Wednesday, December 5, 2012

కాలం మారింది !


కాలం మారింది


ఔను
కాలం మారింది
పులులు పులుగా ఉండే కాలం పోయి
మేకవన్నె పులులుగా మారే కాలం వచ్చింది!

ఇప్పుడు జనం 
అధికార గబ్బిలాలకు అదరడంలేదు
ఇప్పుడు జనం 
దొరల గాండ్రింపులకు బెదరడంలేదు!

అందుకే 
పులులన్నీ మేకతోళ్లు కప్పుకున్నాయి
గుంటనక్కలన్నీ 'సోషలిజం' (సంక్షేమం/అభివృద్ధి) ఊళలు నేర్చుకున్నాయి!
గండుపిల్లులు 'అహింసా' సూక్తులు బోధిస్తున్నాయి
భల్లూక శార్దూలాలన్నీ 'శాంతి' మంత్రాలు జపిస్తున్నాయి
కాలం మారింది మరి!

పీడకుల రక్షకులు
ఎర్ర పెయింట్‌ వందిమాగధులు
అదేపనిగ ఓండ్ర పెడుతున్నారు...
.....

వందిమాగధుల పక్కల్లో బల్లెం
వర్గ శత్రువుల డొక్కల్లో బాణం...
చైతన్యంతో విప్పారుతున్న అరణ్యాలు 
అన్నిరకాల ముసుగుల్నీ దహించి వేస్తున్నయ్‌!

ఔను!
కాలం మారింది
సమస్త శ్రామిక ద్రోహుల కాలం మూడింది!!



(ఈ కవిత కూడా 40 ఏళ్ల కిందటి ''సమరం'' కవితా సంకలనం లోనిదే. విక్రమ్‌ అన్న కలం పేరుతో రాశాను) 

Wednesday, November 21, 2012

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి !




నలభై ఏళ్ల కిందట రాసిన వ్యంగ్య కవిత ఇది.
ఇందులో కవిత్వం పాలు ఎలా వున్నా వస్తువు మాత్రం ఇప్పటికీ పాతబడలేదు.
ఇవాళ రాసినట్టే అనిపిస్తోంది.

సహచర కవి 'అగ్నిమిత్ర' సంపాదకత్వంలో వెలువడిన ''సమరం'' అన్న కవితా సంకలనంలో ఇది ముద్రించబడింది. ఆ పుస్తకం ప్రతిని నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను. చాలా విచిత్రంగా ఈ మధ్య ఒక మిత్రుడి వద్ద కనిపిస్తే జెరాక్స్‌ తీసి పెట్టుకున్నాను.
అందులో నావి నాలుగు కవితలున్నాయి.

1972లో (తేదీ గుర్తులేదు) హన్మకొండలోని ''రాజరాజనరేంద్ర గ్రంథాలయం''లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో క్రిక్కిరిసిన సాహిత్యాభిమానుల ముందు నిలబడి సభాకంపంతో ఈ కవితను చదవడం ఇప్పటికీ గుర్తుంది.

సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు ''సమరం'' పై  తన అభిప్రాయం తెలియజేస్తూ రాసిన కార్డును (చందమామ పత్రిక ఎంబ్లెం వున్న పోస్టుకార్డు) కూడా నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడే చూశాను. ఫలానా కవితలు బాగున్నాయి అంటూ ఆయన ప్రస్తావించిన నాలుగైదు కవితల్లో ఈ కవిత కూడా వుండటం థ్రిల్లింగ్‌గా అనిపించింది.

ఫేస్‌బుక్‌లో తన మనసులోని మాటను రాసిన పాపానికి ఒకరు, ఆ అభిప్రాయాన్ని ఇష్టపడినందుకు (లైక్‌ మీద మౌస్‌తో జెస్ట్‌ క్లిక్‌ చేసినందుకు) మరొకరు - ఇద్దరు ముంబాయి అమ్మాయిలు జైలుపాలవడం,  మొదటి అమ్మాయి బంధువుల డిస్పెన్సరీమీద దాడిజరగడం వంటి సంఘటనలు, తెలంగాణా సమస్య పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచకీయ, అవకాశవాద విధానాలు, అవనీతి  మొదలైన వాటి  నేపథ్యంలో ఈ కవితను చదువుతుంటే చిత్రమైన అనుభూతి కలుగుతోంది.

నిజంగానే మన ప్రజాస్వామ్యం మూడు పూవులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది!



ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి !

ప్రజాస్వామ్యం వర్థిల్లాలి
లక్షాధికారుల్ని కోటీశ్వరులుగా పెంచి
బీదవాళ్లను బిచ్చగాళ్లగా మార్చే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

తినడానికి తిండిలేక
కట్టడానికి బట్టలేక
కోట్లాది ప్రజలు ఆకలితో అ లమటిస్తున్నా
వీధుల్లో అడుక్కుతింటున్నా
సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం అని పాడే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

కూడులేదని, భూమిలేదని
ఉద్యోగాలివ్వమని, జీతాలు పెంచమని
మొరపెట్టుకునే నిరాయుధ 'పౌరుల్ని'
లాఠీలతో తన్ని-తుపాకులతో కాల్చి-జైళ్లలో కుక్కి
బలవంతంగా వాళ్ల నోళ్లు నొక్కే
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట
లాఠీచార్జీలు, 144 సెక్షన్లు, బాష్పవాయు ప్రయోగాలు
కర్ఫ్యూలు, కాల్పులు ఘోరాతిఘోరంగా జరుగుతున్నా
వందల సంఖ్యలో జనం నేలకొరుగుతున్నా
మా దేశం శాంతికాముక దేశం
మా దేశం అహింసావాద దేశం అని చాటుకునే
మహత్తర ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

స్వా (హా) తంత్య్రం వచ్చి పాతికేళ్లయినా
మాల, మాదిగ, ఎరుకలి, డక్కలి, లంబాడీ, కోయ,
ఫకీర్‌, బైరాగి, బైటికమ్మరి, బాలసంత వగైరా పేర్లతో
విద్యకీ, విజ్ఞానానికీ దూరంగా
స్వాతంత్య్రానికీ, సమాజానికీ దూరంగా
పాతరాతియుగం నాటికంటే హీనంగా
(కుక్కల వలె, నక్కలవలె, సందులలో పందులవలె...)
కోట్లాది భారతీయులు వెట్టిబతుకులు బతుకుతున్నా
మా రాజ్యాంగంలో సర్వమానవులూ సమానమంటూ
నీతులు కూసే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ఊళ్లనే కొనగల పెట్టుబడిదార్లు ఒకవైపు
కడుపునిండా కూడులేని బీదవాళ్లు మరోవైపు వున్నా
సోషలిజం, సమానత్వం అంటూ ఓండ్రపెట్టే
ధనవంతుల ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

లక్షాధికార్లకు, లంచగొండులకు, గుండాలకు
దొంగలకు, లుచ్ఛాలకు, భూలోక స్వర్గంలాంటి ప్రజాస్వామ్యం
ఖద్దర్‌ నాయకుల విదేశపర్యటనలకు, విందులకు
వినోదాలకు ఉపయోగపడే ప్రజాస్వామ్యం-
బిచ్చగాళ్లతో, కరువు కాటకాలతో, రోగాలతో
ఆకలిమంటలతో, నిరుద్యోగులతో, నిరక్షరాస్యులతో
దోపిడీ దొంగతనాలతో, కల్తీవ్యాపారాలతో, వ్యభిచారాలతో
లుకలుకలుకలుక లాడుతున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

ఈ ప్రజాస్వామ్య వైభవాన్ని చూచి ఓర్వలేక
సమసమాజం, కమ్యూనిజం అంటూ
'దుండగులు' చేస్తున్న 'హింసా' చర్యలు నశించాలి
'చట్టబద్ధ' ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

(రచనా కాలం: 1972)


Tuesday, November 20, 2012

2012 యుగాంతం 4012 కు వాయిదా !


