Thursday, November 14, 2019

ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు – టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)


ఆలోకన :
ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు –
టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)
------------------------------------
ఆర్టీసీ సమ్మెలో సామాన్యులకు అర్థం కాకుండా మిగిలిన ప్రశ్నలు కొన్నున్నాయి. ఉదాహరణకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటం. విలీనమే ప్రధానమని, అది జరుగనిదే మరి దేనికీ ఒప్పుకోబోమన్న యూనియన్లు అదే పట్టుదలతో ఉన్నాయి.
విలీనం వల్ల పడే ఆర్థికభారాన్ని మోయలేమని ప్రభుత్వం అంటున్నది. కొద్దిపాటి అవగాహన గలవారు, ఇతరత్రా కార్మికులపై సానుభూతి గలవారు కూడా విలీనం డిమాండ్ సరైనది కాదంటున్నారు.
హైకోర్టుసైతం సమస్య పరిష్కారానికి ఈ డిమాండు ప్రతిష్టంభనగా మారేట్లున్నదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ యూనియన్లకు ఈ పట్టుదల దేనికన్నది ప్రశ్న.
విలీనం వల్ల రాగల ఆర్థిక సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు వివరించారు. ఆర్టీసీ సిబ్బంది సుమా రు 50 వేల మంది. అంతమందికి ప్రభుత్వ సిబ్బందితో సమానంగా జీతభత్యాలు, ఇతర సదుపాయాలు, ఉద్యోగ విరమణాంతరం జీవితాంతం పింఛన్లు, ఇతర సదుపాయాలు అంటే మామూలు విషయం కాదు.
ఇవి అన్నీ తమకు కావాలని ఆర్టీసీ సిబ్బంది తమ దృక్కోణం నుంచి కోరుకోవచ్చు. ఇటువంటి ప్రయోజనాలు వారికి గొప్ప ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే యూనియన్ నాయకులు, ప్రతిపక్షాలు ఈ విషయమై చెప్పిన డిమాండ్లు సిబ్బంది మనసులో తేలికగా, బాగా నాటుకుపోయాయి.
కానీ కోరికలు ఎంత ఆకర్షణీయమైనవి అయినా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఆ పని చేయనప్పు డు విషయం ప్రతిష్టంభనకు గురికావటం, దీర్ఘకాలం పాటు సాగటం, చివరికి ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది.
విలీనాన్ని అంగీకరించకపోవటానికి ముఖ్యమంత్రి రెండు కారణాలు చెప్పారు. ఒకటి, అందువల్ల పడే రకరకాల ఆర్థిక భారాలు. రెండు, ఇతర కార్పోరేషన్లు కూడా విలీనాన్ని కోరే అవకాశం. అప్పుడు పడగల భారం తో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిజంగానే కుప్పగూలేంత పనవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ప్రస్తుతం మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారికి రేపోమాపో వేతన సవరణ జరుగుతుంది. ఇటువంటి స్థితిలో కార్పొరేష న్ల విలీనంతో మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలు అయితే పరిస్థితి ఏమిటి?
ఇదిగాక, వేలాది ఖాళీల భర్తీలు, కొన్నిరకాల ఉద్యోగాల్లో అదనపు నియామకాలు క్రమక్రమంగా చేపడుతున్నారు. దీనంతటి మధ్య రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఒకేమారు 50 వేల మంది విలీనాన్ని మోయగలదా? ఒకవేళ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నా ఆచరణాత్మకంగా సాధ్యమయేదేనా?
ఇప్పటికే 67 శాతం వేతనాలు పెంచిన స్థితిలో?
ఇదంతా సామాన్య ఆర్టీసీ సిబ్బందికి తెలియకపోవచ్చు. వారు తమకు కలిగే ప్రయోజనాల గురించి అమాయకంగా ఆలోచిస్తారు. కానీ యూనియన్ల నాయకులకు అర్థం కానిదా?
యథాతథంగా ప్రభుత్వ సిబ్బందికి, కార్పొరేషన్లకు మధ్య నిర్మాణపరమైన, స్వభావపరమైన తేడాలుంటాయి. అందువల్లనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తెలంగాణలో విలీనమంటున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు తామెందుకు చేయలేదంటూ కేసీఆర్ పలుమార్లు వేసిన సూటి ప్రశ్నకు వారెవరు సమాధానం ఇవ్వలేకపోవటానికి కారణం ఇదే.
