Thursday, February 20, 2025

తమిళనాడు, కేరళ యాత్రా స్మృతులు

 

తమిళనాడు, కేరళ యాత్రా స్మృతులు

………………………………………………………..

 

          పదిరోజులపాటు సాగిన తమిళనాడు, కేరళ యాత్రలో (జనవరి 28 - ఫిబ్రవరి 7, 2025) ఎన్నెన్ని అద్భుతమైన దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను దర్శించామో.. ఎంతెంత నడక నడిచామో.. ఎన్నెన్ని మెట్లెక్కామో .. తలచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది!

          చిదంబరం, కుంభకోణం, తంజావూర్‌, రామేశ్వరం, మధురై, కుర్తాళం, టెంకాశి, తిరునల్వేలి, కన్యాకుమారి, త్రివేండ్రం, గురువాయూర్‌, పళని, శ్రీరంగం, అరుణాచలం, కంచి వంటి అనేక ప్రదేశాలు, ఎన్నెన్నో అపరూపమైన దేవాలయాలు!

          సాగర్‌ గారి పకడ్బందీ ప్రణాళిక వల్లనే .. ఉరుకులు పరుగులతో కూడుకున్నప్పటికీ .. ఇంత తక్కువ వ్యవధిలో వీటన్నిటినీ చూడటం సాధ్యమయింది. నిజానికి ఒక్కో ప్రదేశాన్ని  సమగ్రంగా వీక్షించాలంటే రెండేసి రోజులైనా సరిపోవు!

           కెవిఎన్‌ ఆచార్య గారు ప్రతి దేవాలయ ప్రాశస్త్యం గురించి ఎప్పటికప్పుడు వాట్స్‌ఆప్‌ గ్రూప్‌లో పొందుపరుస్తూ వచ్చారు. చివరి రోజు సహ యాత్రికులు కొందరు బస్సులోనే తమ యాత్రానుభవాలను పంచుకున్నారు. అందువల్ల చర్వితచర్వణం కాకుండా నా ఈ స్పందన...

 

ఎంత సువిశాలమైన దేవాలయాలు! అనితరసాధ్యమైన రాతి కట్టడాలు! అమూల్యమైన శిల్ప సంపద! ఆ కాలంలోనే ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్‌ నిర్మాణ కళా కౌశలం!

          ఒక్కొక్క స్తంభం ఎత్తు రెండంతస్తులపైనే వుంటుంది. అలాంటివి ఒకటి కాదు రెండు కాదు... వందలు, వేలు! వాటి మీద అంతకంటే పొడవైన, నున్నగా చెక్కిన, రాతి దుంగలతో కూడిన పైకప్పులు! ప్రతి స్తంభం మీద అందమైన విగ్రహాలు.. బొమ్మలు.. నగిషీలు! వాటిని చెక్కడం కోసం మన భోనగిరి లాంటి ఎన్ని రాతి గుట్టలు కరిగిపోయి వుంటాయో అనిపించింది!

నిపుణులైన శిల్పుల చేతుల్లో కఠిన శిలలు సైతం మైనపు ముద్దల్లా మారిపోయినట్టున్నాయి!  ఏ సాంకేతిక పరికరాలు లేని రోజుల్లో అంతంత భారీ స్తంభాలను ఎలా నిలబెట్టగలిగారో.. అంతంత బరువైన రాతి దుంగలను ఎలా పైకి చేర్చివుంటారో ... ఆకాశహర్యాల్లాంటి ఎత్తైన గోపురాలను ఎలా నిర్మించి వుంటారో అని ఒకటే ఆశ్చర్యం! ప్రతి శిల్పంలో జీవ కళ తొణికిసలాడుతోంది !!

          ‘‘శిలలపై శిల్పాలు చెక్కినారూ...మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ... ...’’

          ‘‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో.. ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో... ఓ.. ఓ..’’

          ఆనాటి శిల్పుల ఉలుల శబ్దాలు వీనుల విందుగా ప్రతిధ్వనిస్తుండగా .. సమయభావం వల్ల .. అనివార్యంగా .. గబగబా ముందుకు సాగాల్సి వచ్చింది.

