Sunday, March 22, 2020

కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే



కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే

తిరుపతిలో 22 మార్చి 2020 ఆదివారం నాడు ‘దళిత సాహిత్య వికాస వేదిక’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు  ప్రచురించిన ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. 

ఆరోజు  దేశవ్యాప్తంగా జనతా కర్‌ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆర్‌.పి.ఐ. రాష్ట్ర అధ్యక్షు పి. అంజయ్య ఇంట్లో కొద్దిమంది సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. 

ఈ సందర్భంగా పి. అంజయ్య మాట్లాడుతూ 1985లో కారంచేడు దళితుల పై జరిగిన హత్యాకాండను ప్రతిఘటించేందుకు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభకు దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఎంతో స్ఫూర్తి నిచ్చింది అన్నారు. 19172లో మహారాష్ట్రలో ఏడుగురు దళిత యువకులతో మొదలైన దళిత్‌ పాంథర్స్‌ సంస్థ యావత్‌ దేశంలో నిద్రాణమై వున్న దళిత చైతన్యాన్ని తట్టి లేపిందని, తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా అంబేడ్కర్‌ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడంలో గణనీయమైన విజయాలను సాధించిందని అన్నారు. 

అమానుషమైన అంటరానితనం పూర్తిగా నిర్మూలించబడాలంటే, కులాల మధ్య అంతరాలు సమూలంగా తొలగి, కుల నిర్మూలన జరిగి  సర్వమానవ సమానత్వం సాధించబడాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ రచనలను తప్పనిసరిగా చదవాలన్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ కొద్దికాలమే కొనసాగినప్పటికీ అది మన సమాజంపై ఎన్నటికీ చెరగని ముద్రవేసిందనీ, ఇప్పటికీ దళిత్‌ పాంథర్స్‌ చేసిన పోరాటాలు మనకు స్పూర్థినిస్తూనే వున్నాయని అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత వుందన్నారు. 

నాటి కార్యక్రమంలో టి.టి.డి. ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రొఫెసర్‌ ఎ. మోహన్‌,  ఆర్‌.పి.ఐ. జిల్లా అధ్యక్షులు ఎ. సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నాయకులు పి. ప్రభాకర్‌, ఎస్‌. సుబ్రమణ్యం, సహదేవ్‌, రెడ్డి బాబు తదితరులు  పాల్గొన్నారని దళిత సాహిత్య వికాస వేదిక వారు తెలియజేశారు. 

Tuesday, March 17, 2020

విశాఖపట్నంలో, హైదరాబాద్‌లో ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ

విశాఖపట్నంలోహైదరాబాద్‌లో దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ









హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన దళిత్‌ పాంథర్స్‌ చరిత్రపుస్తకాన్ని మార్చి 14న విశాఖపట్నంలో, మార్చి  15న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ రెండు సమావేశాలలోనూ పుస్తక రచయిత జె. వి. పవార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్నంలో రామాటాకీస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన సభను స్థానిక భీమసేన వారు నిర్వహించారు. 

పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జె. వి. పవార్‌ మాట్లాడుతూ మన సమాజంలో సమానత్వం రావాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ రచనలను చదవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే తను ముద్రణకు నోచుకోకుండా వుండిపోయిన అనేక అంబేడ్కర్‌ రచనలను  సేకరించి, అంబేడ్కర్‌ భార్యనీ, కుమారుడినీ ఒప్పించి మొత్తం 22 సంపుటాల రూపంలో అంబేడ్కర్‌ సమగ్ర రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రచురింపజేసేందుకు నిబద్ధతతో కృషి చేసినట్టు చెప్పారు. అంబేడ్కర్‌ నిర్యాణానంతర ఉద్యమాలలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత వుందన్నారు. దళిత్‌ పాంథర్‌ సంస్థ కొద్ది కాలమే మనుగడ సాగించినప్పటికీ మహారాష్ట్రలో, ఆమాటకొస్తే యావత్‌ భారతదేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలనూ, అత్యాచారాలనూ ఎదిరించేలా దళిత్‌ యువతను సంఘటిత పరచడంలో, చైతన్య పరచడంలో చెప్పుకోతగ్గ విజయం సాధించిందని చెప్పారు. 

నాటి సభలో భీమ సేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ,  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు గీతా రామస్వామి, ప్రముఖ అంబేడ్కరీయులు వి. రాఘవేంద్రరావు,  డా. కె.వి.పి. ప్రసాదరావు, ప్రముఖ బహుజన రచయిత దుప్పల రవికుమార్‌, అంబేడ్కర్‌ మెమోరియల్‌ సొసైటీ అధ్యక్షులు ఇంటి గురుమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. వక్తల ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన ప్రేక్షకులు పుస్తకం కొనేందుకు పొటీపడ్డారు.  తీసుకువెళ్లిన పుస్తక ప్రతులన్నీ కాసేపట్లోనే అమ్ముడుపోవడం ఒక విశేషం.


హైదరాబాద్‌లో మార్చి 15న బంజారాహిల్స్‌ లమకాన్‌లో జరిగిన సభలో  పుస్తక రచయిత జె.వి.పవార్‌ మాట్లాడుతూ దళిత్‌ పాంథర్‌ ఆవిర్భావానికి దారితీసిన ఆనాటి పరిస్థితులను, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించడంలో తాము అనుసరించిన పద్ధతులను, సాధించిన విజయాలను వివరించారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. 

సుబోధ్‌ మోరే, సురేష్‌ కరడే లు ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితులలో లాల్‌ జెండా నీల్‌ జెండా ఏకం కావసిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. కన్హయ్య కుమార్‌ వంటి కమ్యూనిస్టు యువ నేతలు ప్రతి సభలో జై భీమ్‌, లాల్‌ సలామ్‌ అంటూ రెండు నినాదాలు  చేస్తుండడం ఒక శుభపరిణామం అన్నారు. 

అనువాదకుడు  ప్రభాకర్‌ మందార మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు తాను ఎంతో ఉద్వేగానికి గురైనట్టు, కొన్ని సంఘటనలైతే కంటతడిపెట్టించినట్టు, ఆగ్రహావేశాలకు గురిచేసినట్టు చెప్పారు. సభలో ఇంకా హెచ్‌బిటి నిర్వాహకులు గీతా రామస్వామి ప్రభృతులు పాల్గొన్నారు.    
.......

దళిత్ పాంథర్స్ చరిత్ర

రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం  : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార

252 పేజీలు , వెల : రూ.180 /-.

ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006

Phone: 040 2352 1849

Email: hyderabadbooktrust@gmail.com