Saturday, November 16, 2019

ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు చాడ వెంకట రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి


ప్రజా రవాణా రక్షకులే ప్రజా పాలకులు
చాడ వెంకట రెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
(ఆంధ్ర జ్యోతి దినపత్రిక 16-11-2019)

---------------------------
వేల మంది ఆర్‌టిసి కార్మికులుతమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారుస్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారుఎందుకు... అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం.ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్నప్రజారవాణాకు సంబంధించింది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె గత 42 రోజులుగా కొనసాగుతోంది. ఈ సమ్మె ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించినది. మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు రాష్ట్ర వ్యాపితంగా రోజుకు 97 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసే విశ్వసనీయ సంస్థ ఆర్‌టిసి.
తెలంగాణలో తొమ్మిది దశాబ్దాలుగా సామాన్యునికి సేవలు అందిస్తున్న ఘన చరిత్ర కలిగిన ప్రజాసేవా సంస్థ ఆర్‌టిసి. తెలంగాణ కోసం ఉద్యమించడంలో ఆర్‌టిసి కార్మికులది కూడా కీలక పాత్రే.
అలాంటిది స్వరాష్ట్రంలో సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక రోజులు సమ్మె చేయాల్సి రావడం దురదృష్టకరం. కార్మికుల కంటే ప్రభుత్వానికే ఆర్‌టిసి సమ్మె జరగాలనే వైఖరి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆర్‌టిసిని పరిరక్షించేందుకు ఉన్న అవకాశాలను కాదని మూసి వేసేందుకు లేని మార్గాలను కూడా ప్రభుత్వం వెతికి వెతికి భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తోంది. సమ్మెను పరిష్కరించే దిశగా అడుగులేయడం లేదు.
ఆర్‌టిసి సమ్మె పట్ల ముఖ్యమంత్రి కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. సమ్మె ప్రారంభంలోనే కేసీఆర్‌ కఠినమైన మాటలు మాట్లాడారు. ఒక్క మాటతోనే 48 వేల మంది కార్మికులను ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్‌అని భయబ్రాంతులకు గురి చేశాడు.
అంతేగాకుండా మరో సందర్భంలో యూనియన్‌లో చేరబోమని రాతపూర్వకంగా హామీ లేఖలు ఇస్తే మీ ఉద్యోగాలు మీకు ఉంటాయని చెప్పడం జరిగింది.
మరొకసారి అసలు ఆర్‌టిసి సంస్థ అనేదే లేదన్నారు. అ తదుపరి నవంబర్‌ 2న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి నవంబర్‌ 5వ తేదీ అర్థరాత్రి లోపు కార్మికులు తమతమ విధుల్లో చేరాలని డెడ్‌లైన్‌ విధిస్తేకేవలం 300 మంది కార్మికులు మాత్రమే చేరారు. అందులో ఎక్కువ మంది బస్‌ భవన్‌లో ఉద్యోగం చేసేవారు.
దాదాపు 5100 రూట్లను ప్రైవేట్‌ పరం చేసామని ప్రకటించారురు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండాచర్చలకు ఆహ్వానించకుండా ఇలాంటి నిర్ణయాలు చేయడం మూర్ఖపు ధోరణికి అద్దం పడుతుంది.
దాదాపు 14 సార్లు ఆర్‌టిసి సమ్మెపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి కొండను తవ్వి ఎలుకను కూడ పట్ట లేకపోయారు.
కేసీఆర్‌ సెల్ఫ్ డిస్మిస్‌అనే పదం ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేయాల్సి వస్తుందనే సామెతను గుర్తు చేసుకోవాల్సివస్తుంది.
తప్పును సవరించుకోవడం మానవ ధర్మం. కానీ అహంభావంతో తప్పుల మీద తప్పులు చేస్తుండటం సరైంది కాదు. రాజ్యాంగం పౌరహక్కులు అందరికీ సమానంగానే ప్రసాదించింది. కాకపోతే పదవిలో వున్న వారికి ఆ పదవికి ఉన్న ప్రతిష్ఠ కారణంగా వ్యక్తిగత గౌరవం ఉండటం సహజం. కొన్ని సందర్భాలలో త్యాగాలను బట్టి కూడా వ్యక్తులకు గౌరవం వుంటుంది. కానీ కేసిఆర్‌ ఇప్పుడు ఏ కోవకు వస్తాడనేది ప్రధాన ప్రశ్న.
ఇబ్బందులు లేని జీవితమైనప్పటికీ సంస్థఅందులో పని చేసే వేలాది మంది కార్మికుల భవితవ్యంప్రభుత్వ వితండవాదంతో కలత చెంది డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి నిప్పు పెట్టుకొని చనిపోయాడు.
అలాగే రాణిగంజ్‌ డిపోకు చెందిన సురేందర్‌ గౌడ్‌ ఉరి వేసుకొని మృతి చెందాడు.
నీరజ అనే కండక్టర్‌ కూడా ఉరి వేసుకొని చనిపోయింది.
అంతేగాకుండా నిరసన సభలుసమావేశాలలో పాల్గొన్న కార్మికులు ఉద్రేకానికి లోనై గుండె ఆగిచని పోయినవారు కూడా అనేక మంది వున్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఆత్మహత్యలు వుండవని తెలంగాణ సమాజం అనుకున్న తరుణంలో ఇప్పుడు ఇంత మంది కార్మికుల చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంటి అద్దెలు కట్టుకోకుండాపిల్లల ఫీజులు సకాలంలో చెల్లించకపోవడం వలన కార్మికుల కుటుంబాలు అల్లాడుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా కనికరం చూపాలి.
