Wednesday, March 16, 2011

ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!





ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణే అమర జీవి పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి!

ఈరోజు (2011 మార్చి 16) అమరజీవి పొట్టి శ్రీరాములు 110వ పుట్టిన రోజు.
ప్రతి సంవత్సరం మార్చ్‌ 16న జయంతినీ, డిసెంబర్‌ 16న వర్థంతినీ యాంత్రికంగా జరపడమే తప్ప - ఏ ఆశయంకోసం ఆయన ఆత్మార్పణ చేశారని ఆలోచించేవాళ్లే నేడు కరువయ్యారు.

నిజంగా ఈనాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఆయన ఆత్మ ''ఇది కాదు నేను ఆశించిన స్వరాష్ట్రం'' అని ఎంత క్షోభిస్తుందో అనిపిస్తుంది.
మద్రాస్‌ ప్రెసిడెన్సీలో తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయాన్నీ, తమిళుల దాష్టీకాన్నీ చూసి సహించలేక - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు దిగారు.
మద్రాసు రాజధానిగా తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ఆయన ప్రగాఢమైన ఆకాంక్ష.
(చారిత్రకంగా చెన్నడు అనే తెలుగు రాజు పాలించడం వల్లనే ఆ నగరానికి చెన్నై అనే పేరొచ్చిందంటారు.)
''మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తలకాయ లేని మొండెంతో సమానం'' అని ఆయన స్వయంగా ప్రకటించారు.
అయితే మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న పొట్టి శ్రీరాములు కల మాత్రం నెరవేరనే లేదు. ఆయన అభీష్టానికి విరుద్ధంగా ఏ వసతులూ లేని కర్నూలు రాజధానిగా 1 అక్టోబర్‌ 1953 నాడు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

నిజానికి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహూృ సహా చాలామంది జాతీయ నాయకులు వ్యతిరేకించేవాళ్లు.
ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడదీయడం అంటే దేశ సమగ్రతకు భంగం కలిగించడమే అని కొందరు ఇవాళ ఎలా వాదిస్తున్నారో -
ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్ర భావన దేశ సమైక్యతకు, జాతీయ భావనకు విఘాతం కలిగిస్తుంది అని ఎంతో మంది వాదించేవాళ్లు.

స్వాతంత్య్రం సిద్ధించి కొద్ది కాలమే అయింది కాబట్టి - అందరం ముందు జాతి ఐక్యతపై దృష్టిని కేంద్రీకరించాలనీ, కొంతకాలం తరువాతనే భాషాప్రయుక్త రాష్ట్రాల గురించి ఆలోచించాలనీ జవహర్‌లాల్‌ నెహూృ కూడా గట్టిగా చెప్పేవారు. అయితే ప్రజోద్యమానికి, మెజారిటీ అభిప్రాయానికి తలొగి -్గ తన కిష్టంలేకపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకరించారు.

మద్రాసును సాధించుకోలేకపోయిన ఆంధ్ర నాయకులు అప్పటికే సకల సౌకర్యాలున్న హైదరాబాద్‌ మహానగరం మీద దృష్టిని కేంద్రీకరించి విశాలాంధ్ర నినాదంతో మళ్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.

అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో మరాఠీ మాట్లాడే ఔరంగాబాద్‌ డివిజన్‌, కన్నడ మాట్లాడే గుల్బర్గా డివిజన్‌లతో కలిపి మొత్తం 16 జిల్లాలుండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ఊపందుకోవడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్రంలోని ఆయా భాషా ప్రాంతాల నేతలు అటు మహరాష్ట్రలో, ఇటు కర్ణాటకలో విలీనమయ్యేందుకు ఉత్సాహపడుతుండేవారు. మిగతా తెలుగు, ఉర్దూ మాట్లాడే తెలంగాణా ప్రాంతంలో - కొందరు విశాలాంధ్ర వైపు మొగ్గు చూపితే, మరికొందరు హైదరాబాద్‌ రాష్ట్రం స్వతంత్రంగా కొనసాగాలని అభిలషించారు.

ఈ నేపథ్యంలో ఫజల్‌ అ లీ కమిషన్‌ (మొదటి ఎస్‌ఆర్‌సి) నియమాకం జరిగింది. ఆ కమిషన్‌ హైదరాబాద్‌ రాష్ట్ర పరిస్తితులను కూలంకషంగా పరిశీలించి హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విడిగానే వుండనిచ్చి 1961 సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత ఆ అసెంబ్లీ గనక 3/2 వంతు మెజారిటీ ఆమోదంతో తీర్మానం చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని స్పష్టంగా సూచించింది.

అయితే 1961 వరకు ఆగితే హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రంతో కలవడానికి అంగీకరించరని ఆంధ్ర రాష్ట్ర నాయకులు లాబీయింగ్‌ ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలున్న 16 జిల్లాల హైదారాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించి ఒత్తిడి పెంచారు. ఈ డిమాండ్‌ సామ్రాజ్య వాద విస్తరణ లాంటిదని బాహాటంగా విమర్శిస్తూనే నెహూృ కొన్ని షరతులతో, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. సరిపడకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని ఆయన అప్పుడే చెప్పారు.

ఈవిధంగా తమిళుల పెత్తనం నుంచి పోరాడి బయటపడ్డ ఆంధ్ర ప్రాంత నేతలు, అనేక బూటకపు హామీలు, ఒప్పందాలతో తెలంగాణా ప్రాంతంపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణా అస్తిత్వాన్ని, ఆకాంక్షలనీ, కాల రాశారు. విలీనమై 60 సంవత్సరాలైనా కూడా ఆంధ్ర తెలంగాణా ప్రజల మధ్య ఆత్మీయతలు తరిగి, అగాధాలు పెరగడం ఒక విషాదం.

ఒక ప్రాంత దాష్టీకాన్ని ఎదిరించిన అమర జీవి పొట్టి శ్రీరాములు మరో ప్రాంతంపై అదే దాష్టీకాన్ని కొనసాగించడాన్ని ఇష్టపడతారని అనుకోలేం.
ఆయన కోరుకున్నది తమిళుల పెత్తనం నుంచి విముక్తి తప్ప తెలంగాణా ప్రజల మీద అజమాయిషీ కానే కాదు. ఆయన మద్రాసు రాజధానిగా గల ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నారే తప్ప హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణా పై పెత్తనాన్ని కాదు. ఒప్పందాలను ఉల్లంఘించడం, హామీలను తుంగలో తొక్కడం, ముందు ఒకటి చెప్పి తరువాత ఒకటి చేయడం, 'తొండి'కి దిగడం అమర జీవి పొట్టి శ్రీరాములు స్వభావానికి ఏమాత్రం సరిపడని అంశాలు. ఆయన ఈ బూటకపు మాటలను, బలవంతపు కాపురాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించి వుండేవారు కాదు గాక కాదు.

కాబట్టి 1956 కు ముందరి ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించడమే నేడు పొట్టి శ్రీరాములుకు మనం అర్పించే నిజమైన నివాళిగా భావించాలి.

3 comments:

  1. సోదరా, మీకు నిజం గా అభినందనలు.. జై తెలంగాణా జై ఆంధ్రా

    ReplyDelete
  2. ఇన్నాళ్లూ కనిపించలేదు. ఏమయ్యారు?

    ReplyDelete
  3. @ Ram గారు
    ధన్యవాదాలు.
    జై తెలంగాణా! జై ఆంధ్రా !!
    @ Praveen Sarma గారు,
    అజ్ఞాతవాసం.

    ReplyDelete