Thursday, September 26, 2019

1970 లలో దేశంలో పెను తుఫాన్‌ను సృష్టించిన దళిత్ పాంథర్స్







(హైదరాబాద్ బుక్ ట్రస్ట్ త్వరలో తెలుగులో వెలువరిస్తున్న" దళిత్ పాంథర్స్ " పుస్తకం నుంచి రచయిత, దళిత్ పాంథర్ వ్యవస్తాపకులలో ఒకరైన జే.వీ.పవార్ ముందుమాట : )

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్‌ ఉద్యమమే. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఆవిర్భవించింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న సంస్థను రద్దు చేస్తున్నట్టు ముంబయిలో చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్‌ పాంథర్‌ సంస్థ అంతరించిపోయింది.
నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలే, జె.వి. పవార్‌లను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దసాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది. ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.
ఈ కాలంలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమం దేశంలో ఒక పెను తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక ఊపు ఊపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధ సైనికుల మాదిరిగా వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించగల వీరులుగా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది. దళిత్‌ పాంథర్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి, అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలాచేయడం కూడా.
దళిత్‌ పాంథర్‌ ఉద్యమం 1974 జనవరి 4 వరకూ ఎంతో ఉధృతంగా సాగింది. ఆతరువాత 1974 జనవరి 5న ముంబయిలో ముఖ్యంగా వోర్లీ, నయీగావ్‌ ప్రాంతాల్లో ఉద్యమంపై ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున దాడిజరిగింది. ఆ దాడిలో దళిత్‌ పాంథర్లు భగవత్‌ జాదవ్‌, రమేష్‌ డియెరుక్కర్‌లు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది దళిత యువకుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. అయితే వారి త్యాగాలు అంబేడ్కరిస్ట్‌ ఉద్యమానికి ఒక కొత్త శక్తిని సమకూర్చాయనే చెప్పాలి.
కొన్ని పదవులు, కొద్దిపాటి డబ్బు కోసం ఉద్యమాన్ని సంపన్నుల పాదాలవద్ద తాకట్టు పెట్టిన పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమైనది. దళిత్‌ పాంథర్‌ కొనసాగింది కొద్దికాలమే అయినా అది భారత సమాజంమీదా, రాజకీయాల మీదా బలమైన ముద్ర వేసింది. ఈ చారిత్రాత్మకమైన ఉద్యమ ప్రభావం ఎంతటిదంటే 2006లో మహారాష్ట్ర భండారా జిల్లా ఖైర్లాంజిలో ఒక దళిత కుటుంబంలో నలుగురిని (ఒక మహిళ, ఆమె యుక్తవయసు కూతురుతో సహా) అత్యంత దారుణంగా హత్యచేసినప్పుడు- కులపరమైన దాడులకు పాల్పడేవారిని నిర్మూలిందుకు మళ్లీ దళిత్‌ పాంథర్‌ వంటి మిలిటెంట్‌ సంస్థ కావాలి అన్న డిమాండ్‌ తిరిగి బలంగా వినిపించింది.
ఈ ఉద్యమంపై ఇప్పటికే పలు పరిశోధనాపత్రాలు, సంకలనాలతో సహా అనేక రచనలు వెలువడ్డాయి.
వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను, ఉద్యమకారులతో జరిపిన సంభాషణలను ఆధారంగా చేసుకుని దళిత్‌ పాంథర్‌పై ఆ పరిశోధనా పత్రాలను, వ్యాస సంకలనాలను తయారుచేశారు. చాలామంది తమ సైద్ధాంతిక ఆలోచనలకు అనుగుణంగా, తమకు నచ్చిన రీతిలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమాన్ని విశ్లేషించారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చరిత్రను వక్రీకరిస్తూ, గాలివాటంగా చేసినవే ఎక్కువ. మరికొందరు ప్రచారం కోసం, తాత్కాలిక లబ్దికోసం ఉద్యమకారులమనే ముసుగుతో, ఉద్యమ పితామహులమని చెప్పుకుంటూ రచనలు చేశారు. ఉద్యమాన్ని మొట్టమొదటి రోజునుంచీ పరిశీలించిన ప్రత్యక్ష సాక్షిని నేను. కేవలం ప్రేక్షకుడిగానో, రచయితగానో కాకుండా ఈ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకడిగా, చురుకైన ఉద్యమకారుడిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాను. దళిత్‌ పాంథర్‌ సంస్థకు నామ్‌దేవ్‌ దసాల్‌, నేనూ వ్యవస్థాపకులం. అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలకమైన వ్యక్తి రాజా దాలే.