హైకోర్టులో ఆర్‌టిసి సమ్మెపై జరుగుతున్న విచారణను చూస్తుంటే తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమా అని ఈ దౌర్భాగ్యం వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నడూ లేనివిధంగా నలుగురు సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లు స్వయంగా వారి తప్పులేకున్నా పాలకుల వైఖరి కారణంగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అంతేగాకుండా ప్రధాన న్యాయమూర్తి , న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అధికారులు సమాధానం చెప్పలేక తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది. న్యాయస్థానంలో కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండా క్షమించండి అని చెప్పడంతో ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన నివేదికకు హైకోర్టులో ఆర్థిక కార్యదర్శి ఆర్‌టిసి ఇన్‌చార్జ్‌ ఎండీలు కోర్టు ఇచ్చిన అఫిడవిట్లకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఐఎఎస్‌ ఆఫీసర్లు కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారని ప్రధాన న్యాయమూర్తి మందలించడంతోపాటు ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించారు.
ఫిలిప్పీన్స్‌ దేశంలో ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వం పడిపోయిందని తెలంగాణలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా అని కోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను తక్కువ అంచనా వేసి కించపరుస్తున్నాడు.
ఆర్‌టిసి సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ వాహనాలే శరణ్యంగా మారాయి. డైలీ వేజ్‌ డ్రైవర్లు కండక్టర్లతో బస్సులు నడుస్తున్నా సమయ పాలన పాటించడం లేదు. ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది వివిధ ప్రాంతాలలో ఆర్‌టిసి బస్సులు ఢీ కొట్టడంతో మరణించడం జరిగింది.
సమ్మె కాలంలో ఎంత ఆదాయం ఆర్‌టిసిఇకి వచ్చింది ఎంత ఖర్చు చేశారో ఆర్‌టిసి యాజమాన్యం గానీ లేదా ప్రభుత్వం గానీ ప్రజలకు తెలియజేయాలి.
49 వేల మంది ఆర్‌టిసి కార్మికులు తమ కుటుంబాలను పణంగా పెట్టి ఎందుకు సమ్మె చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు బెదిరింపులకు దిగినా మొక్కవోని ధైర్యంతో ఎందుకు సమ్మె సాగిస్తున్నారు.. ఎందుకు అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం. ఇది కేవలం వారి ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ప్రశ్నార్థకంగా మారనున్న ప్రజారవాణా గురించి.
ఇప్పటికే ప్రభుత్వ వైఖరితో సమ్మె కొనసాగుతూండడంతో 24 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు మతిస్థిమితం కూడా కోల్పోతున్నారు.
కార్మికులు డ్యూటీ చేసిన సెప్టెంబర్‌ నెల జీతాలు రెండు నెలలు గడిచినాకోర్టు ఆదేశించినా ఇవ్వకుండా ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది.
ముఖ్యమంత్రిగా వున్నవారు ఒక తండ్రిలా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఒకవైపు వారూ నా బిడ్డలేనంటూమరోవైపు చర్చలకు ముందుకు రాకపోవడం తొడపాశం పెట్టి జోల పాట పాడినట్లుంది. ఆర్‌టిసి వాళ్ళు తెలంగాణ బిడ్డలైనప్పుడు తెలంగాణలో పెద్ద పండుగైన దసరాదీపావళికి చేసిన పనికి కూడా జీతాలివ్వకుండా ఉపవాసం ఉంచుతారా
బాధ్యతాయుత స్థానంలో ఉన్న క్యాబినెట్‌ మంత్రులు కూడా ఆర్‌టిసి సమ్మె విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ పాలన మంత్రుల సమిష్టి బాధ్యత కాదా ముఖ్యమంత్రిని కనీసం కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేయకపోతే జరుగుతున్న తప్పు వారిని భవిష్యత్తులో వెంటాడుతుంది.
సంపద ఉన్న రాష్ట్రం కాబట్టి అప్పులు వస్తున్నాయని పలుమార్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆర్‌టిసికి ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులు ఏ మాత్రం ఎక్కువ కాదు.
పైగా సంస్థ లాభాల్లోకి వచ్చేందుకు ఏమి చేయాలనే సూచనలు ఇవ్వడంతో పాటు మోటు కష్టం చేసేందుకు ఆర్‌టిసి కార్మికులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు ఆర్‌టిసి కార్మికులు కాకితో కబురంపినా చర్చలకు సిద్ధమని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ఆలోచించి పట్టుదలకు పోకుండా తక్షణమే కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమ్మె విరమింపజేయాలి. భేషజాలకు పోతే నష్టపోయేది తెలంగాణ బిడ్డలే. ఆర్‌టిసి మూతపడితే ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలే.
చాడ వెంకటరెడ్డి
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Thursday, November 14, 2019

ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు – టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)


ఆలోకన :
ఆర్టీసీ సమ్మెపై కొన్ని ప్రశ్నలు –
టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ పత్రిక 14 11 2019)
------------------------------------
ఆర్టీసీ సమ్మెలో సామాన్యులకు అర్థం కాకుండా మిగిలిన ప్రశ్నలు కొన్నున్నాయి. ఉదాహరణకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటం. విలీనమే ప్రధానమని, అది జరుగనిదే మరి దేనికీ ఒప్పుకోబోమన్న యూనియన్లు అదే పట్టుదలతో ఉన్నాయి.
విలీనం వల్ల పడే ఆర్థికభారాన్ని మోయలేమని ప్రభుత్వం అంటున్నది. కొద్దిపాటి అవగాహన గలవారు, ఇతరత్రా కార్మికులపై సానుభూతి గలవారు కూడా విలీనం డిమాండ్ సరైనది కాదంటున్నారు.
హైకోర్టుసైతం సమస్య పరిష్కారానికి ఈ డిమాండు ప్రతిష్టంభనగా మారేట్లున్నదని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ యూనియన్లకు ఈ పట్టుదల దేనికన్నది ప్రశ్న.
విలీనం వల్ల రాగల ఆర్థిక సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు వివరించారు. ఆర్టీసీ సిబ్బంది సుమా రు 50 వేల మంది. అంతమందికి ప్రభుత్వ సిబ్బందితో సమానంగా జీతభత్యాలు, ఇతర సదుపాయాలు, ఉద్యోగ విరమణాంతరం జీవితాంతం పింఛన్లు, ఇతర సదుపాయాలు అంటే మామూలు విషయం కాదు.
ఇవి అన్నీ తమకు కావాలని ఆర్టీసీ సిబ్బంది తమ దృక్కోణం నుంచి కోరుకోవచ్చు. ఇటువంటి ప్రయోజనాలు వారికి గొప్ప ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే యూనియన్ నాయకులు, ప్రతిపక్షాలు ఈ విషయమై చెప్పిన డిమాండ్లు సిబ్బంది మనసులో తేలికగా, బాగా నాటుకుపోయాయి.
కానీ కోరికలు ఎంత ఆకర్షణీయమైనవి అయినా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఆ పని చేయనప్పు డు విషయం ప్రతిష్టంభనకు గురికావటం, దీర్ఘకాలం పాటు సాగటం, చివరికి ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది.
విలీనాన్ని అంగీకరించకపోవటానికి ముఖ్యమంత్రి రెండు కారణాలు చెప్పారు. ఒకటి, అందువల్ల పడే రకరకాల ఆర్థిక భారాలు. రెండు, ఇతర కార్పోరేషన్లు కూడా విలీనాన్ని కోరే అవకాశం. అప్పుడు పడగల భారం తో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిజంగానే కుప్పగూలేంత పనవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ప్రస్తుతం మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారికి రేపోమాపో వేతన సవరణ జరుగుతుంది. ఇటువంటి స్థితిలో కార్పొరేష న్ల విలీనంతో మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలు అయితే పరిస్థితి ఏమిటి?
ఇదిగాక, వేలాది ఖాళీల భర్తీలు, కొన్నిరకాల ఉద్యోగాల్లో అదనపు నియామకాలు క్రమక్రమంగా చేపడుతున్నారు. దీనంతటి మధ్య రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఒకేమారు 50 వేల మంది విలీనాన్ని మోయగలదా? ఒకవేళ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నా ఆచరణాత్మకంగా సాధ్యమయేదేనా?
ఇప్పటికే 67 శాతం వేతనాలు పెంచిన స్థితిలో?
ఇదంతా సామాన్య ఆర్టీసీ సిబ్బందికి తెలియకపోవచ్చు. వారు తమకు కలిగే ప్రయోజనాల గురించి అమాయకంగా ఆలోచిస్తారు. కానీ యూనియన్ల నాయకులకు అర్థం కానిదా?