          కొన్ని వందల వేల సంవత్సరాల కిందట నిర్మించినవైనా ఆ దేవాలయాలన్నీ ఏమాత్రం చెక్కు చెదరకుండా దేదీప్యమానంగా వెలిగిపోతుండటం అబ్బురపరిచింది. వాటిని చూస్తుంటే మనసంతా పులకరించిపోయింది.. అదేసమయంలో మన వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్‌, తెలంగాణాలోని అనేక ఇతర ప్రాంతాలలో తలలు తెగిన.. కాళ్లూ చేతులు విరిగిన.. ఛిద్రమైన విగ్రహాలు.. శిథిల దేవాలయాలు మదిలో మెదిలి బాధ కూడా కలిగింది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకు మన భద్రకాళి, వేయి స్తంభాల గుళ్లు కూడా ఎంత వెలవెల బోతుండేవో. తమిళులు, మలయాళీలు మాత్రం మొదటినుంచీ తమ దేవాలయాలనీ, శిల్ప సంపదనీ ప్రాణ ప్రదంగా కాపాడు కుంటూ వస్తున్నారు. 

          కొట్టొచ్చినట్టు కనిపించిన మరొక అంశం - చెన్నైలోనూ ఇతర పట్టణాలలోనూ ఎక్కడ చూసినా ..  ప్రతి షాపు ముందూ,  కార్యాలయం ముందూ సైన్‌ బోర్డులన్నీ తమిళంలోనే వుండడం. ఇంగ్లీషు మచ్చుకైనా కనిపించకపోవడం.

సుందర తెలుంగు’.. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’...!!

అని మురిసిపోతుంటాం.. కానీ ఏం లాభం.. ఇంత అందమైన మన భాష పట్ల మనమే అలసత్వం వహిస్తున్నాం. కరడుగట్టిన మొఘలు సామంతరాజులూ నైజాములూ మూడు వందల ఏళ్లు  మనలను పరిపాలించడం ఆందుకు ఒక కారణం. వాళ్లు మన ప్రాంతాన్ని ఆక్రమించి మన మీద ఉర్దూను రుద్దారు .. ఉర్దూలోనే పరిపాలన సాగించారు .. అందువల్ల మనం చచ్చినట్టు ఉర్దూను నేర్చుకోవాల్సి వచ్చింది.. త్రివర్ణ పతాకం ఎగిరే వరకూ ఉర్దూ మీడియంలోనే చదువుకోవాల్సి వచ్చింది. 

కానీ స్వాతంత్య్రం వచ్చి.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఏడు దశాబ్దాలు గడిచినా మన గడ్డ మీద కూడా మనం తెలుగును అధికార భాషగా అమలు పరచుకోలేకపోతున్నాం. సగటు ప్రజానీకానికి అవసరం లేకపోయినా, రాకపోయినా ఇంగ్లీషును పట్టుకుని వేలాడుతున్నాం. ఎంత ఆత్మవంచన ఇది .. తమిళులు- ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన కింద శతాబ్దాలపాటు వున్నప్పటికీ తమిళనాడులో ఎక్కడ చూసినా తమిళమే కనిపిస్తుంది, తమిళమే వినిపిస్తుంది .. ! ఎంత మాతృ భాషాభిమానం వాళ్లకి! మనలో అలాంటి మాతృభాషాభిమానం ఎందుకు కొరవడిరదో అర్థంకాదు ?!

ఈ యాత్రలో నన్ను అమితంగా స్పందింపజేసిన మరో రెడు అంశాలు/ప్రదేశాలు`-  రామేశ్వరం, అరుణాచలం.