2012 యుగాంతం 4012 కు వాయిదా !

కోటానుకోట్ల జనం గజ గజ వణుకుతూ ఎదురు చూస్తున్న 2012 యుగాంతం 
అనివార్య కారణాల వల్ల 4012 కు వాయిదా పడిందని తెలియజేయడానికి విచారిస్తున్నాము. 

గతం లో  "అష్టాగ్రహ కూటమి"-  "1999 డిసెంబర్ 31 ప్రళయం" నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.. 
అయితే 4012 యుగాంతం మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని కొందరు ఆస్తికులు ఢమకా బజాయించి చెప్తున్నారు.  4012 యుగాంతానికి స్వాగతం పలికేందుకు వారు ఇప్పటినుంచే సన్నాహాలను మొదలు పెట్టారు. 

నాస్తికులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ బతుకు పోరాటాల్లో తాము నిమగ్నమై వున్నట్టు మా ప్రతినిధి తెలియజేస్తున్నారు.  కాగా , యుగాంతం ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ప్రజల్లో బొత్తిగా భయభక్తులు లేకుండా పోతాయని మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
దీనిపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ముందు విశ్వ వాణి వార్తల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.  

(ఫేస్ బుక్ లో ఒక మిత్రుడి వ్యాఖ్య చూసి సరదాగా)



Monday, October 29, 2012

సీమాంధ్ర నగరాల్లో బతుకమ్మ ఎందుకు కనిపించదు ?





తెలంగాణా లో సరే...

డల్లాస్ లో బతుకమ్మ...
కాలిఫోర్నియాలో బతుకమ్మ...
న్యూ జెర్సీ లో బతుకమ్మ ...
అట్లాంటాలో బతుకమ్మ ...
డెట్రాయిట్ లో బతుకమ్మ ...
చికాగోలో బతుకమ్మ ...
బోస్టన్ లో బతుకమ్మ ...
వాషింగ్టన్ లో బతుకమ్మ ...
టోరంటో లో బతుకమ్మ
సిడ్నీ లో బతుకమ్మ ...
లండన్ లో బతుకమ్మ...
బెర్లిన్ లో బతుకమ్మ ...
దుబాయ్ లో బతుకమ్మ ..

కానీ .....
విజయవాడలో నో బతుకమ్మ ....
విశాఖపట్నం లో నో బతుకమ్మ ...
రాజమండ్రి లో నో బతుకమ్మ ...
కడపలో నో బతుకమ్మ ...
తిరుపతి లో నో బతుకమ్మ ...

ఎందుకు?
సీమాంధ్ర నగరాల్లో ఎక్కడా
పట్టుమని పదిమంది
తెలంగాణా ఆడ పడచులే లేరా ??????

ఆరు దశాబ్దాల సమైక్యత ఫలితంగా
తెలంగాణలో ఏ నగరం లో చూసినా
వేలకు వేల సంఖ్యలో
ఆంద్ర ఆడపడచులు కనిపిస్తారు కదా

ఆంద్ర నగరాల్లో తెలంగాణా ఆడపడచులు
లేకపోవడం ఏమిటి?!
కారణాలు ఎవరైనా విశ్లేషించ గలరా ...?



Wednesday, October 24, 2012

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్‌ గంగోపాధ్యాయకు నివాళి ...


కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, సుప్రసిద్ధ బెంగాలీ కవి, కథా రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ (78)  23 అక్టోబర్‌ 2012 తెల్లవారు జామున రెండు గంటలకు కోల్‌కతాలో, గుండెపోటుతో మరణించారన్న వార్త విషాదాన్ని కలిగించింది.

2010 ఆగస్ట్‌ 20న గోవాలో వారి చేతుల మీదుగానే నేను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారాన్ని  అందుకున్నాను.  (డా. యాగాటి చిన్నారావు గారి  'దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ' అన్న థీసిస్‌ను ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన అనువాదానికి, 2009 సంవత్సరానికి గాను ఈ బహుమతి లభించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు).

అకాడమీవారు పంపించిన బహుమతి ప్రదానోత్సవ ఫొటోను నేను షోకేసులో భద్రంగా దాచుకోవడం వల్ల ఈ రెండేళ్లలో వారు నాకు ఎంతో సుపరిచితుడిలా మారారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 200కు పైగా పుస్తకాలు ప్రచురించారు. అనేక కథలూ, నవలలూ, బాల సాహిత్యం, యాత్రా రచనలు చేశారు. అయితే ఆయనకు కవిత్వమంటేనే ఎక్కువ ఇష్టం. స్వయంగా క్రృతిబాస్‌ అనే కవిత్వ మాసపత్రికను నిర్వహిస్తూ అనేక మంది యువకవులను ప్రోత్సహించారు. వారి 'నీరా' కవితలు బెంగాల్‌లో ఆబాల గోపాలనాన్ని ఆకుట్టుకున్నాయి.

వారు రాసిన కొన్ని నవలలను సత్యజిత్‌ రే ( అరణ్యర్ దిన్ రాత్రి , ప్రతిద్వంది ) , గౌతం ఘోష్ ( అబర్ అరణ్య  ) వంటి ప్రఖ్యాత దర్శకులు చలన చిత్రాలుగా మలిచారు. తన పేరుతోనే కాకుండా ''నీల్‌ లోహిత్‌, నీల్‌ ఉపాధ్యాయ్‌, సనాతన్‌ పాఠక్‌'' వంటి కలం పేర్లతో కూడా ఆయన రచనలు చేశారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 1985 లో " సి సమోయ్ (అప్పటి రోజులు)" నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆ తరువాత ఐదు సంవత్సరాలు ఉపాధ్యక్షులుగా పనిచేసి 2008లో కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌ నగరంలో వుంటున్నారు. అతను వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.

సునీల్‌ గంగోపాధ్యాయ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.








.



Wednesday, October 17, 2012

" తెలంగాణా కలం పై కత్తి " - అల్లం నారాయణ ...


వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను కార్మిక నాయకుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు
నేను ప్రొటెస్టెంట్‌ను కాబట్టి మాట్లాడలేదు

చివరకు వాళ్లు నా కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు.

- మార్టిన్‌ నీమోల్లర్‌
(జర్మినీలో నాజీల పాలన గురించి)

ఇవాల్టి (17 10 2012 ) నమస్తే తెలంగాణా సంపాదకీయం
" తెలంగాణా కలం పై కత్తి " చదవండి 


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76911&boxid=96896896


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76921&boxid=96918792



Sunday, October 14, 2012

నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !



నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి//

తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి//

పువ్వులో పూవునై నీ పూజ చేశాను
నీరై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను
దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను
నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ...
నా కన్న కొడుకుపై ఈశ్వరా
నీ కరుణ ఏమైందిరా శంకరా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి//

శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను
దీప మారాకుండ పడిగాపు లున్నాను
నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను
కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు
తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ...
తొలుసూరు కోడుకనీ ఈశ్వరా
నీ పేరు పెట్టుకుంటీ శంకరా
అందుకే వేశావా ఈ శిక్షనూ
అందుకే వేశావా ఈ శిక్షనూ
అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి//

ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను
అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను
చిననోట నా కొడుకు అమ్మని పలికితే
ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను
పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ...
పురిటినొప్పుల బాధ ఈశ్వరా...
నీ పార్వతిని అడగరా శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతినా
ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి//

-మిట్టపల్లి సురేందర్ ( పోరు తెలంగాణా)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా 
పోరు  తెలంగాణమా 

అదిగో  ఆ  కొండల నడుమ  తొంగి  చూసే ఎర్రని  భగవంతు డెవడు  ... సూర్యుడు ఆ  ఉదయించే  సూర్యునితో  పొడుస్తున్న  పొద్దుతో
పోటీ పడి  నడుస్తుంది  కాలం , అలా  కాలంతో  నడిచినవాడే  కదిలిపోతాడు , ఓ  పొడుస్తున్న  పొద్దు  వందనం...  వందనం

ఆ .. పొడుస్తున్న ..బలే  బలే  బలే  బలే  బలే  బలే ...
పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా
పోరు  తెలంగాణమా - పోరు  తెలంగాణమా
కోట్లాది  ప్రాణమా... కోట్లాది  ప్రాణమా...  //పొడుస్తున్న  పొద్దుమీద //

ఓ  భూతల్లి  సూర్యుడిని  ముద్దాడిన  భూతల్లి , అదిగో  చిన్నారి  బిడ్డల్ని  జన్మనిచ్చింది , అమ్మా  నువ్వు  త్యాగాల  తల్లివి  త్యాగాల  గుర్తువు

భూతల్లి  బిడ్డలు  చిగురించే  కొమ్మలు
చిదిమేసిన  పువ్వులు  త్యాగాల  గుర్తులు
హా... మా  భూములు  మాకేనని ...  బలే  బలే  బలే  బలే  బలే హా.
మా  భూములు  మాకేనని  మర్లబడ్డ  గానమ
తిరగబడ్డ  రాగమా  మర్లబడ్డ  రాగమా  తిరగబడ్డ  రాగమా
పోరు  తెలంగాణమా  .. కోట్లాది  ప్రాణమా. //పొడుస్తున్న  పొద్దుమీద //


అమ్మా  గోదావరి  నీ  వొడ్డున  జీవించే కోట్లాది  ప్రజలకు  జీవనాధారము , అమ్మా  కృష్ణమ్మా  కిల  కిల నవ్వే  కృష్ణమ్మా
అమ్మా  మీకు  వందనం

గోదావరి  అలలమీద  కోటి కలల  గానమా
కృష్ణమ్మా  పరుగులకు  నురుగుల  హారమా
హా...  మా  నీళ్ళు  ... బలే  బలే  బలే  బలే  బలే బలే
మానీళ్ళు  మాకేనని  కత్తుల  కోలాటమా
కన్నీటి  గానమా  కత్తుల  కోలాటమా  కన్నీటి  గానమా ... // పోరు  తెలంగాణమా//

అదిగో  ఆ ప్రక్రుతిని  చూడు  అలా  అలుముకుంటుంది , ఆ  కొమ్మలు  గాలితో  ముద్దడుతాయి , ఆ  పువ్వులు  అలా  ఆడుతాయి
అదిగో  పావురాలజంట  నేనెప్పుడు  విదిపోనంటాది

విడిపోయిన  బంధమా    చెదిరిపోయిన  స్నేహమా
ఎడబాసిన  గీతమా  ఎదలనిండా  గాయమ
పూవులు   పుప్పోడిలా    బలే  బలే  బలే  బలే  బలే
పువ్వు  పుప్పోడిల  పవిత్ర బంధమా  పరమాత్మునిరూపమా  
పవిత్ర బంధమా    పరమాత్ముని  రూపమా  // పోరు  తెలంగాణమా//
//పొడుస్తున్న  పొద్దుమీద //

అదిగో  రాజులు దొరలు వలస దొరలు , భూమిని  నీళ్ళని  ప్రాణుల్ని  సర్వస్వాన్ని  చెరబట్టారు , రాజుల  ఖడ్గాల కింద    తెగిపోయిన  శిరస్సులు

రాజరికం  కత్తిమీద   నెత్తుర్ల   గాయమా
దొరవారి  గడులల్లో  బలే  బలే  బలే  బలే  బలే  బలే
దొరవారి  గడులల్లో  నలిగిపోయిన  న్యాయమా
ఆంద్ర వలస    తూటాలకు  ఆరిపోయిన  దీపమ
మా  పాలన  బలే  బలే  బలే  బలే  బలే  బలే
మా  పాలన  మాకేనని  మండుతున్న  గోళమ
అమరావేరుల  స్వప్నమా  మండుతున్న  గోళ మా అమరవీరుల   స్వప్నమా
మండుతున్న  గోళమ  అమరవీరుల  స్వప్నమా
అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా

- గద్దర్ (జై బోలో తెలంగాణా ) 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,




Wednesday, October 3, 2012

మానవ మృగాలు చెలరేగిన నేల... ఖైర్లాంజీ ... ఒక చేదు పాట ...


Khairlanji, A Strange and Bitter Crop by Anand Teltumbde

2006 సెప్టెంబర్‌ 29 నాడు మహారాష్ట్రలోని ఖైర్లాంజీ గ్రామంలో సురేఖా భోట్‌మాంగే అనే మహిళనూ, ఆమె కూతురు ప్రియాంకా భోట్‌మాంగేనూ వివస్త్రల్ని చేసి, నగ్నంగా ఊరేగించి, వారిపై సామూహికంగా అత్యాచారం జరిపి హత్యచేశారు. 

వారితోపాటు సురేఖ కుమారులు రోషన్‌, సుధీర్‌లను కూడా దారుణంగా కొట్టి చంపారు. ఈ పాపంలో గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు. తరువాత ఆ నాలుగు శవాలనూ తీసుకెళ్లి పక్కనే వున్న కాలువలో పడేశారు. 

భోట్‌మాంగేలు దళితకులానికి చెందినవాళ్లు. జనం అప్పుడే వాళ్లని మరిచిపోయారు. ప్రతి రోజు సగటున ఇద్దరు దళితులు ఈవిధంగా హత్యకు గురయ్యే ఈ దేశంలో ఇదో మామూలు విషయమైపోయింది. స్వాతంత్య్రానంతరం మన దేశంలో జరిగిన కులపరమైన అత్యాచారాల్లో అత్యంత దారుణమైన ఖైర్లాంజీ ఉదంతాన్ని ఆనంద్‌ తెల్‌తుంబ్డె ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. మన చుట్టూ ఖైర్లాంజీలు పదేపదే ఏవిధంగా, ఎందుకు పునరావృతమవుతున్నాయో వివరించారు.

21వ శతాబ్దపు భారతదేశంలో ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా, సంప్రదాయకంగా ఊచకోతకోసిన సంఘటనపై ఆనంద్‌ తెల్‌తుంబ్డే చేసిన ఈ విశ్లేషణతో మన సమాజం ఎంత కుళ్లిపోయివుందో అర్థమవుతుంది. 

ఈ ఊచకోత వెనకవున్న కారణాలనూ, ఇ లాంటి కిరాతకాలు జరగడానికి దోహదం చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలనూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార ప్రసార మాధ్యమాలు అన్నింటినీ ఎండగడుతుంది. సమాజంలో పశుప్రవృత్తి పెరగడానికి, ఆతరువాత వాటిని కప్పిపుచ్చడానికి అవన్నీ ఎలా తోడ్పడుతున్నాయో వివరిస్తుంది.  