యథాతథంగా ప్రభుత్వ సిబ్బందికి, కార్పొరేషన్లకు మధ్య నిర్మాణపరమైన, స్వభావపరమైన తేడాలుంటాయి. అందువల్లనే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తెలంగాణలో విలీనమంటున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు తామెందుకు చేయలేదంటూ కేసీఆర్ పలుమార్లు వేసిన సూటి ప్రశ్నకు వారెవరు సమాధానం ఇవ్వలేకపోవటానికి కారణం ఇదే.
వారి ఇవ్వలేని స్థితిని తప్పుపట్టడం లేదు. కానీ వారి ద్వంద్వ ప్రమాణాలు, కపటనీతి మాత్రం తప్పు పట్టదగ్గవే. ఆ కపటనీతి వల్లనే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీసీ యూనియన్ నేతలను రెచ్చగొడుతున్నారు. ఆ నేతలు ముందు వెనుకలు ఆలోచించకుండా అమాయకులైన కార్మికులను రెచ్చగొడుతున్నారు.
ఇటువంటి క్రమంలోనే ఇటీవల బీజేపీ వారు కొత్త వాదన తెచ్చారు. తెలంగాణ ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉందని, ఏమి చేయాలన్నా కేంద్రం అనుమతి కావాలని, కేంద్రంలోని ప్రభుత్వం తమది గనుక తాము విషయాలను నిర్దేశించగలమనే అభిప్రాయాన్ని సృష్టించారు.
దీన్ని నమ్మిన యూనియన్ నాయకులు కూడా అదే వాదనలు చేస్తూ కార్మికులను నమ్మించారు.
చివరికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో, తమకు ఏ వాటా లేదని స్పష్టం చేశా రు.
దానితో బీజేపీ మౌనంలోకి జారుకుంది.
ఈ సందర్భంలో వీరంతా ఏపీలో విలీన ప్రతిపాదనలను ప్రస్తావిస్తున్నారు. ఆ పని నిజంగా జరిగి తే అది దేశంలో ఒక మినహాయింపు అవుతుంది. వారి పరిస్థితులను బట్టి, మ్యానిఫెస్టో హామీ ప్రకారం వారు చేశారనుకోవాలి.
మరి అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అదే ప్రేరణతో తమ రాష్ర్టాల్లో చేయగలమని ప్రకటిస్తాయా?
విలీనం డిమాండ్‌లోని నిర్హేతుకత యూనియన్లకు ఒక దశలో అర్థమైనట్లే తోచింది. వారి న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ, విలీనం ముం దస్తు షరతు కాదన్నట్లు నర్మగర్భంగా సూచించారు.
దానితో ఇక చర్చల కు, సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం కాగలదనే అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా సానుకూల స్పందన చూపారు.
కానీ అంతలోనే ఏమైందో గాని యూనియన్ నేతలు విలీనమే ముందస్తు షరతు అంటూ మళ్లీ గట్టిగా వాదించారు.
దానితో అంతా బిగుసుకుపోయింది.
లేనట్లయితే బహుశా చర్చలు ఎప్పుడో జరిగి సమ్మె ముగిసేది.
ప్రభుత్వం నియమించిన కార్యదర్శుల కమిటీ చర్చల్లోనూ యూనియన్లు విలీనాన్ని ముందస్తు షరతుగా మార్చకుంటే విషయం తేలిపోయేదేమో.
ఆర్టీసీ ప్రస్తుత సమ్మెకు రాడికల్ ట్రేడ్ యూనియనిజం లక్షణాలున్నా యి. యథాతథంగా ఇవి రాడికల్ యూనియన్లు కావు. వాటిలోని వామపక్ష సంఘాలను మినహాయిస్తే తక్కినవాటికి ఆ సిద్ధాంతం, స్వభావం, రికార్డు లేవు. ఒకప్పటి బెంగాల్ యూనియన్లు, ఫరీదాబాద్-ఘాజియాబాద్ యూనియన్ల మాట అట్లుంచి, బొంబాయిలోని దత్తా సామంత్ తరహా రాడికలిజమైనా లేదు వారికి. విలీనం డిమాండ్ కేవలం ఒక అం శానికి పరిమితమైన రాడికలిజం. అది నెరవేరితే రాడికల్ యూనియని జం ఆర్టీసీలో అయినా, తెలంగాణలో ఇతరత్రా అయినా విస్తరించి తీరుతుందనలేముగాని అందుకు కొద్దిపాటి అవకాశాలుంటాయి.
ఈ మాట అనటం ఎందుకంటే, దేశంలో ఒక సంచలన దశగా సాగిన రాడికల్ ట్రేడ్ యూనియనిజం ముగిసిపోయి పాతికేళ్లు దాటింది. దాన్ని నడిపిన పార్టీ లు, సంస్థలు బలహీనపడ్డాయి.