రామేశ్వరంలో ధనుష్కోటి, వివేకానంద మెమోరియల్‌ రాక్‌, గ్లాస్‌ బ్రిడ్జి, 130 అడుగుల ఎత్తున్న తిరువళ్లువార్‌ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ విజ్‌డమ్‌) అలాగే బంగాళా ఖాతం` హిందూ మహా సముద్రం` అరేబియన్‌ సముద్రం ఈ మూడిరటి సంగమ ప్రదేశం... వాటిలో సూర్యోదయం .. సూర్యాస్తమయం.. మహనీయుడు అబ్దుల్‌ కలాం పుట్టి పెరిగిన ఇల్లు వంటి ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి.

ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన .. కోట్లాది మంది యువతకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన భారత రత్న డా. ఎపిజె అబ్దుల్‌ కలాం వున్న వీధిలో నడుస్తుంటే ఎన్ని ప్రకంపనలు కలిగాయో.

సైకిలెత్తు కూడా లేని వయసులో .. ఆయన దినపత్రికలను సైకిల్‌ మీద పెట్టుకుని ఇంటింటికీ సరఫరా చేస్తున్న దృశ్యం మదిలో మెదిలింది. ఆయన ఇంటిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. పదినిమిషాల్లో చూసి వచ్చేయాలని సాగర్‌ గారు నిర్దేశించడం వల్ల సరిగా చూడలేకపోయాం. దానికి తోడు ఇక్కడ కూడా కెమెరాలు, సెల్‌ఫోన్లు ఉపయోగించకూడదనే నిబంధన ఒకటి! అక్కడ ప్రదర్శించిన ఫొటోలను ఫొటో తీసుకోవద్దనే నిబంధన ఎందుకో అర్థం కాలేదు...! అయినా అందరితో పాటు చటుక్కున ఒకటి రెండు ఫొటోలు తీసుకున్నాను. గబగబా నడుస్తూనే ఆ వీధిని వీడియో తీశాను.

ఇక అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు కూడా నాకు ఇలాంటి అనిర్వచనీయమైన  స్పందనే కలిగింది. చలంగా సుప్రసిద్ధులైన ప్రఖ్యాత రచయిత గుడిపాటి వెంకట చలం (1894`1979) తన శేష జీవితాన్ని ఈ రమణాశ్రమంలోనే గడిపారు.

ఆయన మైదానం, దైవమిచ్చిన భార్య, అమీనా, అరుణ, శశిరేఖ, బ్రాహ్మణీకం వంటి నవలలు, మ్యూజింగ్స్‌, ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ వంటి నాన్‌ఫిక్షన్‌ రచనలు, అనేక కధలు రాశారు. ఒక్కొక్కటి ఒక్కో సంచలనం. మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్ధానంఎంత సుప్రసిద్ధమో దానికి చలం రాసిన ముందు మాట కూడా అంతే సుప్రసిద్ధమయింది.

ప్రధానంగా ఆయన రచనలన్నీ ` ఆచారాలూ, సంప్రదాయాలూ, కట్టుబాట్ల పేరిట స్త్రీలను అణిచివేతకు గురిచేస్తున్న సమాజాన్ని ధిక్కరిసిస్తూ, స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్యాల కోసం పరితపిస్తూ తిరుగుబాటు ధోరణితో చేసినవే.

హైస్కూల్‌ చదువు పూర్తయ్యేనాటికే ఆయన అభ్యుదయవాదిగా, నాస్తికుడిగా మారిపోయారు. మద్రాసు కాలేజీలో చేరాక మెడలోంచి యజ్ఞోపవీతాన్ని తీసేసి మాంసాహారాన్ని తినడం అలవర్చుకున్నారు. అప్పటికే తల్లిదండ్రులు ఆయనకు వివాహం జరిపించారు. మద్రాస్‌ వెళ్లగానే తన భార్యను స్కూల్లో చేర్పించి రోజూ సైకిల్‌ మీద తీసుకెళ్లేవారట.