భూస్వామ్య వ్యవస్థ అవశేషాలనో అంతిమదినాలనో అభివర్ణించే పుస్తకం కాదిది. భారతదేశంలో ఆధునికత అంటే అర్థమేమిటో తెలియజెప్పే పుస్తకం. సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చించిన పుస్తకం.

- అరుంధతీ రాయ్‌

..................................................................................................................................


మానవ మృగాలు చెలరేగిన నేల  ఖైర్లాంజీ 
ఒక చేదు పాట 

ఆనంద్ తెల్ తుంబ్డే రచించిన   KHAIRLANJI, A Strange And Bitter Crop కు తెలుగు అనువాదం 
" మానవ మృగాలు చెలరేగిన నేల...  ఖైర్లాంజీ ... ఒక చేదు పాట " 
ఆవిష్కరణ సభ 
 08 అక్టోబర్ 2012, సోమవారం, సాయంత్రం  6-00 గంటలకు 
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
 .
అధ్యక్షత :................... ప్రొఫెసర్ కే. సత్యనారాయణ, EFLU
ముఖ్య అతిధి :............ ఆనంద్ తెల్ తుంబ్డే 
ఆవిష్కర్త :.................. కే. ఆర్. వేణుగోపాల్ IAS Retired
పుస్తక పరిచయం :......ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి 
ప్రచురణ కర్తలు :.........మలుపు బుక్స్ 
పుస్తక అనువాదకులు: ప్రశాంత్, ప్రభాకర్ మందార 


Malupu Books
2-1-1/5, Nallakunta, 
Hyderabad- 500044

Email ID :........ malupuhyd@gmail.com
Malupu Blog:... http://malupu.wordpress.com









.



Tuesday, October 2, 2012

గాంధీ సిద్ధాంతాలను మరచిపోయినా గాంధీని మాత్రం మరచిపోలేం !



( ఫోటో వ్యాఖ్య )

ఎవరన్నారు బాపూ
మేం నిన్ను మరచిపోయామని !?
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ
మా శ్వాస, ధ్యాస, ప్రయాస
మా గమనం, గమ్యం అంతా నువ్వే కదా
నిన్నెలా మరచిపోగలం ?
మా అణువణువణువణువునా నువ్వే వ్యాపించి వున్నావు
సమసమాజం ఏర్పడేంతవరకూ
నీ మీద మా భక్తి పారవశ్యాలకు ఢోకాలేదు బాపూ

Saturday, September 29, 2012

ఆత్మబలిదానాలకు చరమగీతం పాడేందుకే ఈ తెలంగాణా మార్చ్‌


అన్యాయాలకు
అక్రమాలకు
అవహేళనలకు
అబద్ధాలకు
ఆధిపైత్యపు అహంకారాలకు
అవకాశవాదుల నక్కజిత్తులకు
కాగితం పులుల ప్రేలాపనలకు
ఆత్మన్యూనతకు
ఆత్మబలిదానాలకు
చరమగీతం పాడేందుకే
ఈ తెలంగాణా మార్చ్‌


Monday, September 24, 2012

ప్రతిఒక్కరికి ఎందులోనో ఒకదాన్లో ప్రతిభ వుంటుంది.


Everyone is a genius. But if you judge a fish on its ability to climb a tree, it will live its whole life believing that it is stupid.
- Albert Einstein

ఈ లోకంల ప్రతిఒక్కరూ ప్రతిభావంతులే .
కని, 'ఏదీ చెట్టెక్కి సూపియ్' అని చేపకు పరీక్ష పెట్టినవనుకో 
ఇగ అది ఈత సంగతి మర్సిపోయి  'నాకు చెట్టెక్క రాదు  ఏం రాదు' 
అని జీవితమంత కుములుకుంట  కూసుంటది. 



Sunday, September 23, 2012

ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ 'లోపలి మనిషి' ...



భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. 
అవసరమా?
అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో మరాఠీ, కన్నడ, తెలుగు మూడు భాషలుండె. 
ఆ మూడింటినీ అధికార భాషలుగా గుర్తిస్తూ హైదరాబాద్‌ స్టేట్‌ను అలాగే ఉంచితే ఏమయ్యేది?
స్విట్జర్లాండ్‌లాంటి దేశానికి ఆరు అధికార భాషలున్నప్పుడు 
హైదరాబాద్‌ రాష్ట్రానికి మూడు ఉంటే తప్పేంటి?

....
అప్పటి హైదరాబాద్‌ జనరల్‌ జి.ఎన్‌.చౌదరి (బెంగాలీ వ్యక్తి). 
ఇక్కడి వారికి ఇంగ్లీష్‌ రాదని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మద్రాసీ, బెంగాలీ, ఉత్తర భారతీయులను వేల సంఖ్యలో తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. 
అది ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా కొనసాగింది. 
ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్‌ రాదు అని ఆంధ్రులను ఉద్యోగాల్లో భర్తీ చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం.

నాకు ఒక విషయం అర్థం కాలే... 
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తెలుగు అర్థమవుతుంది. 
తెలుగు రాయగలరు. చదవగలరు. 
అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్‌ ఇంగ్లీష్‌లో ఎందుకు సాగాలి?
అంతా ఇంగ్లీష్‌లోనే సాగాలి అనుకున్నప్పుడు 
భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటి మరి ????

- ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌

...

చదవండి ఇవాళ్టి (23 సెప్టెంబర్‌ 2012) - నమస్తే తెలంగాణా - దిన పత్రికలోని జిందగీ శీర్షిక కింద (Page No.10) ప్రచురించిన ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ లోపలి మనిషి : 'అది అత్యంత విషాదం' ను పూర్తిగా ఇక్కడ:
 ... ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ ...

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=9/23/2012%2012:00:00%20AM&querypage=10




.

ఈ ప్రపంచం ఎవరి వల్ల నశిస్తుంది?


The world will not be destroyed by those who do evil,
but by those who watch them without doing anything.
- Albert Einstein


చెడ్డోళ్ల వల్ల ఈ ప్రపంచం నాశనం కాదు. 
ఆ చెడును అడ్డుకోకుండా ఊరికే సూసుకుంట కూసునే 
మంచోళ్ళ వల్లనే ఈ దునియా నాశనమైపోతది.


Saturday, September 22, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి "

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ   "నిర్జన వారధి " 
పుస్తకావిష్కరణ సభ 23 సెప్టెంబర్ 2012 ఆదివారం ఉదయం 10 .30 కు హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీ లోని ఉర్దూ హాల్ లో. 
92 సంవత్సరాల కోటేశ్వరమ్మ గారు స్వయంగా పాల్గొంటున్నారు.


Wednesday, September 19, 2012

Money Money డబ్బు డబ్బు ...


Yes
Money can't buy happiness
But
It's more comfortable to cry 
sitting in a Car than on a bicycle.

నిజమే 
డబ్బు తోని సంతోషాన్ని కొనలేం 
కని
(కిస్మత్ లాత్ గొట్టినప్పుడు)
సైకిల్ మీద కూసుని ఏడ్వడం కంటే 
కారు లోపల కూసుని ఏడ్వడం 
చాన సౌలత్ గ ఉంటది కద! 



Tuesday, September 18, 2012

Charlie Chaplin చార్లీ చాప్లిన్ మాట ...