వారి ఇవ్వలేని స్థితిని తప్పుపట్టడం లేదు. కానీ వారి ద్వంద్వ ప్రమాణాలు, కపటనీతి మాత్రం తప్పు పట్టదగ్గవే. ఆ కపటనీతి వల్లనే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీసీ యూనియన్ నేతలను రెచ్చగొడుతున్నారు. ఆ నేతలు ముందు వెనుకలు ఆలోచించకుండా అమాయకులైన కార్మికులను రెచ్చగొడుతున్నారు.
ఇటువంటి క్రమంలోనే ఇటీవల బీజేపీ వారు కొత్త వాదన తెచ్చారు. తెలంగాణ ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని, ఏమి చేయాలన్నా కేంద్రం అనుమతి కావాలని, కేంద్రంలోని ప్రభుత్వం తమది గనుక తాము విషయాలను నిర్దేశించగలమనే అభిప్రాయాన్ని సృష్టించారు.
దీన్ని నమ్మిన యూనియన్ నాయకులు కూడా అదే వాదనలు చేస్తూ కార్మికులను నమ్మించారు.
చివరికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో, తమకు ఏ వాటా లేదని స్పష్టం చేశా రు.
దానితో బీజేపీ మౌనంలోకి జారుకుంది.
ఈ సందర్భంలో వీరంతా ఏపీలో విలీన ప్రతిపాదనలను ప్రస్తావిస్తున్నారు. ఆ పని నిజంగా జరిగి తే అది దేశంలో ఒక మినహాయింపు అవుతుంది. వారి పరిస్థితులను బట్టి, మ్యానిఫెస్టో హామీ ప్రకారం వారు చేశారనుకోవాలి.
మరి అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అదే ప్రేరణతో తమ రాష్ర్టాల్లో చేయగలమని ప్రకటిస్తాయా?
విలీనం డిమాండ్‌లోని నిర్హేతుకత యూనియన్లకు ఒక దశలో అర్థమైనట్లే తోచింది. వారి న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ, విలీనం ముం దస్తు షరతు కాదన్నట్లు నర్మగర్భంగా సూచించారు.
దానితో ఇక చర్చల కు, సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం కాగలదనే అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా సానుకూల స్పందన చూపారు.
కానీ అంతలోనే ఏమైందో గాని యూనియన్ నేతలు విలీనమే ముందస్తు షరతు అంటూ మళ్లీ గట్టిగా వాదించారు.
దానితో అంతా బిగుసుకుపోయింది.
లేనట్లయితే బహుశా చర్చలు ఎప్పుడో జరిగి సమ్మె ముగిసేది.
ప్రభుత్వం నియమించిన కార్యదర్శుల కమిటీ చర్చల్లోనూ యూనియన్లు విలీనాన్ని ముందస్తు షరతుగా మార్చకుంటే విషయం తేలిపోయేదేమో.
ఆర్టీసీ ప్రస్తుత సమ్మెకు రాడికల్ ట్రేడ్ యూనియనిజం లక్షణాలున్నా యి. యథాతథంగా ఇవి రాడికల్ యూనియన్లు కావు. వాటిలోని వామపక్ష సంఘాలను మినహాయిస్తే తక్కినవాటికి ఆ సిద్ధాంతం, స్వభావం, రికార్డు లేవు. ఒకప్పటి బెంగాల్ యూనియన్లు, ఫరీదాబాద్-ఘాజియాబాద్ యూనియన్ల మాట అట్లుంచి, బొంబాయిలోని దత్తా సామంత్ తరహా రాడికలిజమైనా లేదు వారికి. విలీనం డిమాండ్ కేవలం ఒక అం శానికి పరిమితమైన రాడికలిజం. అది నెరవేరితే రాడికల్ యూనియని జం ఆర్టీసీలో అయినా, తెలంగాణలో ఇతరత్రా అయినా విస్తరించి తీరుతుందనలేముగాని అందుకు కొద్దిపాటి అవకాశాలుంటాయి.
ఈ మాట అనటం ఎందుకంటే, దేశంలో ఒక సంచలన దశగా సాగిన రాడికల్ ట్రేడ్ యూనియనిజం ముగిసిపోయి పాతికేళ్లు దాటింది. దాన్ని నడిపిన పార్టీ లు, సంస్థలు బలహీనపడ్డాయి.
ఆర్థికసంస్కరణలు, ఆటోమేషన్, న్యూ ఎకానమీ తెచ్చిన పెను మార్పులతో స్వయంగా కార్మికుల స్వభావాలు కూడా మారినట్లు, వారిలో అత్యధికులు అసలు యూనియన్ల వైపు చూడటం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు విలీనం అనే రాడికల్ డిమాండ్‌ను ముందుకుతెచ్చాయి. అదొక పులి వంటి డిమాండ్. వారు ఆ పులిని సృష్టించారు. దానిపై సవారీ చేస్తున్నారు. కార్మికులను ఆ పులి వెంట పరిగెత్తిస్తున్నారు. పరిస్థితులు క్రమంగా ఎట్లా తయారవుతున్నాయంటే వారు ఆ పులిపై సవారీ చేయలేరు. కిందకు దిగలేరు.