తల్లిదండ్రులు, అత్తమామలతో సహా ఆయన బంధువర్గం, బ్రాహ్మణ సమాజం ఆయనను వెలివేసింది. ఆయన రచనలను అనధికారికంగా నిషేధించింది. అడుగడుగునా ఆయనను వేధింపులకు గురిచేసింది. మానసికంగా విసిగివేసారి పోయిన ఆయన నాస్తికత్వాన్ని వదిలేసి, రచనలకు స్వస్తి చెప్పి 1936 నుంచీ మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం మొదలుపెట్టారు. చివరికి 1950లో అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆశ్రయం పొందారు. చలం ఉపాధ్యాయుడిగా వున్నప్పుడు కొంతకాలం మన కరీంనగర్‌లో కూడా పనిచేశారు.

అభ్యుదయ మార్గాన్ని వదిలి` ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించినా తనలోని పాత చలాన్ని, పాత స్ఫూర్తిని విసర్జించలేదు. ఆయన బతికున్న రోజుల్లో సాహితీవేత్తలకు, యువ రచయితలకు రమణాశ్రమం ఒక యాత్రాస్థలంగా వుండేది. ఎవరు ఉత్తరం రాసినా ఆయన వెంటనే పోస్టుకార్డు ద్వారా స్పందించేవారు. కాకపోతే ఈశ్వరాశీస్సులతో అని ఉత్తరాన్ని ముగించేవారు. రమణాశ్రమాన్ని మౌనంగా సందర్శిస్తుంటే ప్రశాంత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్న ఆ మహనీయుని రూపమే కనిపించింది.

టైట్‌ షెడ్యూల్‌ వల్ల ఈ యాత్రలో ఏ ప్రదేశాన్నీ సంపూర్ణంగా ఆస్వాదించినట్టు అనిపించలేదు. ఏ రోజూ ఏ లాడ్జిలోనూ పట్టుమని ఏడెనిమిది గంటలు విశ్రాంతి తీసుకున్నదీలేదు. ఒకటే ఉరుకులూ పరుగులు! అందువల్ల పరిస్థితులూ ఆరోగ్యం సహకరిస్తే కొన్ని ఎంపిక చేసుకున్న ప్రదేశాలను మళ్లీ తీరుబడిగా, సంతృప్తిగా సందర్శించాలని వుంది.

సహయాత్రికులందరికీ కృతజ్ఞతాభినందనలతో

  ప్రభాకర్‌ మందార

హైదరాబాద్

 

(తమిళనాడు కేరళ యాత్ర వరంగల్ భాగస్వాముల వాట్స్ ఆప్ గ్రూప్ కోసం రాసిన ఆర్టికిల్. ఈ యాత్ర కేవలం అక్కడి ప్రముఖ దేవాలయాల సందర్శనకే పరిమితమైనది.)

 










 

 

Wednesday, January 8, 2025

జల్లికట్టు (వాడివాసల్‌) నవలా రచయిత సి.పస్‌. చెల్లప్ప పరిచయం

 

 

 

జల్లికట్టు (వాడివాసల్‌) నవలా రచయిత 

సి.పస్‌. చెల్లప్ప పరిచయం

......................

సి.ఎస్‌. చెల్లప్ప (1912`1998) ప్రముఖ తమిళ రచయిత, సాహితీ విమర్శకులు. ఆనాటి మధురై 

జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు సిన్నమనూర్‌ సుబ్రమణ్యం చెల్లప్ప. గాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాత ఒక వారపత్రికలో పనిచేసేందుకు మద్రాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కథా రచనలో ఆయనది అందెవేసిన చేయి. 1930ల నుంచీ తమిళ సాహిత్యంలో ఆధునికతా ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న మనికొడి రచయితల సంఘంలో కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే తొలి దశ భారత స్వాతంత్య్రోద్యమంతో, మలి దశ సాహిత్యోద్యమాలతో పెనవేసుకుపోయి కనిపిస్తుంది. 1941 బట్లగుండు సత్యాగ్రహంలో పాల్గొని ఆరునెలల జైలు శిక్ష అనుభవించారు.   

