Wednesday, March 4, 2020

దళిత్ పాంథర్స్


డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమమే.

ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల  అనంతరం 1977 మార్చి 7న సంస్థను రద్దు చేస్తున్నట్టు ముంబయిలో చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్‌ పాంథర్‌  అంతరించిపోయింది.
నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల  కారణంగా రాజా ఢాలేను,   జె.వి. పవార్‌ ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ ఢసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ ఢసాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌ లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రిక మీదా, ప్రజా సంస్థ మీదా తీవ్రమైన ఆంక్షలు  అమలయ్యాయి. అందువ ల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే` 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.
ఈ కాలంలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమం దేశంలో ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాల ను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజు రోజుకూ పెరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధ సైనికుల  మాదిరిగా వీధుల్లోకి వచ్చిన యువతీ యువకులను వ్యవస్థను ఎదిరించగల  వీరులుగా తీర్చిదిద్దింది.
బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి, అణగారిన వర్గాల పై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలాచేయడం కూడా.

దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం 1974 జనవరి 4 వరకూ ఎంతో ఉధృతంగా సాగింది. ఆ తరువాత 1974 జనవరి 5న ముంబయిలో ముఖ్యంగా వోర్లీ, నయీగావ్‌ ప్రాంతాల్లో ఉద్యమంపై ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిలో దళిత్‌ పాంథర్లు భగవత్‌ జాధవ్‌, రమేష్‌ దేవ్‌రుఖ్ లు  ప్రాణాలు కోల్పోయారు. చాలామంది దళిత యువకుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. అయితే వారి త్యాగాలు కాలేదు. అవి అంబేడ్కరిస్ట్‌ ఉద్యమానికి ఒక కొత్త శక్తిని సమకూర్చాయనే చెప్పాలి. కొన్ని పదవులు, కొద్దిపాటి డబ్బుల కోసం ఉద్యమాన్ని సంపన్నుల పాదాలవద్ద తాకట్టు పెట్టిన పరిస్థితికి ఇది పూర్తిగా భిన్నమైనది. దళిత్‌ పాంథర్‌ కొనసాగింది కొద్దికాలమే అయినా అది భారత సమాజం మీదా, రాజకీయాల మీదా బలమైన ముద్ర వేసింది. ఈ చారిత్రాత్మకమైన ఉద్యమ ప్రభావం ఎంతగొప్పదంటే 2006లో మహారాష్ట్ర భండారా జిల్లా ఖైర్లాంజిలో ఒక దళిత కుటుంబంలో నులుగురిని (ఒక మహిళ, ఆమె యుక్తవయసు కూతురుతో సహా) అత్యంత దారుణంగా హత్యచేసినప్పుడు` కులపరమైన దాడులకు పాల్పడేవారిని నిర్మూలించేందుకు మళ్లీ దళిత్‌ పాంథర్‌ వంటి మిలిటెంట్‌ సంస్థ కావాలి అన్న డిమాండ్‌ తిరిగి బలంగా వినిపించింది.

ఈ ఉద్యమంపై ఇప్పటికే పలు పరిశోధనాపత్రాలు, సంకలనాతో సహా అనేక రచనలు వెలువడ్డాయి.
వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను, ఉద్యమకారులతో జరిపిన సంభాషణలను ఆధారంగా చేసుకుని దళిత్‌ పాంథర్‌పై ఆ పరిశోధనా పత్రాలను, వ్యాస సంకలనాలను తయారుచేశారు. చాలామంది తమ సైద్ధాంతిక ఆలోచనలకు అనుగుణంగా, తమకు నచ్చిన రీతిలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమాన్ని విశ్లేషించారు. రకరకా వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చరిత్రను వక్రీకరిస్తూ, గాలివాటంగా చేసినవే ఎక్కువ. మరికొందరు ప్రచారం కోసం, తాత్కాలిక లబ్దికోసం ఉద్యమకారులమనే ముసుగుతో, ఉద్యమ పితామహులమని చెప్పుకుంటూ రచనలు చేశారు.
ఉద్యమాన్ని మొట్టమొదటి రోజునుంచీ పరిశీలించిన ప్రత్యక్ష సాక్షిని నేను. కేవం ప్రేక్షకుడిగానో, రచయితగానో కాకుండా ఈ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకడిగా, చురుకైన ఉద్యమకారుడిగా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాను. దళిత్‌ పాంథర్‌ సంస్థకు నామ్‌దేవ్‌ ఢసాల్‌, నేనూ వ్యవస్థాపకలం. అలాగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలకమైన వ్యక్తి రాజా ఢాలే.

