Saturday, April 16, 2016

బుద్ధుడూ - బౌద్ధమత భవిష్యత్తూ , రచన : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌

బుద్ధుడూ - బౌద్ధమత భవిష్యత్తూ

మత ప్రవక్తలు ఎంతోమంది వున్నప్పటికీ ఈ ప్రపంచాన్ని నలుగురు మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేశారంటారు అంబేడ్కర్‌ ఈ రచనలో.

వాళ్లు బుద్ధుడు, జీసస్‌, మహమ్మద్‌, కృష్ణుడు.
జీసస్‌ తనని తాను దేవుని కుమారుడిగా చాటుకుంటే,
మహమ్మద్‌ తాను  దేవదూతగా వచ్చినట్టు చెప్పుకున్నాడు. ఇంకో అడుగు ముందుకువేసి తానే 'చిట్టచివరి దేవదూతను' తన తదనంతరం మరే దేవదూతా వుండరని ప్రకటించాడు.
ఇక కృష్ణుడైతే తాను సాక్షాత్తు దేవుడిగా, దేవాధిదేవుడిగా చాటుకున్నాడు.

కానీ బుద్ధుడు మాత్రం ఎప్పుడూ తనకు తాను అలాంటి హోదాను ఏదీ ఆపాదించుకోలేదు. ఆయన సామాన్య మానవుడిగా వుండేందుకే ఇష్టపడ్డాడు. తన శిష్యులకు ఒక సామాన్య మానవుడిగానే ప్రబోధించాడు. తనకు తాను ఎన్నడూ మానవాతీత నేపథ్యాన్ని గానీ, మానవాతీత శక్తులను గానీ ఆపాదించుకోలేదు. ఎలాంటి అద్భుతాలను ప్రదర్శించలేదు.

మిగతా ముగ్గురి ప్రబోధాలు ప్రశ్నించడానికి వీలులేనివి. తిరుగులేనివి. దివ్యమైనవి. కానీ బుద్దుడి ప్రబోధాలు "కారణం-అనుభవం" అనే సూత్రాల మీద ఆధారపడినవి. తన శిష్యులెవరూ ''తాను చెప్పాను కాబట్టి'' అనే దృష్టితో తన ప్రబోధాలను ఆమోదించవద్దంటాడు బుద్ధుడు. "కారణం, అనుభవం" ఆధారంగా పేర్కొనబడినవి కాబట్టి వాటిని సవరించవచ్చు లేదా ఆయా పరిస్థితులకు వర్తించకపోతే విసర్జించవచ్చు అంటాడు.
మరే ఇతర ప్రవక్తా ఇలా అనుమతించేందుకు సాహసించలేదు.

హిందూమతం చాతుర్వర్ణ వ్యవస్థతో సమాజంలో దారుణమైన అసమానతలను సృష్టించి, పెంచి పోషిస్తే - బుద్ధుడు వర్ణ వ్యవస్థను గట్టిగా ఖండించాడు. హింసను, జంతుబలులను తీవ్రంగా నిరసించాడు. శాంతి, అహింస, సర్వమానవ సమానత్వంను ప్రబోధించాడు.
ఈనాటి ప్రపంచానికి సరైన మతం బౌద్ధమతం ఒక్కటే అంటారు అంబేడ్కర్‌.
చివరగా ఆయన ఇలా చెప్తారు:

.. బౌద్ధ మత వ్యాప్తికి పరిస్థితులు ఎంతో అనుకూలంగా వున్నాయి.
ఒకప్పుడు మతం అనేది వ్యక్తులకు వారసత్వంగా సంక్రమించేవాటిలో ఒకటిగా వుండేది. ...
ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తమకు వారసత్వంగా సంక్రమించిన మతాన్ని ధిక్కరించేందుకు సాహసిస్తున్నారు.
ఎంతోమంది శాస్త్రీయ పరిజ్ఞానం ప్రభావంతో అసలు మతమనేదే తప్పు, దానిని వదిలివేయాలని భావిస్తున్నారు.

మర్క్సిస్టు ప్రబోధాల ప్రభావంతో మరికొందరు మతం మత్తు మందు అనే నిశ్చయానికొచ్చారు. పేద ప్రజలు ధనికుల పెత్తనానికి లోబడి వుండేట్టు చేస్తుంది కాబట్టి మతాన్ని విసర్జించాలంటారు వాళ్ళు.
కారణాలు ఎమైనా కావచ్చు కానీ కానీ ప్రజల్లో మతాన్ని ప్రశ్నించే ధోరణి పెరుగుతోంది.
ఈ అంశాల గురించి లోతుగా ఆలోచించేందుకు సాహసిస్తున్నవారికి అసలు మతాన్ని కలిగి వుండటం అవసరమేనా , అయితే ఏ మతం సరైనది అనే ప్రశ్న ఎదురవుతోంది.

కాలం మారింది. ఇప్పుడు కావలసింది సంకల్పం.
బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్న దేశాలు గనక బౌద్ధమతాన్ని విస్తరింపజేయాలని సంకల్పిస్తే  బౌద్ధ మత వ్యాప్తి అంత కష్తమేమీ కాదు.
బౌద్ధ మతస్తుడు కేవలం మంచి బుద్ధిస్టుగా వుండటమే తన కర్తవ్యంగా భావించకూడదు. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడమే అతని కర్తవ్యం.
బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడం అంటే మానవాళికి సేవ చేయడమే నని బౌద్ధ మతస్థులంతా గ్రహించాలి "
...
ఇది చిరు పుస్తకమే అయినా మతాలపట్ల శాస్త్రీయ అవగాహనను కలిగిస్తుంది. బుద్ధుడిపట్లా బౌద్ధమతం పట్లా ఆసక్తిని, ఆలోచనలను రేకెత్తిస్తుంది


" బుద్ధుడూ - బౌద్ధ మత భవిష్యత్తూ " 
రచన : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌
ఆంగ్ల మూలం : Buddha And The Future Of His Religion 
తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార 

సమాంతర ప్రచురణలు 
ప్రథమ ముద్రణ: 14 ఏప్రిల్‌ 2008

వెల రూ. 10 మాత్రమే
ప్రతులకు :
Samaantara Dalit Book Centre
11-6-868/10,
1st Floor, Red Hills Road,
Lakdi-ka-pool, Hyderabad
Phone: 040-2330397
Cell: 92465 86254


No comments:

Post a Comment