My  pain may be the reason for sombody’s laugh 
But my laugh must never be the reason for somebody’s pain. 
.........................................................  - Charlie Chaplin


గీ చార్లీ చాప్లిన్ మాటల మత్లబ్ ఏంటిదంటే ...

నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వనీ, ఏం పర్వలేదు.
కని, నువ్వు మాత్రం ఇంకొకడి కష్టాన్ని చూసి ఎప్పుడు నవ్వకు బిడ్డ.

గా పని చెడ్డోళ్ళు చేస్తరు గని మంచోళ్ళు చెయ్యరు. అని


.



Sunday, September 16, 2012

విమోచనమా విద్రోహమా !?



విమోచనమా విద్రోహమా !?

సెప్టెంబర్‌ 17
విమోచన దినమా
ఎవరినుంచి ఎవరికి విమోచనం
తిరగబడ్డ ప్రజల నుండి జమీందార్లకూ, దొరలకా
ఎర్రదండు ప్రభంజనంనుండి 
నిజాము నవాబుకూ ఆయన తాబేదార్లకా
ఎవరికి విమోచనం?

సెప్టెంబర్‌ 17 
విద్రోహ దినమా
ఎవరిది విద్రోహం
పోరాటాన్ని సగంలో వదిలేసిన కామ్రేడ్లదా
అధికార తుపాకీ అంది ఏడాదైనా కాకముందే
పాముని రాజప్రముఖున్ని చేసి 
చీమల్ని చీల్చిచెండాడిన నల్లదొరలదా
ఎవరిది విద్రోహం?

ఈనాటి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా
వారి అస్తిత్వ పోరాటంలో పాలుపంచుకోకుండా 
ఏ దినాలనైనా జరుపుకునే అర్హత వుంటుందా
తమ 'దినాలను' తప్ప!



Friday, September 14, 2012

విరసం ఆవిర్భావం నాటి ఒక అరుదైన ఫోటో

విరసం ఆవిర్భావం నాటి ఒక అరుదైన ఫోటో :

పెద్దగా కనిపించేందుకు ఫోటో పై క్లిక్ చేయండి :



Wednesday, September 12, 2012

Nothing is permanent in this wicked world. Not even our troubles - Charlie Chaplin/ ఈ లత్తకోరు దునియాల ఏదీ శాశ్వితం కాదు. ఆఖరికి మన కష్టాలు సుత. - చార్లీ చాప్లిన్


Nothing is permanent in this wicked world.
Not even our troubles.  - Charlie Chaplin

ఈ లత్తకోరు దునియాల ఏదీ శాశ్వితం కాదు.
ఆఖరికి మన కష్టాలు సుత.   - చార్లీ చాప్లిన్



Thursday, January 5, 2012

ధ్వంసమైన స్వప్నం - బ్రోకెన్‌ రిపబ్లిక్‌ ... అరుంధతీ రాయ్‌ ...

అరుంధతీ రాయ్‌ రాసిన 'బోకెన్‌ రిపబ్లిక్‌' ను మలుపు, హైదరాబాద్‌ వారు తెలుగులో 'ధ్వంసమైన స్వప్నం' పేరుతో ప్రచురించారు. గత సంవత్సరం ఆగస్ట్‌ 20న హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సభలో, అరుంధతీ రాయ్‌ సమక్షంలో ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ డిప్యూటీ ఎడిటర్‌ బెర్నార్డ్‌ డిమెల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీక్షణం సంపాదకులు ఎన్‌.వేణుగోపాల్‌ పుస్తకపరిచయం చేశారు. 

ఈ పుస్తకం ముందుమాట ('తొలి మలుపు')లోంచి కొన్ని భాగాలు:

ఒక్క నెత్తుటి చ్కు కూడా నేలరాలకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు తేగలిగే శక్తి ఒక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే ఉంది అంటారు ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరైన డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌. అది ఆయన స్వప్నం కూడా. 

భిన్న జాతులు, తెగలు, మతాలూ కులాలు, సంస్కృతులు వాటి ప్రాతిపదికన ఏర్పడ్డ అసమానతల దొంతరలతో ఉన్న భారతీయ సమాజానికి ప్రజాస్వామ్యం ఒక్కటే శరణ్యమని ఆయన గట్టిగా భావించారు. ఆ మేరకు ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంలో అనేక రక్షణలను పొందుపరిచారు. కానీ గడిచిన అరవై ఏళ్లలో మన పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా చేసారు.

ఇప్పుడు ఆ స్వప్నం ధ్వంసమైపోయింది.

ఇవాళ ప్రజలు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నెత్తురోడి పోరాడవలసి వస్తోంది. ప్రజలకు ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వం మీద ప్రాణాలకు తెగించి పోరాడవలసివస్తోంది. అదీ ఇప్పటి విషాదం!

...

... ఇలాంటి సందర్భంలో కూడా మొక్కవోని ధైర్యంతో పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడుతోన్న అరుదైన మేధావి అరుందతీ రాయ్‌. ఆమె ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో పరిణామాలపై ఇంగ్లీషులో రాసిన ''చిదంబరం'స్‌ వార్‌,  వాకింగ్‌ విత్‌ కామ్రేడ్స్‌,  ట్రికిల్‌డౌన్‌ రెవొల్యూషన్‌''  వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ''ధ్వంసమైన స్వప్నం.'' 

ఇందులో వున్న మూడు వ్యాసాలు ప్రస్తుతం దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టి చూపిస్తాయి.



.....

ధ్వంసమైన స్వప్నం


చిదంబర రహస్యం. కారడవిలో కామ్రేడ్స్‌తో. మానవజాతి మనుగడకోసం విప్లవం.
- అరుంధతీ రాయ్‌


ఆంగ్లమూలం: Chidambaram's War, Walking with Comrades, Trickledown Revolution.


అనువాదం : ప్రభాకర్‌ మందార. పి.వరలక్ష్మి. కడలి.


208 పేజీలు, వెల: రూ. 75

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌
ఇ మెయిల్‌ : malupuhyd@gmail.com

ప్రతులకు:
2-1-1/5/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044

.

Tuesday, January 3, 2012

హిందూ మతానంతర భారతదేశం ... పోస్ట్‌ హిందూ ఇండియా ... కంచ ఐలయ్య ...



ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రచించిన ''పోస్ట్‌ హిందూ ఇండియా''ను ఎమెస్కో హైదరాబాద్‌ వారు ''హిందూ మతానంతర భారతదేశం'' పేరిట తెలుగులో ప్రచురించారు. 28 డిసెంబర్‌ 2011న హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఈ పుస్తకాన్ని ఒక ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలిక ఎం. ఝాన్సీ ఆవిష్కరించింది. నాటి కార్యక్రమంలో రచయితతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ కాకి మాధవరావు, ఎమెస్కో సంపాదకులు శ్రీ డి. చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఆ పుస్తకం లోని ఉపోద్ఘాతం నుంచి కొన్ని భాగాలు:
...
భారతజాతి అంతర్యుద్ధ ప్రమాదం అంచున వుందన్న గాఢమైన భావనలోంచి ఈ పుస్తకం పుట్టింది.
హిందూమతం అనేక శాతాబ్దాల నుంచి పెంచి పోషిస్తూ వస్తున్న కుల వ్యవస్థ లోలోపల కుతకుతలాడుతోంది. హిందూ సంస్కృతి తనలోని స్వీయ వినాశక వైరుధ్యాలను తనే ఒక్కటొక్కటిగా బయటపెట్టుకుంటోంది. కుల సమాజమంతటా అది ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ఈ పుస్తకం దళితబహుజనుల సాంస్కృతిక, శాస్త్రీయ, ఆర్థిక జ్ఞాన వ్యవస్థలను లోతుగా పరిశీలిస్తుంది. దళితబహుజనుల పరస్పర సంబంధాలనూ, అ లాగే వారికి

హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతో వున్న సంబంధాలనూ సమగ్రంగా విశ్లేషిస్తుంది.
దళితబహుజన సమాజాలు ఎన్నో సంవత్సరాలుగా శాస్త్ర, సాంకేతిక, ఉత్పత్తి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి పరుస్తూ వస్తే - బ్రాహ్మణీయ హిందూమతం ఉత్పత్తి వ్యతిరేక, అశాస్త్రీయ, అనైతిక విధానాలను అనుసరిస్తూ వచ్చిందనే వాస్తవాన్ని చాటిచెప్తుంది.
...
నిమ్నకులాలకూ - అగ్రకులాలకూ మధ్య వున్న విభేదాలు నిత్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఒకపక్క చారిత్రకంగా అణగారిన కులాల ఆధ్యాత్మిక, రాజకీయ ఆశలూ, ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. క్రైస్తవ, బౌద్ధ, ఇస్లాం తదితర ఆధ్యాత్మిక ప్రజాస్వామిక మతాల విస్తరణకు అవి  దోహదం చేస్తున్నాయి. మరోపక్క  అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నూతన రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి.

ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక అధికారం కోసం దళితబహుజన కులాలు ముందుకు కదులుతూ యుద్ధభేరీలు మ్రోగిస్తున్నాయి.
....
ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో ఒకటైన హిందూ మతం - తను అనుసరించే విధానాల వల్ల  ఎలా  మరణశయ్యమీదకు చేరుతోందో వివరించే ప్రయత్నమిది. హిందూమత మరణం ప్రపంచ సంస్కృతులను పెద్ద ఎత్తున పునస్సమీకరిస్తుంది. హిందూ మతానంతర భారతదేశం ఎలా వుంటుందో ఊహించి చెప్పడం సాధ్యం కాదు. అయితే,  హిందూ దేహాన్ని చీల్చి (డిసెక్ట్‌ చేసి)  అది స్వయంగా సృష్టించుకున్న కుల కేన్సర్‌ యొక్క ప్రాణాంతక స్వభావాన్ని ఈ పుస్తకం చూపిస్తుంది. ఆ కేన్సర్‌ని ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకునేందుకు అంగీకరించకుండా హిందూమతం తన చావును తనే ఏవిధంగా కోరి తెచ్చుకుంటోందో వివరిస్తుంది.
...
ప్రధానమైన నాలుగు మత ప్రపంచాల్లో మార్పునకు వీలులేని ఆధ్యాత్మిక పునాదిపై ఏర్పడ్డ హిందూ ప్రపంచమే అతి చిన్నదీ, కడు బీదదీ.
హిందూ మత ప్రపంచానికి చెందిన ఆధునిక వ్యాఖ్యాతలందరూ ఇదెంతో గొప్ప మతం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి వాళ్లంతా హిందూమత అపరిపక్వ మనసుకు ప్రతీకలు. ఆదిశంకరాచార్య మొదలుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకూ బ్రాహ్మణీయ వ్యాఖ్యాతలంతా బ్రాహ్మణీయ ప్రాతిపదికతనీ, కుల సంస్కృతినీ కీర్తించారు. ప్రతికూలతే వారికి ధర్మంగా తోచింది. ఈ దేశంలో కులతత్వానికీ, అంటరానితనానికీ హిందూమతమే కారణ మన్న విషయాన్ని వాళ్లసలు పట్టించుకోలేదు.
...
జనాన్ని ప్రభావితం చేసే శక్తిని మిగతా మతాలు కోల్పోవడానికంటే ఎంతో ముందే హిందూ మతం చచ్చిపోతుందని వారు గ్రహించడంలేదు.
ఇవాళ ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విస్తరణకు మరెక్కడాలేనంత జనం కేవలం భారతదేశంలో మాత్రమే అందుబాటులో వున్నారు. జాతీయ జనాభాలో అత్యధిక సంఖ్యలో వున్న దళితబహుజన ప్రజలు క్రమక్రమంగా హిందూ ఆధ్యాత్మిక నిరంకుశత్వానికి దూరంగా వెళ్లిపోతున్న వైనాన్ని హిందూ పండితులు గమనించలేకపోతున్నారు.
...
భారత, నేపాల్‌ దేశాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి మాత్రమే హిందూమత గుర్తింపు వుంది. అయితే, హిందూమతానికి మూలమైన బ్రాహ్మణిజం మాత్రం ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఉనికిలో వుంది.
ప్రాచీన బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక వ్యవస్థకు అల్‌బెరూనీ వంటి ముస్లిం మేధావులు ''హిందూ'' గుర్తింపును ప్రసాదించారు. తన సుప్రసిద్ధ గ్రంథం ''అల్‌  హింద్‌'' లో అల్‌ బెరూనీ తొలిసారిగా 'హిందూ' అన్న పదాన్ని ఉపయోగించాడు. ఆతరువాతే హిందూ పాలకులూ, ఆధ్యాత్మిక శక్తులూ ఆ పదాన్ని ఆమోదించి, సొంతం చేసుకున్నాయి.
క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం మతాల్లో మాదిరిగా హిందూయిజం అన్న మాట మత ప్రవక్త పేరు మీదుగానో లేక ఆధ్యాత్మిక కృషిలోంచో రూపుదిద్దుకున్నది కాదు. క్రైస్తవం, బౌద్ధమతం అన్న పేర్లు ఆ మతాల మూలపురుషులైన జీసస్‌ క్రీస్తు, గౌతమ బుద్ధుడి జీవితాల్లోంచి వచ్చాయి. ఇక ఇస్లాం అన్న మాటకి 'దేవుడి లోకం' అని అర్థం. ముస్లింలను వాళ్ల మూలపురుషుడూ, ప్రవక్తా అయిన మహమ్మదు పేరుమీదుగా 'మహమ్మదీయులు' అని వ్యవహరించడం తెలిసిందే.
కానీ మన బ్రాహ్మణ మేధావులకు తెలివి లేకపోవడం వల్ల ''హిందూయిజం'' అన్న పేరును సైతం పరాయి వాళ్లనుంచి అరువు తెచ్చుకోవలసి వచ్చింది. మధ్య యుగాల నాటి ముస్లిం మేధావులు మనకా పేరు పెట్టారు. వారి దృష్టిలో హిందువులంటే సింధ్‌ (హింద్‌) ప్రాంతంలో నివసించేవారు, ఆదిమ కాలపు అనాగరికులు, ఆధ్యాత్మిక ఐక్యత లేనివాళ్లు. బ్రాహ్మణ, వైశ్య సామాజిక వాణిజ్య శక్తులు కులాలూ, ఆదిమ లక్షణాలూ, మూఢనమ్మకాలూ, అనాగరికతతో కూడిన మతాన్ని రూపొందించాయన్నది ముస్లిం మేధావుల అంచనా. ఈ దృష్ట్యానే వారు ఆ మతానికి ప్రతికూల పద్ధతిలో నామకరణం చేశారు. అదే పేరును సానుకూలమైనదిగా భావించి మన బ్రాహ్మణ మేధావులు నెత్తిన పెట్టుకున్నారు.
...
భారతీయ భాషల సంస్కృత మూలాన్ని ఇంగ్లీషు విచ్ఛిన్నం చేయగలుగుతుంది కాబట్టి ఇంగ్లీషు విద్య విస్తరించడానికీ, క్రైస్తవ మత ప్రచారానికీ మధ్య సన్నిహిత సంబంధం వుంటుంది. దళితబహుజనులలో ఇంగ్లీషు విద్యను నేర్చుకునే ధోరణి కొనసాగుతోంది. బ్రాహ్మణ హిందువులకు ఇంగ్లీషు విద్యను అడ్డుకునే శక్తి లేదు. ఎందుకంటే స్వయంగా వాళ్లే ఇంగ్లీషులో మునిగి తేలుతున్నారు.
...
బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఎలా సయోధ్యను సాధించాయో గ్రహించడం చాలా ముఖ్యం. తొలి శాస్త్రీయ ఆవిష్కరణలు బౌద్ధ ప్రపంచంలో చైనా, జపాన్‌ దేశాల్లో చోటు చేసుకున్నాయి. దిక్సూచి, గన్‌పౌడర్‌ (తుపాకి మందు), కాగితం, ముద్రణా యంత్రాలను కనుగొన్నది చైనా బౌద్ధులే. అదేవిధంగా జపాన్‌ బౌద్ధులు కూడా ప్రాచీన కాలం నుంచీ అనేక చిన్న సాంకేతిక పరికరాలను కనుగొంటూ వచ్చారు.
తొలినాళ్ల క్రైస్తవం సామూహిక చర్చి వ్యవస్థకు ఇంకా రూపురేఖలను తీర్చిదిద్దుకుంటున్న నాటికే బౌద్ధమతం విశ్వాసానికీ సైన్సుకూ మధ్య సయోధ్యను సాధించింది. బౌద్ధ మత ఆధ్యాత్మిక దృక్పథంలోని విధివాద వ్యతిరేక  భావజాలం, హేతువాదంల మూలంగానే చైనా, జపాన్‌ దేశస్థులు సైన్సుకీ నమ్మకానికీ మధ్య సయోధ్యను సాధించగలిగారు.