ఆర్థికసంస్కరణలు, ఆటోమేషన్, న్యూ ఎకానమీ తెచ్చిన పెను మార్పులతో స్వయంగా కార్మికుల స్వభావాలు కూడా మారినట్లు, వారిలో అత్యధికులు అసలు యూనియన్ల వైపు చూడటం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు విలీనం అనే రాడికల్ డిమాండ్‌ను ముందుకుతెచ్చాయి. అదొక పులి వంటి డిమాండ్. వారు ఆ పులిని సృష్టించారు. దానిపై సవారీ చేస్తున్నారు. కార్మికులను ఆ పులి వెంట పరిగెత్తిస్తున్నారు. పరిస్థితులు క్రమంగా ఎట్లా తయారవుతున్నాయంటే వారు ఆ పులిపై సవారీ చేయలేరు. కిందకు దిగలేరు.
రాడికల్ యూనియనిజంలో ఇటువంటి పరిస్థితులు తరచు ఎదురవుతుంటాయి. అయితే, వెనుక మద్దతుగా సొంత పార్టీలు ఉండి (కమ్యూనిస్టుల వలె), తమ స్వరూప స్వభావాలే రాడికల్ అయిన యూనియన్ల పరిస్థితి వేరు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ఆ కోవలోకి రావు. కనుక అవి దిక్కుతోచని స్థితిలో పడుతాయి. ఏపీఎస్‌ఆర్టీసీ అసలు విభజన కాలేదని, టీఎస్‌ఆర్టీసీలో తమకు వాటా లేదని కేంద్ర న్యాయవాది ప్రకటించటం వారికి కొత్త సమస్యలు సృష్టించనున్నది.
ఆర్టీసీలో అనేక బస్సులు కండీషన్ కోల్పోవటం, కొత్త బస్సుల ఖరీదుకు డబ్బు లేకపోవటం, ఇచ్చేందుకు ప్రభుత్వానికి గల ఆర్థికఇబ్బందులు మరొక సమస్య. ఆర్టీసీపై ఇప్పటికి గల మొత్తం బకాయిల భారం రూ.2209 కోట్లని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
వీటిమధ్య రూట్ల ప్రైవేటీకరణ (సంస్థగా ఆర్టీసీ కాదు), అందుకు అనుకూలంగా వచ్చిన కేంద్ర చట్టం మరొక తరహా ప్రశ్న. మొత్తమ్మీద ఏ ఒక్కటీ యూనియన్ నాయకులకు అనుకూలంగా సాగ టం లేదు. చివరికి సమస్య సాధారణ, అమాయక కార్మికులకు చుట్టుకుంటున్నది.
ఈ సందర్భంగా అందరూ గుర్తించవలసిన విషయం ఒకటున్నది. స్వాతంత్య్రానికి ముందులేని ప్రభుత్వరంగ సంస్థలు నెహ్రూ అభివృద్ధి నమూనా వల్ల ప్రముఖంగా ముందుకువచ్చాయి. కానీ అవి వివిధ కారణాల వల్ల విఫలమవుతుండటం వల్ల కొంత, దేశంలో ఆర్థికసంస్కరణలు మొదలుకావడంతో కొంత, ప్రైవేటీకరణ దశ అంతటా వచ్చివేసింది.
ఈ పరిణామక్రమం ఇండియాలోనే కాదు. వలసపాలన నుంచి బయటపడి సోషలిజం అంటూ మాట్లాడిన తృతీయ ప్రపంచదేశాలు అంతటా సాగిం ది. చివరికి రష్యాలోనూ పెరిస్ట్రోయికాలో భాగంగా ఇదే పని చేశారు. సరైనదా కాదా అనే చర్చ ఎట్లున్నా ఇది ప్రపంచవ్యాప్తమైన చేదునిజాల చరి త్ర. పరిస్థితులు ఇట్లా పరిణమించటానికి గల కారణాల్లో రాడికల్ ట్రేడ్ యూనియనిజం కూడా ఒకటి.
ఇవన్నీ చాలవన్నట్లు యూనియన్ నాయకులు సాధారణ ప్రజల సానుభూతిని పోగొట్టుకునే పొరపాటు ఒకటి మొదటిలోనే చేశారు. అది, పండుగకు ముందు సమ్మెను ఆరంభించటం. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకునే ఎత్తుగడలో ఆలోచన లోపించిందని, దాని ఖరీదు ప్రజల సానుభూతి అని తేలేందుకు ఎక్కువరోజులు పట్టలేదు.
ఆ విధంగా ఇప్పటికి 40 రోజులు గడిచినా సమ్మె పట్ల ప్రజల్లో ఉత్సుకత మినహా సానుభూతి కన్పించటం లేదు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యామ్నాయ రవాణా పెరిగినా కొద్దీ ప్రజలు సమ్మెను పట్టించుకోవటం కూడా తగ్గిపోయింది.
ఎవరైనా కార్మికుడు చనిపోయినపుడు అయ్యోపాపం అనటానికి మించి స్పందనలు కన్పించటం లేదు. యూనియన్ల చుట్టూ చేరి అంతా నిర్దేశిస్తున్న పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవటం ఇందుకు తోడవుతున్నది. ఈ పరిస్థితుల్లో పులి సవారీ నుంచి దిగటమెట్లా అన్నది యూనియన్ నేతలు తమలో తాము, జాగ్రత్త గా, భేషజాలకు పోకుండా, భవిష్యత్తును, కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకుంటూ చేయవలసిన ఆలోచన