 ఆయన అనేక కథలు, కవితలు, వ్యాసాలు, నాటికలు రాశారు. మూడు నవలు` వాడివాసల్‌, జీవనాంశంసుతంతిర తగంలను రచించారు. మొత్తం ఇరవై తొమ్మిది పుస్తకాలను ప్రచురించారు. చాలావరకు తన పుస్తకాలను తానే తిరుచ్చి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని కాలేజీలను సందర్శిస్తూ, ఇంటింటికి తిరుగుతూ అమ్ముకునేవారు. ఆయన ఇల్లు అమ్ముడుపోని పుస్తకాలతో, అముద్రిత రచనలతో నిండివుండేది. 

తనకున్న పరిమిత ఆర్థిక వనరులతోనే ఆయన ఎజుతుఅనే సాహిత్య పత్రికను స్థాపించి 

దశాబ్దకాలంపాటు (1959`1970) నిర్వహించారు. ఆధునిక తమిళ సాహిత్యానికి, ముఖ్యంగా వ్యాకరణ సాంప్రదాయిక సంకెళ్లను తెంచుకుంటూ అప్పుడే వస్తున్న నూతన కవిత్వానికి ఆ పత్రిక ద్వారా వెన్నుదన్నుగా నిలిచారు.   ఎన్ని ఇంబ్బందులు ఎదుర్కొంటున్నా తన ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ ఎప్పుడూ కోల్పోలేదు. 

జీవితాంతం అవార్డులకు దూరంగా వున్నారు. చివరికి జీవిత చరమాంకంలో అమెరికన్‌ తమిళ సాహిత్య సంఘం వారు నగదు బహుమతిని స్వీకరించమని ఒత్తిడి చేసినప్పుడు ఆ డబ్బును తన మూడు భాగాల అముద్రిత సుతంతిర తగం (ద థరస్ట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌) నవల ప్రచురణకు వెచ్చించమని కోరుతూ అంగీకరించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆయన మరణానంతరం 2001లో అదే నవలకు అవార్డును ప్రదానం చేశారు. 

ఆయన రచనల్లో వాడివాసల్‌ (జల్లికట్టు) తలమాణికమైనది. అకాడమీ అవార్డును అందుకున్న భారీ నవల సుతంతిర తగంకంటే కూడా వాడివాసల్‌నవలే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. జల్లికట్టు క్రీడపై వచ్చిన తొలి నవలల్లో ఒకటైన వాడివాసల్‌ ఏడు దశాబ్దాల తరువాత ఇప్పటికీ కూడా తమిళనాట విశేష పాఠకాదరణతో పునర్ముద్రణలను పొందుతూనే వుంది. 

 

సి.ఎస్‌. చెల్లప్ప గురించి ఆయన కుమారుడు చెల్లప్ప సుబ్రమణ్యన్‌:

మా నాన్న

..


.

నేను పుట్టినప్పుడు మా నాన్న వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఎన్నో కాన్పులు పోయిన తరువాత మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అప్పుడు  మేం చెన్నైలో మధ్యతరగతివాళ్లు ఎక్కువగా నివసించే ట్రిప్లికేన్‌లోని ఓ అద్దె ఇంట్లో వుండేవాళ్లం. లేకలేక పుట్టిన సంతానాన్ని కాబట్టి నా తల్లిదండ్రులు నన్నేదో మహాగారాబంగా పెంచి వుంటారని అనుకుంటారేమో. కానీ అదేం లేదు. చాలా కఠినమైన క్రమశిక్షణతో పెంచారు నన్ను. ఓ చాక్లెట్లు లేవు.. ఐస్‌ క్రీములు లేవు. టైం ప్రకారం చదువుకోవాలి.. టైం ప్రకారం తినాలి. బయటకు వెళ్లడానికి వీల్లేదు. వీధిలో నా తోటి పిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. అసలు వాళ్లతో మాట్లాడనిచ్చేవారే కాదు. మా నాన్న ఎప్పుడూ నన్ను ఓ కంట కనిపెడుతూ వుండేవారు. మా అమ్మ కూడా అంతే అని మా బంధువులు చెప్పుకునేవారు. కానీ ఇవాళ నేను వెనుతిరిగి చూసుకుంటే ఆనాడు వాళ్లంత క్రమశిక్షణగా పెంచడం వల్ల నాకు మేలే జరిగిందనిపిస్తుంది. 