కాబట్టి, దళిత్‌ పాంథర్‌ ఉద్యమ చరిత్రను రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌ (నేను) మాత్రమే సరిగా లిఖించేందుకు అర్హులమని భావిస్తాను. నేను మొదట దళిత్‌ పాంథర్‌ నిర్వాహకుడిగా, ఆతరువాత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తత్ఫలితంగా సంస్థకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు, దస్తావేజులు అన్నీ నావద్ద భద్రంగా వున్నాయి. ఆరోజుల్లో ఫొటో కాపీయింగ్‌ యంత్రాలు అందుబాటులో వుండేవి కావు. అందువల్ల ఉత్తరాలను, ప్రకటనలను రాసేటప్పుడు కార్బన్‌ పేపర్లను ఉపయోగించి ప్రతులను తయారు చేసేవాళ్లం. అలాంటి వాటన్నింటినీ నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలన్నింటికీ నావద్ద సాక్ష్యాధారాలు వున్నాయనీ, ఇవన్నీ సాధికారికమైనవనీ స్పష్టం చేసేందుకే నేనీ మాట చెబుతున్నాను. వీటికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ప్రాచీన పత్ర భాండాగారాన్నీ, పోలీసు ఇంటలిజెన్సు విభాగాల దస్తావేజులను అన్నింటినీ పరిశీలించేందుకు అనుమతినిచ్చారు. అందువల్ల నా ఈ రచనకు మరింత సాధికారికత చేకూరింది.
'డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ అనంతరం అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం' అనే అంశంపై నేను మరాఠీలో అనేక వ్యాసాలు రాశాను. అదే క్రమంలో వెలువడుతున్న నాలుగవ పుస్తకం ఇది. దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలం ఎంతో మహత్తరమైనది. రాజా దాలే, నామ్‌దేవ్‌ దసాల్‌లతో సహా అనేకమంది మేధావులు ఇప్పటికే ఈ ఉద్యమంపై పలు రచనలు చేశారు.
దళిత్‌ పాంథర్‌ ఉద్యమ కాలంలో మరాఠీ వార్తా పత్రిక 'నవకాల్‌' సంపాదకుడు నీలూభావ్‌ ఖాదిల్కర్‌ తన పత్రికను ఈ ఉద్యమవార్తలకు వేదికగా చేశారు. నవకాల్‌ దళిత్‌ పాంథర్ల అధికార పత్రికేమో అన్నట్టుగా వుండేది. దీనితోపాటు నవశక్తి, మరాఠా, మహారాష్ట్ర టైమ్స్‌, లోక్‌సత్తా, సకాల్‌ వంటి మరికొన్ని ఇతర పత్రికలు కూడా దళిత్‌ పాంథర్‌ వార్తలను ప్రచురిస్తూ ఉద్యమానికి ఎంతో అండగా నిలిచాయి. వారందరికీ ఈసందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
అంబేడ్కర్‌ జీవించివున్న కాలంలో నేను కార్యకర్తగా గానీ, రచయితగా గానీ లేను. అంబేడ్కర్‌ సంపాదకత్వం వహించిన 'మూక్‌ నాయక్‌', 'ప్రబుద్ధ భారత్‌' వంటి పత్రికలకు అనేకమంది తమ రచనలను అందించేవారు. అయితే వాళ్లంతా ఆకాలపు వార్తలను నమోదు చేసిన వాళ్లు మాత్రమే. వారిలో సి.బి.ఖైర్మోడ్‌ రచనా విధానం ఎంతో అమూల్యమైనది. నేను ఈ పుస్తకంలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమాన్ని కేవలం నమోదు చేయాలనికాకుండా విశ్లేషించాలని భావిస్తున్నాను. ఈ ఉద్యమంలో నేను స్వయంగా పాలుపంచుకున్నాను. ఏదో మూలన కుర్చుని ఉద్యమాన్ని చూసిన మౌన ప్రేక్షకుడిని కాదు నేను. అందువల్ల ఉద్యమ చరిత్రను నా రచన సమగ్రంగా విశ్లేషిస్తుంది. నేను 1972 నుంచి ఉద్యమ అగ్రభాగాన నిలవడమే కాకుండా అంతకుముందు 1964లో సుప్రసిద్ధ భూపోరాట ఉద్యమాన్ని నడిపిన దాదాసాహెబ్‌ గైక్వాడ్‌ విద్యార్థి విభాగానికి కూడా నేను నాయకత్వం వహించివున్నాను.
నేనూ, నా కవిమిత్రుడు నామ్‌దేవ్‌ దసాల్‌ కలిసి 1972లో దళిత్‌ పాంథర్‌ని నెలకొల్పాం. అది స్వల్ప కాలమే జీవించివున్నప్పటికీ అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం మాదిరిగా అంబేడ్కర్‌ మరణానంతర ఉద్యమాలన్నింటికీ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.
నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.
రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఆ నాయకులు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది.
గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.
దీనినిబట్టి దళిత్‌ పాంథర్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ దృష్టితోనే ఈ రచనను ముందుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీసుకరావడం జరిగింది. నేను దళిత్‌ పాంథర్‌ చరిత్రను 'దళిత్‌ పాంథర్స్‌' అన్న పేరుతో 2010 డిసెంబర్‌ 6 న మరాఠీలో వెలువరించాను. మరాఠీ పాఠకులు, కార్యకర్తలు దానిని విశేషంగా ఆదరించారు.
దళిత్‌ పాంథర్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రపంచం నలుమూలలనుంచీ పరిశోధకులు, విద్యార్థులు తరచూ అడుగుతుంటారు. అందువల్లే ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీషు భాషల్లో వస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నాకు అనిపించింది. అమెరికా బ్లాక్‌ పాంథర్స్‌కు చెందిన ఉద్యమకారిణి ఏంజెలా డేవిస్‌ 2016 డిసెంబర్‌ 16న భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికాలో పోరాడుతున్న ఆఫ్రికన్‌-అమెరికన్‌ సోదరీ సోదరుల ప్రయోజనం కోసం ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ పుస్తకాన్ని మరాఠీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించిన నా సీనియర్‌ సహోద్యోగి రక్షిత్‌ సోనేవాడీకి నేను ఎంతగానో రుణపడివుంటాను. ....
...... - జే.వీ.పవార్