Thursday, November 7, 2019

తిండి సరిపోక చేసేది సమ్మె! ‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !! - రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)


తిండి సరిపోక చేసేది సమ్మె!
‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !!
- రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019)

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు, 4 వారాలకు పైగా సమ్మెలో ఉన్నారు. ‘ఆర్టీసీకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని అడుగుతున్నాం’ అన్నారు, ఆ కార్మికులు. 26 సమస్యల్ని చెప్పారు. కార్మికులు ఒక్క సమస్యని చెప్పినా, పాలకులు ఒక్క గంటలో, శ్రద్ధ పెడితే, అరగంటలో కదలాలి. కానీ ఇక్కడ 26 సమస్యలకు కూడా, పాలకులకు ఆ కదలిక ఎన్ని రోజులైనా లేదు.

ఆర్టీసీ సమస్యలేమిటో కొన్నైనా చూద్దాం. ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యకూడదని. ప్రభుత్వ సంస్తగా మార్చాలని. జీతాల సవరణ చెయ్యాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని. ఖాళీగా వున్న ఉద్యోగాలని నింపాలని. కాలం చెల్లిన పాత బస్సుల్ని తీసివేసి, కొత్త బస్సుల్ని పెట్టి, ప్రయాణీకులకూ, డ్రైవర్లకూ రక్షణ కల్పించాలని.

ఏ శాఖలో అయినా, సమస్యలు తలెత్తుతోంటే, వాటిని పాలకులు తక్షణం చూసుకోవాలా లేదా? కానీ, ఈ పాలకులు, ‘అటువంటి పాలకులం కాము’ అని రుజువు చేసుకుంటున్నారు. ఆర్టీసీలో 26 సమస్యలు పేరుకు పోయి వున్నాయంటే, అదేనా పరిపాలన?

రవాణా కార్మికులు తమ సమస్యలన్నిటినీ, పాలకులకు మొదట చూపించి, జవాబు రాకే, సమ్మె ప్రారంభించారు. కార్మికులకు సమస్యలు వుంటే, వాటి కోసం పాలకులు కదలక పోతే, శ్రమల్ని ఆపివేయ్యడమే, కార్మికులకు ఆత్మగౌరవం.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రధానంగా, ‘తెలంగాణా మజ్దూర్ యూనియన్’ నాయకత్వాన సాగుతోంది. ఇదే యూనియన్, గతంలో, తెలంగాణా రాష్ట్రం రాక ముందు, పెద్ద మెజారిటీతో గెలిస్తే, ఈ యూనియన్ని, ఆ నాడు, ఇంకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్, తను ఎంతెంత మెచ్చుకోలు మాటలు అన్నదీ మర్చిపోయి వుండవచ్చు గానీ, ఆర్టీసీ కార్మికులకూ, ఆ మాటల్ని తెరమీద చూసిన టీవీ ప్రేక్షకులకూ గుర్తే!
కార్మికుల కాలిలో ముల్లు దిగితే, తన పంటితో తీస్తానని ఆ నాటి వాగ్దానం. ఆ నాడు, అలా ప్రకటించిన ఆ పెద్దమనిషి, ఈ నాడు పాలకుడిగా మారి, ఆ అధికార దర్పంతో, ఆ రవాణా కార్మికుల గురించే అన్న మాటలేమిటో కొన్నిటిని చూడాలి.

మొన్నటి విలేఖరుల సమావేశంలో, పాలకుడు అన్నది: ‘‘తిన్నది అరగక చేసే సమ్మె ఇది!’’
ఈ ఒక్క మాటే కాదు, ఇంకా ఎన్నో!
‘‘పనికి మాలిన సమ్మె’’,
‘‘లవి కానీ కోరికలు’’,
యూనియన్ చిల్లర రాజకీయాలు’’;
‘‘సింగరేణి కార్మికులకు బోనసులు ఇచ్చాను’’,
‘‘ఆర్టీసీ కార్మికులు యూనియన్లు లేకుండా పని చేస్తే వాళ్ళకి కూడా బోనస్ వచ్చేది!’’,
‘‘విలీనం అనేది వివేకం లేని, తెలివితక్కువ నినాదం’’,
‘‘పనికి మాలిన రాజకీయ నాయకులు...
తలకాయలు మాసిపోయినోడు... వీళ్ళా మాట్లాడేది?’’
–ఇలా సాగాయి పాలకుడి అహంకారీ, పెత్తందారీ మాటలు!

రాత్రింబవళ్ళూ శ్రమలు చేస్తూ, వాళ్ళ శ్రమ విలువ అంతా వాళ్ళూ పొందకుండా, కేవలం బళ్ళు నడుపుతూ, జీవించే అమాయకుల మీద అలాంటి మాటలా!
వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా ఈ పాలకుడు అధికార పీఠం ఎక్కింది?
అంత నమ్మారు వాళ్ళు!
ఈ పాలకుడు, ఆ పీఠం ఎక్కక ముందు, ఆ కార్మిక సంస్త గురించి మాట్లాడిందేమిటీ, ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటీ?

అప్పుడు కార్మికుల కాళ్ళలో ముళ్ళని తన పంటితో తీస్తానని!
ఇప్పుడు మాట్లాడేది, ఆ ముళ్ళని తెచ్చి తనే గుచ్చుతానని!
ఒక నాడు శక్తివంతురాలైన కార్మిక యూనియనూ, ఆ నాయకులూ, ఈ నాడు పనికి మాలిన సంస్తా, తలలు మాసిన వాళ్ళూ అయ్యారు ఈయన దృష్టిలో.
ఆనాడు, ఈ యూనియన్ నాయకుల్ని పక్కన నిలబెట్టుకుని, వాళ్ళని కీర్తించిన పాలకుడికి, అదే నాయకులు ఈ నాడు తలలు మాసిన వాళ్ళయ్యారు.
కార్మికుల సమస్యల్ని పరిష్కరించే దృష్టి లేనప్పుడు, కార్మికుల సమ్మెలు పనికి మాలినివిగా కనపడతాయి.