మా నాన్నకు నన్ను మరీ అతిగా హద్దుల్లో పెడుతున్నానిపించేదో ఏమో అప్పుడప్పుడూ తనతో పాటు సినిమాలకి తీసుకెళ్తుండేవారు. అయితే తనకు నచ్చిన సినిమాలకే అనుకోండి. అలాగే ఒకోసారి మా ఇంటికి దగ్గరలోని బీచ్‌కి కూడా తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్‌ బ్యాటు, బాల్‌ పట్టుకుని మా ఇంటి ఆవరణలో నాతో హౌస్‌ క్రికెట్‌ ఆడేవారు. ఆరోజుల్లో పాత నెహూృ స్టేడియంలో జరిగిన ఒకటి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు కూడా తీసుకెళ్లారు. 

మా నాన్నకూ నాకూ వయసులో ఎక్కువ వ్యత్యాసం వుండటం వల్లనో ఏమో మా మధ్య మాటలు పరిమితంగా వుండేవి. ఆయన తరచూ పెద్ద పెద్ద ఇంగ్లీషు పుస్తకాలను తెచ్చుకుని చదువుకుంటూ కూర్చునేవారు. అంతంత భారీ పుస్తకాలను ఎలా చదువుతారా అని నాకు ఆశ్చర్యంవేసేది. ఒకోసారి ఆ పుస్తకాలను తీసుకురావడానికి తనతోపాటు బ్రిటిష్‌ కౌన్సిల్‌కూ, యూఎస్‌ఐఎస్‌ గ్రంధాలయానికీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లేవారు. 

ఆయన ఎప్పుడూ నా చదువులో జోక్యం చేసుకునేవారు కాదు. నాకు పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించేవారు కాదు. వార్షిక సెలవుల తర్వాత పాఠశాలల్ని తిరిగి తెరచినప్పుడు మాత్రమే ఆయన నా పుస్తకాలను ముట్టుకునేవారు. గోధుమరంగు పేపర్‌ తెచ్చి ఆ కొత్త పుస్తకాలకు చక్కగా అట్టలు వేసిచ్చేవారు. మొదటినుంచీ నాకు ప్రతి పరీక్షలో మంచి మార్కులే వచ్చేవి. అందుకు ఆయన లోలోపల సంతోషించేవారో లేదో తెలియదు కానీ తన స్పందనను ఎప్పుడూ పైకి వ్యక్తం చేసేవారుకాదు. 

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నన్ను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ నిరాటంకంగా చదివించారు. అయితే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో వుండగానే నాకు ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ సంగతి చెప్పినప్పుడు ఆయన నిర్లిప్తంగా వుండిపోయారు. ఆయన మొహంలో ఏమాత్రం ఆనందం కనపించలేదు. బహుశ నన్ను ఇంకా చదివించాలనీ, నాచేత డాక్టరేట్‌ చేయించాలనీ వుండేదేమో తెలియదు. కానీ, మా అమ్మ మాత్రం ఎంతో సంతోషించింది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని చెప్పింది. నాకూ అదే అభిప్రాయం వుండడంతో చదువుకు స్వస్తి చెప్పాను. 

మంచి మార్కులు వచ్చినా నన్ను ఇంజనీరింగ్‌లో చేర్పించలేకపోయానని మా నాన్న తరచూ బాధపడేవారు. నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే ఆయన చెన్నై నుంచి మా సొంతూరుకు మకాం మార్చారు. తన సాహిత్య వ్యాసంగాన్ని పక్కనబెట్టి పల్లె బాట పట్టడం ఆయనకు అదే తొలిసారి. అక్కడ మా పెరట్లో మాకు కావలసిన కూరగాయాలను పండిస్తూ సంతోషంగా కాలం గడపేవారు.