రోమన్‌ క్యాథలిక్‌ చర్చి వ్యవస్థ ఏర్పడిన తరువాత కారణానికీ (రీజన్‌), విశ్వాసానికీ (ఫెయిత్‌) మధ్య శత్రుపూరిత ధర్మబోధనా విధానాన్ని అనుసరించింది. అది శాస్త్రీయ పరిశోధనలకూ, సాంకేతిక ఆవిష్కరణలకూ కొత్త పరిస్థితులను సృష్టించింది. తొలినాళ్లలో కోపెర్నికస్‌, గెలీలియో వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలను చర్చి  ఆమోదించలేదు. అంతేకాదు వాళ్లను అణిచివేయాలని కూడా చూసింది. ఆ తరువాత క్రమక్రమంగా శాస్త్రీయ ఆలోచన మీద తన పట్టును సడలించుకుంటూ వచ్చింది. తత్ఫలితంగానే న్యూటోనిక్‌ విప్లవం రూపుదిద్దుకోగలిగింది. భూమి బల్లపరుపుగా వుందన్న క్రైస్తవ విశ్వాసం అట్లా వుండగానే సైన్స్‌ చెప్పిన భూమి గుండ్రంగా వుందనే, భూమికి ఆకర్షణ శక్తి వుందనే సిద్ధాంతాలకు అనుగుణంగా తన విశ్వాసాన్ని సవరించుకుంది.
...
క్రైస్తవ ప్రపంచం విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతంతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాల్లో కూడా గొప్ప మేధావులను సృష్టించింది. మాచియావెల్లీ నుంచి కారల్‌ మార్క్స్‌ వరకూ క్రైస్తవ ప్రపంచం నుంచి వచ్చిన మేధావులు చర్చినే సవాలు చేశారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం చర్చి కంటే గొప్పదని నిరూపించారు.
...
ఒకపక్క మడీ-మైల అనే సిద్ధాంతాన్ని కఠోరంగా పాటించిన కారణంగా బాల్య వివాహాలూ, సతీ సహగమనాలూ పుట్టుకురాగా, మరోపక్క హిందూ దేవుళ్ల విశృంఖల శృంగారం పౌర జీవితం మీద నైతికంగా తీవ్రమైన ప్రభావం చూపింది. కామసూత్ర విన్యాసాలను హిందూ దేవాలయాలమీద శిల్పాలుగా చెక్కి స్త్రీలపై సాగించే సకల వేధింపులకు ఆధ్యాత్మిక ఆమోదాన్ని కల్పించారు.
ఇంకోపక్క అదే మతం బ్రాహ్మణ జీవితం అతి పవిత్రమైనదనీ, బ్రహ్మచర్యం పూజ్యనీయమైనదనీ ప్రబోధాలు చేసింది.
ఇలాంటి సాంస్కృతిక వాతావరణంలో చాలామంది జనానికి ఏ పైశాచిక లైంగిక సంబంధాలూ, ఏ చెడు నైతిక సూత్రాలూ లేని ఇస్లాం మతమే విముక్తిని ప్రసాదించగలదనిపించింది.
అందుకే కులం, అంటరానితనం, నయవంచనలతో కూడిన హిందూమతంలోని లక్షలాది దళితబహుజనులు ఇస్లాం మతంలోకి మారారు.
ఐరోపాలో సైతం ఇస్లాం ప్రబోధించిన నూతన వివాహ నీతి నియమాలూ, ఇస్లామిక్‌ ఆధ్యాత్మికతతో వాటి సంబంధం క్రైస్తవమత పరిధిలో సంక్షోభాన్ని సృష్టించింది. మార్టిన్‌ లూథర్‌ వయసు మళ్లిన తరువాత తన సుదీర్ఘ బ్రహ్మచర్య జీవితానికి స్వస్తిచెప్పి పెళ్లి చేసుకోవడం... ''నేనూ రక్త మాంసాలున్న మనిషినే, నాకూ లైంగిక వాంఛలుంటాయి (నేనేం రాయీరప్పను కాను)'' అని బాహాటంగా ప్రకటించడం క్రైస్తవ లైంగిక నీతి పునరాలోచనలో పడేట్టుచేసింది.
...
హిందూ ఆధ్యాత్మిక ప్రపంచం తన ప్రజానీకాన్ని మూఢనమ్మకాల ఉక్కు పిడికిలిలో బంధించింది. ఋగ్వేదం మొదలుకుని రామాయణం (దళితబహుజనులను అణగదొక్కే పథకంలో భాగంగా వెలువడిన చిట్ట చివరి గ్రంథం) వరకూ, భగవద్గీతతో సహా ఏ గ్రంథమూ కులాలనీ, మూఢనమ్మకాలనీ నిర్మూలించే సృజనాత్మక ఆలోచనలకు ఏమాత్రం అవకాశాన్నివ్వలేదు. వాటిని నిర్మూలించలేకపోయినా కనీసం ఒక శాస్త్రీయ భారతదేశం ఆవిర్భవించేందుకు అనువైన మార్గాన్ని కూడా ఏర్పరచలేదు. ఈనాడు భారతదేశం వినియోగించుకుంటున్న విజ్ఞాన శాస్త్రమంతా మిగతా మూడు ప్రపంచాలనుంచి, అందులోనూ మరీ ఎక్కువగా క్రైస్తవ ప్రపంచం నుంచి అరువు తెచ్చుకున్నదే.
...
హిందూ మతం ఉత్పత్తిని కాలుష్యం (మైల) గా, ఉత్పత్తి ప్రక్రియలో పాలుపంచుకునే వాళ్లని అంటరానివాళ్లుగా పరిగణించడంతో వారిలోని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, చొరవా దెబ్బతిన్నాయి.
ఇక రెండో అంశం చదవడం, రాయడం అనేవి కేవలం ద్విజులు  మాత్రమే చేయాల్సిన పనులుగా నిర్దేశించింది. దానివల్ల ఉత్పత్తి వర్గానికి చదువు సంధ్యలు లేకుండా పోయాయి.
విద్య నేర్చుకోవడం, గ్రంథాలు చదవడం, రాయడం కొందరికే పరిమితమవడం వల్ల హిందూ సమాజంలో విజ్ఞానం వికసించేందుకు, విజ్ఞానాన్ని ఇతర్లతో కలిసి పంచుకునేందుకు వీలులేకుండాపోయింది. తత్ఫలితంగా భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర ఎదుగుదలకు అవకాశాలను చిదిమేసినట్టయింది. ఇది ఏవిధంగా జరిగిందో ఒక్కో కులం అనుభవాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ పుస్తకం వివరిస్తుంది.
...
సైన్సును ఎదగనివ్వకుండా కుల అడ్డుగోడలు నిర్మించబడటానికి సైన్సు వ్యతిరేక హిందూ మతానిదే ప్రధాన బాధ్యత. తన మతధర్మశాస్త్రాన్ని అది సరైన రీతిలో ఏనాడూ  సమీక్షించుకోకపోవడం వల్లనే మానవ ఆచరణను, లిఖిత గ్రంథాలను విశ్లేషించే జ్ఞాన వ్యవస్థను నిర్మించలేదు. ఏమాత్రం ప్రతిస్పందనలకు వీలులేకుండా ఆధ్యాత్మిక గ్రంథాలను  వల్లెవేసే, చదివే (బట్టీపట్టే) పద్ధతిని అది అనుసరించింది. నైతిక విలువలతో కూడిన ఒక్క ఆధ్యాత్మిక గ్రంథాన్ని అయినా అది అభివృద్ధిపరచలేదు. హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ యుద్ధం గురించీ, శృంగారం గురించీ రాసినవే. హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణించిన యుద్ధాలలో అత్యధికం దురాక్రమణదారులు మూలవాసుల మీద చేసిన యుద్ధాలు (అన్నీ వైదిక యుద్ధాలు) లేదంటే అంతర్గత అంతర్యుద్ధాలు (రామాయణ, మహాభారతాలు).
కాకపోతే కొన్ని గ్రంథాలు మాత్రం హిందూ దేవతల, కథానాయకుల శృంగార ప్రయోగాల మీద రాయబడ్డాయి. అ లాంటి వాటిలో వాత్సాయన కామసూత్రం తొలి బృహగ్రంథం. దురదృష్టవశాత్తూ ప్రపంచ పుస్తకాల మార్కెట్‌లో భారతదేశానికి ఈ పుస్తకమే ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇది హిందూమత బలహీనతను చాటుతోంది తప్ప బలాన్ని కాదు.
...
భారతదేశంలోని దళితబహుజనులు అన్ని జీవనరంగాలలో క్రియాశీలక పాత్రను పోషించేలా చేయడానికి ఈ పుస్తకం ఉద్దేశించబడింది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం - ఆధ్యాత్మిక నియంతృత్వం ఎంత పరస్పర విరుద్ధమైన వ్యవస్థలో చూపడం, అవి మన జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయో నిర్వచించేందుకు కూడా ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది
...