సమ్మెచేసే కార్మికులకు వ్యతిరేకంగా కొత్త కార్మికులు పనుల్లోకి రాకూడదు. ఈ విషయాన్ని, కార్మిక సంఘాలు చాలా కాలం నించి ప్రచారం చేస్తూ, కార్మికులకు నేర్పితే, ఆ కొత్త కార్మికులు రాకపోతే, పాలకుల నిరంకుశత్వం, ఒక్క రోజు కూడా సాగదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుకూలంగా, అనేక మంది వ్యక్తులూ, సంస్తలూ రకరకాలుగా సంఘీభావం చూపించారు. రోజూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి స్పందనలు వారు చూపవలిసిందే.
ఈ సమస్యని, మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నించీ పరిశీలిస్తే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలలో ఉన్న కార్మిక వ్యతిరేక ధోరణిని ప్రజలందరూ, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సరిగా అర్ధం చేసుకోవడానికి వీలవుతుంది.

అలా గాక, ‘మనం కొన్ని సమస్యల్ని పరిష్కరించమని అడిగాం; ముఖ్య మంత్రి ఒప్పుకోవడం లేదు’ అని, మామూలు లోక గ్న్యాన దృష్టితో మాత్రమే అర్ధం చేసుకుంటే, కార్మికుల చైతన్యం ఒక దగ్గిర ఆగిపోతుంది.
అదనపు విలువ సిద్ధాంతం ప్రకారం, రవాణా కార్మికులు, తాము పొందే జీతాలకన్నా, అదనంగా ఎంతో విలువని (డబ్బుని) తెచ్చిపెడతారు సంస్తకి.

ఆ సంస్త ప్రైవేటు పెట్టుబడి దారుడిది అయినా, ప్రభుత్వ ఆధీనంలో నడిచేది అయినా. రవాణా అనేది ఒక పరిశ్రమ. దానిలో తయారయ్యే సరుకు ‘రవాణా’ అనే సౌకర్యం. ప్రయాణీకుల్నీ, వారి సామాన్లనీ ఒక చోటు (ఊరు) నించి ఇంకో చోటుకి (ఊరుకి) తీసికెళ్ళే పని జరుగుతుంది. అక్కడ బస్సులు వున్నంత మాత్రాన సరిపోదు గదా?

దాన్ని నడిపే డ్రైవర్లు వుండాలి. దాన్ని ఎప్పటికప్పుడు పనిచేసే స్తితిలో ఉందో లేదో చూసే మెకానిక్కులూ, క్లీనర్లూ ఉండాలి. వీళ్ళు తమకు వచ్చే జీతలకన్నా ఎక్కువ అదనంగా విలువని ఎలా సృష్టిస్తారో ఒక ఉదాహరణ ద్వారా అతి క్లుప్తంగా చూద్దాం.

ఒక బస్సు ఒక ఊరు నించి ఒక ఊరికి వెళ్తోంది అనుకుందాం. ఆ బస్సులో 50 సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క టిక్కట్టు ధర 40 అనుకుందాం. ఒక ట్రిప్పులో ఆ ప్రయాణం వల్ల వసూలైన మొత్తం 50X40 = 2,000.
ఇందులో, డీజిలూ, బస్సు అరుగుదలా, రోడ్డు అరుగుదలా వగైరాల మీద పెట్టిన ‘పెట్టుబడి’ ఖర్చంతా 500 అనుకుందాం. 2000 లోంచి 500 తీసివెయ్యగా మిగిలేది 1500. ఇది ఆ బస్సుని నడపడం అనే శ్రమ చేసిన డ్రైవరిది. (మన ఉదాహరణలో ఒక్క డ్రైవరే అనుకుందాం.)
అంటే, ఆ బస్సుని నడిపిన డ్రైవరూ, అవసరమైనప్పుడల్లా బస్సుని శుభ్రం చేసే క్లీనర్లూ, మెకానిక్కులూ వగైరా శ్రామికులు కలిపి ఇచ్చిన శ్రమ విలువ అది. ఆ ప్రయాణంలో ఒక్క డ్రైవరే, ఒక్క మెకానిక్కే, ఒక్క క్లీనరే పనిచేశారు –అనుకుంటే, ఆ 1500, ఆ ౩గ్గురు శ్రామికులకే చెందాలి. ఆ ప్రయాణం, 6 గంటల కాలం పట్టిందనుకుందాం. ఆ 6 గంటల డ్యూటీలో పని చేసినందుకు ఆ 3గ్గురు శ్రామికులకూ జీతాలుగా, ఆ బస్సు యజమాని (అతను ప్రైవేటు వ్యక్తి కావొచ్చు, ప్రభుత్వమే కావొచ్చు. ప్రభుత్వం కూడా ఒక యజమానే, ఆర్టీసీ వంటి సంస్తల విషయంలో) 300 ఇచ్చి, మిగిలిన 1200ని ‘లాభం’ పేరుతో తనే తీసుకుంటాడు. ఈ 1200, ఆ 3గ్గురు కార్మికుల నించి వచ్చిన ‘అదనపు విలువ’.