కానీ, కొన్నేళ్ల తర్వాత ఎందుకోగానీ ఉన్నట్టుండి తిరిగి చెన్నైకి మకాం మార్చి గతంలో మాదిరిగానే తన సాహితీ వ్యాసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఏదో స్వల్ప విరామం కోరుకుని  మా సొంతూరుకు వెళ్లి వచ్చారేమో అనిపించింది. తనకి స్వాతంత్య్ర సమరయోధుల ఉచిత రైల్వేపాస్‌ వుండేది. దాని సాయంతో ఒకసారి దిల్లీకి వెళ్లి రాజ్‌ ఘాట్‌నీ, బిర్లా హౌస్‌నీ సందర్శించి వచ్చారు. మరే ఇతర చోట్లకి వెళ్లలేదు. నా తీర్థయాత్ర దీంతో ముగిసినట్టేఅని చెప్పారు. ఆయన తన జీవితంలో సగభాగం గాంధీయిజానికీ, మిగతా సగభాగం సాహిత్య సేవకూ వెచ్చించారు.

వయోభారం వల్ల క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలయింది. మా అమ్మ కూడా ఆ వయసులో రోజువారీ పనులు చేసుకోడానికి చాలా ఇబ్బంది పడేది. దాంతో వాళ్లిద్దరూ ఉద్యోగ రీత్యా బెంగుళూరులో వుంటున్న నా దగ్గరకు వచ్చేశారు. మనవడూ మనవరాలితో ఉల్లాసంగానే కాలక్షేపం చేస్తుండేవారు. మా నాన్నకు మాత్రం ఎందుకో ఇక్కడి వాతావరణం అంతగా నచ్చేది కాదు. రెండోసారి జైల్లో వేసినట్టు అనిపిస్తోంది నాకు అనేవారు. (మొదటిసారి ఆయన ఒక స్వాతంత్య్ర సమర యోధుడిగా జైలు శిక్ష అనుభవించారు). కాకపోతే బెంగుళూరులో వున్నప్పుడే ఆయన తన రచనల్లో మాగ్నం ఓపస్‌ లాంటి ‘సుతంతిర తగంనవలను రాశారు. తదనంతరం మళ్లీ చెన్నైకి వెళ్లిపోయి 1997లో ఆ నవల ప్రచురణ పనులు చూసుకున్నారు.  

ఆయన తన జీవితమంతా చాలా నిరాడంబరంగా గడిపారు. భౌతిక సౌకర్యాలపట్ల ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. చేతులతో ఉతుక్కున్న ధోతీనీ, షర్టునీ ఇస్త్రీ లేకుండా ధరిస్తుండేవారు. వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆయన తన జీవితంలో ఏడుసార్లు ఆసుపత్రులపాలయ్యారు. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారీ దేవుడు ఇంకా రచనలు చేయమని నా జీవితాన్ని పొడిగించాడుఅనేవారు. అలా ఆయన తన జీవిత చరమాంకం వరకూ రచనలు చేస్తూనే వున్నారు. 

 

ఆయన అముద్రిత రచనలు కొన్ని ఇప్పటికీ అలాగే వుండిపోయాయి. ఒకసారి ఆయన నాతో నువ్వయితే అరవై ఏళ్లకి పదవీ విరమణ చేయొచ్చు. కానీ నాకు మాత్రం అసలు పదవీ విరమణ అనేదే లేదుఅన్నారు. అలా ఆయన తన చివరి క్షణాల వరకూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.

బీసెంట్‌ నగర్‌ స్మశాన వాటికలో నేను ఆయనకు కన్నీటితో నివాళులు అర్పిస్తూ ‘‘చెల్లప్ప ఇవాళ పదవీ విరమణ చేశారు’’ అన్నాను.

- చెల్లప్ప సుబ్రమణ్యన్‌

మార్చి 2013

జల్లికట్టు నవల 

వెల: రూ. 100

ISBN :  978-81-957161-3-5

ప్రతులకు: 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ; ఫోన్ నెం. 93815 59238

 

Jallikattu

Order your book at HBT Website:- 

https://hyderabadbooktrust.com/products/jallikattu-c-s-chellappa?

sku_id=58348914

Amazon Website : 

https://www.amazon.in/dp/B0DQT8ZZVB