రాడికల్ యూనియనిజంలో ఇటువంటి పరిస్థితులు తరచు ఎదురవుతుంటాయి. అయితే, వెనుక మద్దతుగా సొంత పార్టీలు ఉండి (కమ్యూనిస్టుల వలె), తమ స్వరూప స్వభావాలే రాడికల్ అయిన యూనియన్ల పరిస్థితి వేరు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ఆ కోవలోకి రావు. కనుక అవి దిక్కుతోచని స్థితిలో పడుతాయి. ఏపీఎస్‌ఆర్టీసీ అసలు విభజన కాలేదని, టీఎస్‌ఆర్టీసీలో తమకు వాటా లేదని కేంద్ర న్యాయవాది ప్రకటించటం వారికి కొత్త సమస్యలు సృష్టించనున్నది.
ఆర్టీసీలో అనేక బస్సులు కండీషన్ కోల్పోవటం, కొత్త బస్సుల ఖరీదుకు డబ్బు లేకపోవటం, ఇచ్చేందుకు ప్రభుత్వానికి గల ఆర్థికఇబ్బందులు మరొక సమస్య. ఆర్టీసీపై ఇప్పటికి గల మొత్తం బకాయిల భారం రూ.2209 కోట్లని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
వీటిమధ్య రూట్ల ప్రైవేటీకరణ (సంస్థగా ఆర్టీసీ కాదు), అందుకు అనుకూలంగా వచ్చిన కేంద్ర చట్టం మరొక తరహా ప్రశ్న. మొత్తమ్మీద ఏ ఒక్కటీ యూనియన్ నాయకులకు అనుకూలంగా సాగ టం లేదు. చివరికి సమస్య సాధారణ, అమాయక కార్మికులకు చుట్టుకుంటున్నది.
ఈ సందర్భంగా అందరూ గుర్తించవలసిన విషయం ఒకటున్నది. స్వాతంత్య్రానికి ముందులేని ప్రభుత్వరంగ సంస్థలు నెహ్రూ అభివృద్ధి నమూనా వల్ల ప్రముఖంగా ముందుకువచ్చాయి. కానీ అవి వివిధ కారణాల వల్ల విఫలమవుతుండటం వల్ల కొంత, దేశంలో ఆర్థికసంస్కరణలు మొదలుకావడంతో కొంత, ప్రైవేటీకరణ దశ అంతటా వచ్చివేసింది.
ఈ పరిణామక్రమం ఇండియాలోనే కాదు. వలసపాలన నుంచి బయటపడి సోషలిజం అంటూ మాట్లాడిన తృతీయ ప్రపంచదేశాలు అంతటా సాగిం ది. చివరికి రష్యాలోనూ పెరిస్ట్రోయికాలో భాగంగా ఇదే పని చేశారు. సరైనదా కాదా అనే చర్చ ఎట్లున్నా ఇది ప్రపంచవ్యాప్తమైన చేదునిజాల చరి త్ర. పరిస్థితులు ఇట్లా పరిణమించటానికి గల కారణాల్లో రాడికల్ ట్రేడ్ యూనియనిజం కూడా ఒకటి.
ఇవన్నీ చాలవన్నట్లు యూనియన్ నాయకులు సాధారణ ప్రజల సానుభూతిని పోగొట్టుకునే పొరపాటు ఒకటి మొదటిలోనే చేశారు. అది, పండుగకు ముందు సమ్మెను ఆరంభించటం. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకునే ఎత్తుగడలో ఆలోచన లోపించిందని, దాని ఖరీదు ప్రజల సానుభూతి అని తేలేందుకు ఎక్కువరోజులు పట్టలేదు.
ఆ విధంగా ఇప్పటికి 40 రోజులు గడిచినా సమ్మె పట్ల ప్రజల్లో ఉత్సుకత మినహా సానుభూతి కన్పించటం లేదు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యామ్నాయ రవాణా పెరిగినా కొద్దీ ప్రజలు సమ్మెను పట్టించుకోవటం కూడా తగ్గిపోయింది.
ఎవరైనా కార్మికుడు చనిపోయినపుడు అయ్యోపాపం అనటానికి మించి స్పందనలు కన్పించటం లేదు. యూనియన్ల చుట్టూ చేరి అంతా నిర్దేశిస్తున్న పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవటం ఇందుకు తోడవుతున్నది. ఈ పరిస్థితుల్లో పులి సవారీ నుంచి దిగటమెట్లా అన్నది యూనియన్ నేతలు తమలో తాము, జాగ్రత్త గా, భేషజాలకు పోకుండా, భవిష్యత్తును, కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకుంటూ చేయవలసిన ఆలోచన

1 comment:

  1. People are made to suffer for months together due to the adamant nature of government and unions. This may be the last strike in a long time from now.
    The families of RTC employees are suffering.

    ReplyDelete