అయితే, బస్సు పెట్టుబడిదారుడికి (ఇక్కడ ఆర్టీసీకి), అదనపు విలువని ఇవ్వని కార్మికులు కూడా ఉంటారు. అయినా వారు చేసేది కూడా శ్రమే.
వాళ్ళూ వేతన శ్రామికులే. ఉదా: టిక్కట్లు అమ్మే శ్రమ అనుత్పాదక శ్రమ. ‘టిక్కెట్ల అమ్మకం’ అనేది, ఏ ప్రయాణానికి అయినా ‘సహజ అవసరం’ కాదు. టిక్కెట్ల అమ్మకం లేకపోయినా, బస్సు కదులుతుంది.

బస్సుని నడిపే శ్రమ లేకపోతేనో, బస్సుకి డీజిల్ లేకపోతేనో బస్సు ఆగిపోయినట్టుగా, టిక్కెట్ల అమ్మకం లేకపోతే బస్సు ఆగిపోదు. కాబట్టి, టిక్కెట్ల పుస్తకాలఖర్చూ, టిక్కెట్లు అమ్మే ఉద్యోగి జీతమూ వంటిఖర్చులు, ఆ ప్రయాణానికి అవసరమయ్యే ‘శ్రమ మొత్తం’లోకి చేరవు.

కానీ, ఆర్టీసీ, ఈ అంశాల మీద కూడా ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చుల్ని 100 అనుకుంటే, డ్రైవరూ వగైరా కార్మికుల ద్వారా వచ్చిన ‘1200 అదనపు విలువ’ నించే ఈ 100ని ఖర్చు పెట్టాలి. ఇంకా 1100 మిగులుతుంది. మన ఉదాహరణలో ఉన్న బస్సు ప్రయాణం 6 గంటలే. ఆ బస్సు రాత్రింబవళ్ళూ పనిలోనే ఉంటుంది. రోజుకి 3, 4 ప్రయాణాలు! ఒక ఊరు నించి ఇంకో ఊరుకి వెళ్ళేప్పుడు ఒక లాభమూ, మళ్ళీ ఆ ఊరు నించి ఈ ఊరికి వచ్చేటప్పుడు ఒక లాభమూ! అలాగ ఒక ట్రిప్పు తర్వాత ఒక ట్రిప్పు తిరుగుతూనే ఉంటుంది. కార్మికులు పగలూ, రాత్రీ పని చేస్తూనే వుంటారు.
ఇప్పుడు చెప్పండి, నిరంతరం శ్రమిస్తూ, సంస్తకి అదనపు విలువ ఇచ్చే కార్మికులు, తమ సమస్యల మీద సమ్మె చేస్తే తిన్నది అరక్క చెయ్యడమా? ఆర్టీసీ కార్మికుల అదనపు విలువనే కాక, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్తల కార్మికుల అదనపు విలువల్ని పన్నుల రూపంలో తన అధీనంలో పెట్టుకునే ప్రభుత్వం చేసే వాదనలన్నీ ‘అదనపు విలువ’ అరక్క చేసే దూషణలే!

‘సింగరేణి కార్మికులకు రెండు లక్షలు బోనసు ఇచ్చాను,
మీరు సమ్మే- గిమ్మే, యూనియన్- గీనియన్ అనకపోతే మీకు కూడా బోనస్ ఇచ్చే వాణ్ణి’ అనడం.
ఆ బోనసుల డబ్బు పాలకుల శ్రమలా?
ఎక్కనుంచి తెచ్చి ఇస్తున్నారు?
ముఖ్య మంత్రీ, ఇతర మంత్రులూ, ఆర్టీసీ అధికారులూ, శారీరక శ్రమో, మేధా శ్రమో చేసి ఆ బోనసులూ, పెంచామంటున్న జీతాలూ ఇస్తున్నారా?
కార్మికులు ఇచ్చిన అదనపు విలువలోనించే కదా తీసి ఇచ్చేది?
పైగా, నిర్జీవమైన గుళ్ళకీ, గోపురాలకీ లక్షల నిధులు. సజీవులైన కార్మిక మానవులకి తిట్లు,
‘అన్నం అరక్క’;
‘బుద్ధిలేని’,
‘పనికి మాలిన’ అంటూ!
అమ్మ వారికీ, శ్రీవారికీ ముక్కు పుడకలూ, కిరీటాలూ. అన్నీ పన్నుల రూపంలో వచ్చిన కార్మికుల అదనపు విలువే.

ఆర్టీసీ కార్మికులూ!
నిరుత్సాహ పడకండి!
కొందరు ఆత్మహత్యల ఆలోచనలు చేశారు. అది సరి కాదు.
ఎందుకంటే, ఈ సమ్మెలో పెట్టిన డిమాండ్లు వ్యక్తిగతమైనవి కావు.
కార్మికులందరికీ సంబంధించినవి.

అందరితో కలిసి పొరాడి సాధించుకోవడానికి ప్రయత్నించాలి.
వ్యక్తులు పోతే ఉద్యమాలు బలహీన పడి పోతాయి.
ఆత్మహత్యలు పాలకుల్ని కదిలించవు.
అలా మనం చేస్తే, వాళ్ళ పెత్తనానికి లొంగిపోయిన వాళ్ళం అవుతాం.

- రంగనాయకమ్మ