివేయడం మొదలుపెట్టారు. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన పూంఛ్‌లో హిందూరాజు పాలనకు వ్యతిరేకంగా ఒక్కసారిగా పూర్తి స్థాయి ముస్లిం తిరుగుబాటు చెలరేగింది.

భారత ఆయుధాలను భద్రపరిచిన కశ్మీర్‌లోయ ప్రాంతానికి పటియాలా నుంచి ఒక సాయుధ దళం వచ్చింది.

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారనే వార్త గుప్పుమనడంతో పాకిస్థాన్‌ నుంచీ వాయవ్య సరిహద్దు ప్రాంతం నుంచీ పఠాన్‌ తెగకు చెందినవాళ్లు సంప్రదాయిక ఆయుధాలతో అడ్డొచ్చిన వాళ్ల మీద దాడి చేస్తూ శ్రీనగర్‌ వైపు దూసుకువచ్చారు. కశ్మీర్‌ రాజు జమ్మూకు పారిపోయారు.

పఠాన్‌ పోరాట యోధులు శ్రీనగర్‌ పొలిమేర వరకూ చేరుకోవడంతో కశ్మీర్‌ను దక్కించుకోవడానికి భారతదేశం ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దిల్లీ వెంటనే రంగంలోకి దిగింది.

అప్పుడు స్వతంత్ర భారతదేశానికి ఇంకా లార్డ్‌ మౌంట్‌బాటెనే గవర్నర్‌ జనరల్‌గా వున్నారు. అటు పాకిస్థాన్‌లో మాదిరిగానే ఇటు భారతదేశంలో కూడా సైన్యం అంతా ఇంకా బ్రిటిష్‌ అధికారుల నియంత్రణలోనే వుంది. నెహూృకు కశ్మీర్‌ అంటే ఎంత ప్రాణమో మౌంట్‌బాటెన్‌కు మొదటినుంచీ తెలుసు.

దేశ విభజన సరిహద్దులను నిర్ణయించేందుకు లండన్‌ నుంచి రాడ్‌క్లిఫ్‌ భారతదేశానికి రావడానికి 9 రోజుల ముందు మౌంట్‌బాటెన్‌ గురుదాస్‌పూర్‌ జిల్లాను భారతదేశానికి కేటాయించేలా మేనన్‌ చేత ఒక నోటును తయారుచేయించారు.

భారతదేశం నుంచి కశ్మీర్‌ చేరుకోవాలంటే గురుదాస్‌పూర్‌ జిల్లా నుండి వెళ్లే రోడ్డు మార్గమే గతి. ముస్లింలు అత్యదిక సంఖ్యలో వుండే ప్రాంతమైనప్పటికీ ఆ జిల్లాను రాడ్‌క్లిఫ్‌ చేత భారతదేశానికి కేటాయింప జేశారు. మౌంట్‌బాటెన్‌ ఏవైపు మొగ్గుచూపాడన్న విషయంలో సందిగ్థతే లేదు.

అయితే, కశ్మీర్‌లో సైనిక జోక్యం చేసుకోవాలంటే న్యాయపరమైన ఏదో ఒక కారణం కావాలి. అక్టోబర్‌ 26న ఆ సాకును మేనన్‌ సమకూర్చారు. భారత యూనియన్‌లో చేరుతున్నానని కశ్మీర్‌ మహరాజు ప్రకటించినట్టుగా రాజుగారి దొంగ సంతకంతో ఆయన ఒక పత్రాన్ని సృష్టించారు. దానిని అప్పుడే శ్రీనగర్‌ నుంచి తెచ్చినట్టు బుకాయించారు. నిజానికి ఆ సమయంలో మేనన్‌ దిల్లీలోనే వున్నారు.

మొత్తం కశ్మీర్‌ మీద భారతదేశానికి హక్కును ప్రసాదించిన ఆ పత్రాన్ని యాభై ఏళ్ల వరకూ ప్రపంచానికి చూపించలేదు.

వాస్తవానికి ఆనాడు కశ్మీర్‌ మహారాజు దిల్లీని ధిక్కరించే స్థితిలో లేడు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టే స్థితిలో వున్నాడు. కానీ పఠాన్ల దాడికి శ్రీనగర్‌ ఎక్కడ పతనమవుతుందో నన్న భయంతో దిల్లీ వేచివుండలేకపోయింది. (అలెస్టర్‌ లాంబ్‌, 'ఇన్‌కంప్లీట్‌ పార్టిషన్‌').

వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ శ్రీనగర్‌కు వాయుమార్గంలో సైనిక బలగాలను తరలించారు. బ్రిటిష్‌ కమాండర్ల నేతృత్శలో ఆ మొత్తం వ్యవహారాన్ని లార్డ్‌ మౌంట్‌బాటెనే పర్యవేక్షించారు. భారతదేశం సత్వరమే కశ్మీర్‌లో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకుంది.

జిన్నా కొంత ఆలస్యంగా మేల్కొని పాకిస్థాన్‌ సైన్యాన్ని కశ్మీర్‌కు పంపించి ప్రతిఘటించాలని ప్రయత్నించినప్పుడు దిల్లీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హుటాహుటిన కరాచీకి వెళ్లి అక్కడి తన సహచర కమాండ్‌ర్‌ ఇన్‌ చీఫ్‌ మెసర్వీని కలసి భారతదేశానికి చట్టబద్ధంగా దక్కిన కశ్మీర్‌పై పాకిస్తాన్‌ గనక దాడికి పూనుకుంటే బ్రిటిష్‌ సైనికాధికారులంతా వెంటనే తమ పదవులకు రాజినామా చేస్తారని, అప్పుడు మొత్తం పాకిస్థాన్‌ సైన్యమే పనికిరాకుండా పోతుందనీ హెచ్చరించారు.

దాంతో జిన్నా వెనక్కి తగ్గాడు.
ఆవిధంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కశ్మీర్‌ను పళ్లెంలో పెట్టి మరీ భారతదేశానికి అందించింది.


("ఇండియాలో దాగిన హిందుస్థాన్‌", పెరీ ఆండర్‌సన్‌, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, సెప్టెంబర్‌
2014 నుండి)





("ఇండియాలో దాగిన హిందుస్థాన్‌")


Saturday, July 20, 2019

తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర


తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర



మొన్న జులై 16న ముంబయిలో మరణించిన రాజా దాలే (78) దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరు. మిగతా ఇద్దరు నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌లు. రాజా దాలే అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు దళిత యువతను ఉర్రూతలూగించేవి.

దళితులపై జరుగుతున్న అత్యాచారాలను చూసి సహించలేక వాటిని అరికట్టేందుకు మిలిటెంట్‌ పోరాటాలు అనివార్యంగా భావించి వాళ్లు నడుంబిగించారు. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్ల 'బ్లాక్‌ పాంథర్స్‌' సంస్థ ప్రేరణతో తమ సంస్థకు దళిత్‌ పాంథర్స్‌ అని పేరు పెట్టుకున్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ ఉనికిలో వున్నది ఐదేళ్లే (1972-77). అందులోనూ చురుకుగా పనిచేసింది కేవలం మూడేళ్లే. 1975లో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కారణంగా చివరి రెండేళ్లూ తీవ్ర నిర్బంధాలకు గురికావలసి వచ్చింది.

ఆ మూడేళ్ల కాలం లోనే  దళిత్‌ పాంథర్స్‌ ముంబయినీ, మహరాష్ట్రనీ ఒక ఊపు ఊపింది. దళిత సమస్యపై యావద్దేశం దృష్టి సారించేట్టు చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో తనదైన ప్రభావాన్ని చూపింది. దళిత యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది. దళిత్‌ పాంథర్స్‌ రద్దయిపోయి ముఫ్పై నాలుగేళ్లు గడచినా ఈనాటికీ అది  చేసిన వీరోచిత పోరాటాలు, సాధించిన విజయాలు, రచనలు ఎందరికో ఉత్తేజాన్ని ఇస్తూనే వున్నాయి.
సంస్థ నిర్మాతల్లో ఒకరైన జె.వి.పవార్‌ రాసిన ''దళిత్‌ పాంథర్స్‌ - ఏన్‌ అథారిటేటివ్‌ హిస్టరీ'' అన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ త్వరలో తెలుగులో వెలువరించనుంది. ఈ సందర్భంగా పుస్తక రచయిత రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు మీకోసం.


... ... ...

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్స్‌కే చెందుతుంది. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న ముంబయిలో నిర్వాహకులు చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్స్ రద్దు అయిపోయింది.. 

అంతకుముందు నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలేను , జె.వి. పవార్‌ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దశాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలుయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధత తో వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించే వీర సైనికుల్లా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్స్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్స్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు, వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.
... ... ...

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
... ... ...

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి డా.అంబేడ్కర్‌ నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్స్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్స్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్స్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-జే.వీ. పవార్