హిందూ మతానంతర భారతదేశం
సామాజిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ రంగాల్లో దళిత బహుజన విప్లవం
రచన : కంచ ఐలయ్య


ఆంగ్ల మూలం : Post Hindu India
తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార
391 పేజీలు, వెల: రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
ఎమెస్కో బుక్స్‌,
1-2-7, బానూ కాలనీ, గగన్‌ మహల్‌ రోడ్‌, దోమల్‌గూడ,
హైదరాబాద్‌ - 500 029
ఫోన్‌/ఫాక్స్‌: 040-23264028
E Mail :  emescobooks@yahoo.com


పంపిణీదారులు:
సాహితీ ప్రచురణలు
29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యాపేట, విజయవాడ-2
ఫోన్‌: 0866-2436643, 0866-6460633
E Mail : sahithi.vja@gmail.com

Sunday, January 1, 2012

తెలుగు బ్లాగర్ల రచనలకు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' నీరాజనం!


ఈ కొత్త సంవత్సరం తెలుగు బ్లాగులు మరింత ఉజ్వలంగా వెలిగిపోనున్నాయా? 


ఆరోగ్యకరమైన చర్చలతో, ఆలోచింపజేసే రచనలతో, జీవితానుభవాలనూ వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచే పోస్టులతో మరింత విస్తృతంగా నెటిజనులను ఆకర్షించనున్నాయా?


అవుననే అనిపిస్తోంది ఇవాళ్టి (1-1-12) ఆదివారం ఆంధ్రజ్యోతిని చూస్తుంటే!


మొత్తం సంచికను తెలుగు బ్లాగర్ల రచనలకు అంకితం చేయడం నిజంగా అద్భుతమనిపించింది. 
నూతన సంవత్సరం తొలి ఉదయమే మహదానందం కలిగించింది.


ఇందులో పొందుపరచిన బ్లాగర్ల రచనలు, బ్లాగుల వివరాలు ఇలా వున్నాయి:


1. లుంగి - వీజె : golisoda.in
2. పందిరాజము - అనిల్‌.ఎస్‌.రాయల్‌ : anilroyal.wordpress.com
3. మగపిల్లాడు పిల్లమగాడు - డి.ఎస్‌.గౌతమ్‌ : thotaramudu.blogspot.com
4. డెమ్మ డెక్కడాలి - యర్రపు రామనాధరెడ్డి : yarnar.blogspot.com
5. అసూబా'ల ఆహార్యం - వై.ఎ.రమణ : yaramana.blogspot.com
6. వెజిటెబుల్‌ సలాడ్‌ - పద్మార్పిత : padma4245.blogspot.com
7. చిన్న గీత - సుస్మిత : kothavakaya.blogspot.com
8. పాడమని నన్నడగవలెనా - నేస్తం : jaajipoolu.blogspot.com
9. నాకు ప్రేమించి పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? - బులుసు సుబ్రహ్మణ్యం : bulususubrahmanyam.blogspot.com
10. సుత్తి! సుతిమెత్తగా!! - లలిత : naaspandhana.blogspot.com
11. ఐ యామ్‌ ఓకె, యు ఆర్‌ నాట్‌ ఓకె - కృష్ణప్రియ : krishna-diary.blogspot.com
12. చుక్కల మొక్కు - మధురవాణి : madhuravani.blogspot.com


పై బ్లాగర్లకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !


తప్పక చదవండి ఆదివారం ఆంద్ర జ్యోతి
 http://www.andhrajyothyweekly.com/ 




..

నూతన సంవత్సర శుభాకాంక్షలు



గతం అనే గొంగళి పురుగులోంచి 

    ఆవిర్భవించింది వర్తమాన సీతాకోక చిలుక 

    అది ఆస్వాదించేందుకు ఈ  సువిశాల  ప్రపంచంలో 

    ఎన్నెన్ని అందమైన పుష్పాలో ...

   మీ అందరికీ ఆనందమయమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ...




.