కాబట్టి, దళిత్‌ పాంథర్‌ ఉద్యమ చరిత్రను రాజా ఢాలే, నామ్‌దేవ్‌ ఢసాల్‌, జె.వి.పవార్‌ (నేను) మాత్రమే సరిగ్గా లిఖించేందుకు అర్హులమని భావిస్తాను. నేను మొదట దళిత్‌ పాంథర్‌ నిర్వాహకుడిగా, ఆ తరువాత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తత్ఫలితంగా సంస్థకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, దస్తావేజులు అన్నీ నావద్ద భద్రంగా వున్నాయి. ఆ రోజుల్లో ఫొటో కాపీయింగ్‌ యంత్రాలు అందుబాటులో వుండేవి కావు. అందువల్ల ఉత్తరాలను, ప్రకటనలను రాసేటప్పుడు కార్బన్‌ పేపర్లను ఉపయోగించి ప్రతులను తయారు చేసేవాళ్లం. అలాంటి వాటన్నింటినీ నేను జాగ్రత్తగా దాచిపెట్టాను.
ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాన్నింటికీ నావద్ద సాక్ష్యాధారాు వున్నాయనీ, ఇవన్నీ సాధికారికమైనవనీ స్పష్టం చేసేందుకే నేనీ మాట చెబుతున్నాను. వీటికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ప్రాచీన పత్ర భాండాగారాన్నీ, పోలీసు ఇంటలిజెన్సు విభాగా దస్తావేజులను అన్నింటినీ పరిశీలించేందుకు అనుమతినిచ్చారు. అందువల్ల నా ఈ రచనకు మరింత సాధికారికత చేకూరింది.


నేనూ, నా కవి మిత్రుడు నామ్‌దేవ్‌ ఢసాల్‌ కలిసి 1972లో దళిత్‌ పాంథర్‌ని నెలకొల్పాం. అది స్వల్ప కాలమే కొనసాగినప్పటికీ అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం మాదిరిగా అంబేడ్కర్‌ మరణానంతర ఉద్యమాలన్నింటికీ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.  

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్‌ చిత్తశుద్ధితో కృషి చేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందించగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం 'దళిత్‌ పాంథర్‌' వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తచుకోవడం కనిపిస్తుంది.

దీనిని బట్టి దళిత్‌ పాంథర్‌ కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

ఆ దృష్టితోనే ఈ రచనను ముందుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీసుకురావడం జరిగింది. నేను దళిత్‌ పాంథర్‌ చరిత్రను దళిత్‌ పాంథర్స్‌అన్న పేరుతో 2010 డిసెంబర్‌ 6 న మరాఠీలో వెలువరించాను. మరాఠీ పాఠకులు, కార్యకర్తలు దానిని విశేషంగా ఆదరించారు.
దళిత్‌ పాంథర్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రపంచం నలుమూలల నుంచీ పరిశోధకులు, విద్యార్థులు తరచూ అడుగుతుంటారు. అందువల్లే ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీషు భాషల్లో వస్తే చాలా ఉపయోగంగా వుంటుందని నాకు అనిపించింది. అమెరికా బ్లాక్‌ పాంథర్స్ కు  చెందిన ఉద్యమకారిణి ఆంజెలా డేవిస్‌ 2016 డిసెంబర్‌ 16న భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికాలో పోరాడుతున్న ఆఫ్రికన్‌`అమెరికన్‌ సోదరీ సోదరుల ప్రయోజనం కోసం ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 దళిత్‌ పాంథర్స్‌ మరాఠీ ముద్రణ ద్వారా ప్రయోజనం పొందిన కార్యకర్తలు, పరిశోధకులు ఈ ఆంగ్లానువాదాన్ని (అలాగే తెలుగు అనువాదాన్ని) మరింత ఉపయుక్తమైనదిగా భావిస్తారని ఆశిస్తున్నాను.
                                                                                                              - జె.వి. పవార్

(దళిత్ పాంథర్స్ చరిత్రకు రాసిన ముందుమాట నుంచి)
దళిత్ పాంథర్స్ చరిత్ర
రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం  : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
252 పేజీలు , వెల : రూ.180 /-.
ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006
Phone: 040 2352 1849
Email: hyderabadbooktrust@gmail.com


No comments:

Post a Comment